తెలంగాణా ముఖ్యమంత్రి కెసిఆర్ 40 ఇయర్స్ ఇండస్ట్రీ చంద్రబాబునాయుడు గాలి తీసేశారు. చంద్రబాబుది అసలు పాలనే కాదన్నట్లుగా తీసిపారేశారు. ఏపిలో పాలన కన్నా మాటలు, ప్రచారమే ఎక్కువగా సాగుతోందని కుండబద్దలు కొట్టినట్లు చెప్పారు. కాంగ్రెస్ నేత దానం నాగేందర్ పార్టీలో చేరిన సందర్భంగా జరిగిన కార్యక్రమంలో కెసిఆర్ మాట్లాడుతూ, పక్క రాష్ట్రంలో ఏం జరుగుతోందో చూస్తున్నాం కదా ? అంటూ ఎద్దేవా చేశారు.
ఏపిలో మాటలు తప్ప పాలనేమైనా ఉందా ?
నాలుగేళ్ళ నుండి ఏపిలో జరుగుతున్నదేంటో మనం చూడట్లేదా ? డుమ్కీలు కొట్టటం తప్ప పనేమన్నా జరుగుతున్నదా ? అంటూ నేతలను ప్రశ్నించారు. మాకంటే పెద్ద ఎవడూలేడన్నోడు ఏ స్ధాయిలో ఏదేదో చేసేస్తామని అక్కడి పాలకులు చాలా చెప్పారు ? ఏమన్నా చేశారా ? ఒక్క పనైనా జరుగుతోందా ? అంటూ మండిపడ్డారు. మాటలు చెప్పుకుంటే చాలదు పనులు కూడా కావాల...లేకపోతే అయ్యేదేమీ లేదని చాలా సార్లే రుజువైందన్నారు. ఏపికి భిన్నంగా తెలంగాణాల మనం కష్టపడి పనిచేస్తున్నమని చెప్పారు. ఇక్కడ పనులు జరుగుతున్నాయి కాబట్టే అభివృద్ధి కనబడుతోంది, ఫలితాలు వస్తున్నాయంటూ కెసిఆర్ తన పాలనకు తానే కితాబిచ్చుకున్నారు.
జనాలే నెత్తిన పెట్టుకుంటారు
మంచి పనులు చేసే ప్రభుత్వాలను ప్రజలు ఎప్పటికీ వదులుకోరని కూడా కెసిఆర్ చెప్పారు. కాకపోతే అందుకు ఉదాహరణగా ఒడిస్పా, ఛత్తీస్ ఘర్, మధ్యప్రదేశ్ రాష్ట్రాలను చూపటం ఆశ్చర్యంగా ఉంది. ఒడిస్సాలో నవీన్ పట్నాయక్ నాలుగు సార్లు గెలిస్తే, మధ్య ప్రదేశ్, ఛత్తీస్ ఘర్ లో బిజెపి ప్రభుత్వాలు విజయవంతంగా మూడోసారి పదవీ కాలాన్ని పూర్తి చేసుకుంటోందని చెప్పారు. మంచి చేస్తే జనాలే నాయకుల్ని నెత్తిన పెట్టుకుని పూజిస్తారు..తప్పు చేస్తే కచ్చితంగా శిక్షిస్తారంటూ చెప్పుకొచ్చారు కెసిఆర్.