గతంలో ఏ ముఖ్యమంత్రి కూడా పాల్పడని విధంగా చంద్రబాబునాయుడు క్విడ్ ప్రో కోకు పాల్పడుతున్నారు. తాజాగా అంగన్ వాడీ టీచర్లతో జరిగిన సమావేశంలో చంద్రబాబు మాట్లాడిన విషయాలు క్విడ్ ప్రో కో కిందకే వస్తాయి. గత ప్రభుత్వాల్లో క్విడ్ ప్రో కో ఎక్కడైనా జరిగినా లోపాయికారీగా జరిగేదేమో. వైసిపి అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డిపై విచారణ జరుగుతున్న కేసుల్లో క్విడ్ ప్రో కో ఆరోపణలు కూడా ఉన్న విషయం అందరికీ తెలిసిందే. ఆ విషయంపైనే చంద్రబాబు, మంత్రులు, నేతలు ఎన్నోసార్లు జగన్ పై ఆరోపణలు చేశారు.
క్విడ్ ప్రో కో మరీ బహిరంగంగానా ?
తాజాగా అంగన్ వాడీ టీచర్లతో జరిగిన సమావేశంలో చంద్రబాబు కూడా అదే క్విడ్ ప్రోకో కు పాల్పడుతున్నారు. (మీకు జీతాలు పెంచాను కాబట్టి మాకు ఓట్లేయించి పెట్టండి) అదికూడా బహిరంగంగానే సుమా. గోలచేయకుండానే అంగన్ వాడీ టీచర్లకు జీతాలు పెంచినట్లు చెప్పుకున్నారు. అంతవరకూ సంతోషమే. కానీ తర్వాత మాట్లాడిన మాటలే అభ్యంతరకరంగా ఉన్నాయి. ఎవరూ ఆడకుండానే జీతాలు పెంచినందుకు టీచర్లంతా తనకు కృతజ్ఞతగా ఉండాలని చంద్రబాబు అనటమే విచిత్రంగా ఉంది. అధికారంలో ఉన్నపుడు ప్రజా సమస్యలు పరిష్కరించటం ప్రభుత్వం బాధ్యత అన్న విషయాన్ని చంద్రబాబు మరచిపోయినట్లున్నారు.
వైసిపి నేతలు కోతిమూకా ?
అలవికాని హామీలను గుప్పిస్తున్న కోతిమూకలు అధికారంలోకి వస్తే రాష్ట్రం కుక్కలు చింపిన విస్తరిలా మారిపోతుందని అంగన్ వాడీ టీచర్లు ప్రజలకు చెప్పాలట. వచ్చే ఎన్నికల్లో టిడిపికి అనుకూలంగా పనిచేయాలంటూ నిశ్శిగ్గుగా చంద్రబాబు అడగటమే ఆశ్చర్యంగా ఉంది. రాష్ట్రంలో జరిగని అభివృద్ధిని, ప్రభుత్వం సాధించిన విజయాలను పిల్లల తల్లి దండ్రులకు, గ్రామీణ ప్రాంతాల్లో ప్రచారం చేయాలట. ఎటువంటి పోరాటం చేయకుండానే జీతాలు పెంచటంతో అంగన్ వాడీ టీచర్ల ఎవరెస్ట్ శిఖరాన్ని ఎక్కినంత ఆనందం కనబడుతోందని చంద్రబాబే చెప్పేసుకోవటం విచిత్రంగ ఉంది.
అలవికాని హామీలిచ్చిందెవరు ?
జగన్ అలవికాని హామీలిస్తున్నట్లు చంద్రబాబు చెప్పటమే వింతల్లో కెల్లా వింత. ఎందుకంటే, 2014 ఎన్నికల్లో చంద్రబాబు చేసిందదే. అప్పట్లో జగన్ అటువంటి హామీలకు దూరంగా ఉన్నారు. చంద్రబాబు చెప్పిన రైతు రుణమాఫీ, డ్వాక్రా రుణాల మాఫీ లాంటి హామీలను ఇవ్వమని ఎంతమంది నేతలు ఒత్తిడి పెట్టినా ఆచరణ సాధ్యం కానీ హామీలను ఇవ్వనని జగన్ తెగేసి చెప్పారట. జగన్ కూడా చంద్రబాబు చేసిన హామీలనే చేసివుంటే పరిస్దితి ఎలాగుండేదో ? అప్పట్లో చంద్రబాబు చెప్పిన రుణమాఫీలు, ఇంటికో ఉద్యోగం లేకపోతే నిరుద్యోగ భృతి, రాజధాని నిర్మాణం, కాపులను బిసిల్లోను, బోయలను ఎస్టీల్లో చేర్చటం లాంటి 600 హామలు ఎంత వరకూ అమలు చేశారో అందరికీ తెలిసిందే. అటువంటి చంద్రబాబు ఇపుడు జగన్ హామీల గురించి మాట్లాడుతున్నారంటే ఎక్కడో తేడా కొడుతున్నట్లే.
నేతలు, క్యాడర్ పై నమ్మకం కోల్పోయారా ?
వచ్చే ఎన్నికల్లో గెలుపుపై చంద్రబాబులో ఆందోళన స్పష్టంగా కనబడుతోంది. ఎందుకంటే, మూడు రోజుల క్రితం సాధికారమిత్రలతో మాట్లాడుతూ, ప్రతీ 35 కుటుంబాలకు ఒక సాధికారమిత్ర ప్రభుత్వ పథకాలపై వివరించి చెప్పాలని ఆదేశించారు. ప్రతీ కుటుంబానికి ప్రభుత్వం గురించి పాజిటివ్ గా చెప్పాలట. ఇపుడేమో అంగన్ వాడీ టీచర్లతో అదే మాట చెబుతున్నారు. అంటే నేతలు, టిడిపి క్యాడర్ వచ్చే ఎన్నికల్లో సక్రమంగా పనిచేస్తారన్న నమ్మకం చంద్రబాబులో లేనట్లుంది. అందుకనే సాధికారమిత్రలు, అంగన్ వాడీ టీచర్లతోనూ సమావేశాలు పెట్టుకుని బ్రతిమాలాడుకోవటం, బెదిరించటం చేస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో వీళ్ళెంత వరకూ చంద్రబాబుకు సహకరిస్తారో చూడాల్సిందే ?