ఆంధ్రప్రదేశ్ లో ఇప్పుడు పవన్ కళ్యాన్ రాజకీయంగా దూకుడు పెంచారు. సార్వత్రిక ఎన్నికల సమయంలో జనసేన పార్టీ స్థాపించిన ఆయన వచ్చే ఎన్నికల్లో ప్రత్యేక్షంగా పోటీ చేసేందుకు సిద్దం అవుతున్నారు. ఈ నేపథ్యంలో ఆయన తెలుగు రాష్ట్రాల్లో పర్యటించాలని ప్రణాళిక రూపొందించారు. అంతే కాదు ఇప్పటికే ఉత్తరాంధ్రలో శ్రీకాకుళం, విశాఖ లో పర్యటించారు. ఆయన విజయవాడలో పర్యటన చేసేందుకు సిద్దంగా ఉన్నారు. అమరావతిలో ఉంటూ పార్టీ వ్యవహారాలు పూర్తిగా చక్కబెట్టేందుకు విజయవాడలో అద్ద భవనం తీసుకున్నారు.
గత కొంత కాలంగా అధికార పార్టీపై పవన్ ఎన్నో సంచలన వ్యాఖ్యలు చేస్తున్న విషయం తెలిసిందే. తాజాగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ టీడీపీపై మరోమారు విరుచుకుపడ్డారు. కడప ఉక్కు ఫ్యాక్టరీని ఒకప్పుడు అడ్డుకున్న టీడీపీ ఇప్పుడు దాని కోసం గోలగోల చేస్తోందని దుయ్యబట్టారు. రాష్ట్రానికి పరిశ్రమలు వస్తే యువతకు ఉద్యోగాలు వస్తాయని భావించానని, గత ఎన్నికల్లో టీడీపీకి అందుకే మద్దతు ఇచ్చానని తెలిపారు. అయితే, హామీలు నెరవేర్చడంలో టీడీపీ ప్రభుత్వం విఫలం కావడంతో బయటకు వచ్చానన్నారు.
ఇక బాబు వస్తే..జాబులు వస్తాయని ప్రజలు గుడ్డిగా నమ్మారని..ఆ నమ్మకాన్ని టీడీపీ వమ్ము చేసిందని ఇకముందు ప్రజలు మోసపోరని అన్నారు. ప్రస్తుత పరిస్థితులు ఇలాగే కొనసాగితే రాష్ట్రంలో నిరుద్యోగం పెరిగి, యువతలో అశాంతి నెలకొంటుందని పవన్ ఆందోళన వ్యక్తం చేశారు. ఉక్కు పరిశ్రమ కోసం ఈ నెల 29న చేపట్టనున్న రాష్ట్ర బంద్కు జనసేన మద్దతు ఇస్తుందని పవన్ ప్రకటించారు. వామపక్షాలదీ తమదీ ఒకే భావజాలమని, సెప్టెంబరులో జనసేన, వామపక్షాలు, లోక్సత్తా పార్టీలు కలిసి భవిష్యత్ కార్యాచరణను నిర్ణయిస్తాయని తెలిపారు.