విజయనగరం జిల్లా టీడీపీకి షాక్ తగిలింది. విజయనగరం జిల్లా శాసన మండలి సభ్యుడు, మూడు మార్లు జిల్లా టీడీపీ అధ్యక్షుడిగా పనిచేసిన సీనియర్ నేత ద్వారంపూడి జగదీష్ సోదరుడు డాక్టర్ రామ్మోహనరావు బీజేపీ తీర్ధం పుచ్చుకున్నారు. అంతేనా.. మహా గొప్పగా తాను బిజెపిలో చేరినందుకు ఏకంగా టీడీపీ ఆఫీస్ లోనే సభ కూడా పెట్టేసి కాషాయ జెండా ఎగరేశారు. ఈ దెబ్బతో సొంత తమ్ముడితో పాటు తెలుగు తమ్ముళ్ళందరికీ దిమ్మ తిరిగి బొమ్మ కనిపించింది.
అన్నదమ్ముల సవాల్
ఆ ఇద్దరు బ్రదర్స్ దీ టీడీపీతో పాతికేళ్ళ బంధం. పార్వతీపురానికి చెందిన ద్వారంపూడి కుటుంబానిది మొదట కాంగ్రెసే. లోకల్ టిడిపి ఎమ్మెల్యే చనిపోవడంతో ఆ ప్లేస్ ని రీప్లేస్ చేయడానికి ఇద్దరు అన్నదమ్ములూ టీడీపీలో దూకారు. పార్టీలో మంచి గౌరవం కూడా పొందారు. అయితే అన్న డాక్టర్ కావడంతో తమ్ముడు ఫుల్ టైం రాజకీయాలు చేస్తూ వచ్చాడు. రేపటి ఎన్నికలో అవకాశం వుంటే ఎమ్మెల్యేగా పోటీకి రెడీ అవుతున్న తరుణంలో ఇంట్లోనే ముసలం పుట్టి అన్న హఠాత్తుగా ప్లేట్ ఫిరాయించేశాడు. జిల్లా టూర్ కి వచ్చిన కన్నా లక్ష్మీ నారాయణ సమక్షంలో బీజేపీ కండువా కప్పుకున్నాడు.
పసుపు కోటకు బీటలు
తాజా పరిణామంతో పసుపు కోటకు బీటలు పడినట్లే. ఇద్దరు అన్నదమ్ములూ చెరో వైపు చీలిపోవడంతో టీడీపీ కూడా సగానికి సగం అయినట్లే. దీంతో ద్వారంపుడి జగదీష్ డీలా పడిపోగా వైసీపీలో అనందం ఎక్కువైంది. వచ్చే ఎన్నికలలో ఇక్కడ వైసీపీ విజయం ఖాయమని ఆ పార్టీ నేతలు చంకలు గుద్దుకుంటున్నారు. కొప్పుల వెలమ సామాజిక వర్గానికి చెందిన ద్వారంపూడి ఫ్యామిలీ రెండు కావడం, అనుచరులు కూడా తలో దిక్కు కావడం పెద్ద దెబ్బేనని తమ్ముళ్ళు కూడా మధన పడుతున్నారు.
పోటీకి సై
మొత్తానికి అన్నదమ్ముల మధ్య చిచ్చు పుణ్యమా అని పార్వతీపురం అసెంబ్లీ సీటుకు బీజేపీకి ఓ క్యాండిడేట్ దొరికేశాడు. డాక్టర్ గా జనంలో వున్న మంచి పేరు వల్ల, టీడీపీ నుండి తెచ్చుకున్న సొంత బలం వల్ల ఓట్లను బాగా చీలుస్తారు. ఇది ప్రత్యర్ధి వైసీపీకే యూజ్ అవుతుందన్నది పొలిటికల్ పండిట్స్ మాట. మొత్తానికి కన్నా ఎంత పని చేసావన్నా అనుకోవడం తమ్ముళ్ళ వంతుగా వుంది.