రాష్ట్ర రాజకీయాలు రివర్స్ గేర్లోకి మారుతున్నాయి. నిన్న మొన్నటి వరకు అధికార పార్టీ నుంచి చీమైనా కదలని పరిస్థితి ఉంటే.. ఇప్పుడు ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో కొండలే కదిలిపోతున్నాయి. అది కూడా ఏ జనసేనలోకో.. కాదు.. కన్నా లక్ష్మీనారాయణ అభయం చూసుకుని బీజేపీలోకా.. అంటే అదీకాదు.. టీడీపీ నేతలు పొద్దున లేస్తే.. తిట్టి పోసే ప్రధాన, ఏకైక విపక్షం వైసీపీలోకి! అత్యంత ఆసక్తికరంగా ఉన్న ఆ స్టోరీ ఏంటో చూద్దామా?! నెల్లూరు జిల్లా కొవ్వూరు నుంచి 2014 ఎన్నికల్లో టీడీపీ తరఫున బరిలోకి దిగిన పొలంరెడ్డి శ్రీనివాసరెడ్డి గెలుపు గుర్రం ఎక్కారు.
పక్కా కాంగ్రెస్ వాది అయిన శ్రీనివాసులు రెడ్డి.. గతంలో 2004లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున ఇక్కడి నుంచే విజయం సాధించారు. ఆతర్వాత జరిగిన ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డిపై ఓడిపోయా రు. ఇక, 2014లో రాష్ట్ర విభజన వేడితో ఆయన వైసీపీ నుంచి ఆఫర్ వచ్చినా తిరస్కరించి.. టీడీపీ సైకిల్ ఎక్కారు. రెడ్డి సామాజికవర్గంలోనే కాక మాస్లోనూ మంచి పేరు తెచ్చుకున్న పోలంరెడ్డికి ఇప్పుడు కష్ట కాలం ఎదురవుతోంది. వచ్చే ఎన్నికల్లో ఇక్కడ ఆయనకు టికెట్ ఇవ్వకూడదని టీడీపీ అదినేత చంద్రబాబు నిర్ణయించుకున్నట్టు వార్తలు వస్తున్నాయి. దీనికి అనేక ఈక్వేషన్లు పనిచేస్తున్నాయి.
స్థానిక టీడీపీ నేతలను కలుపుకొని వెళ్లడం లేదని, కాంగ్రెస్ మిత్రులతో కలిసి చెట్టపట్టాలే సుకుని తిరుగుతున్నారని, చంద్రబాబు ప్రవేశ పెడుతున్న సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకు వెళ్లడం లేదని ఆయనపై అనేక ఫిర్యాదులు నేరుగా బాబుకే అందాయి. దీంతో ఆయనను ఇక్కడ నుంచి మరోసారి అవకాశం ఇవ్వడంపై సొంతపార్టీలోని వ్యతిరేక వర్గం తీవ్రస్థాయిలో వ్యతిరేకిస్తోంది. దీంతో ఈ విషయం ఆనోటా.. ఈనోటా.. పోలంరెడ్డి చెవికి చేరింది. దీంతో ఆయన దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలని నిర్ణయించుకున్నారు.
ఈ క్రమంలోనే వైసీపీలో చేరేందుకు ప్రయత్నాలు చేసుకుంటున్నారట. జగన్కు అత్యంత సన్నిహితుడు మాజీ డీజీపీ దినేష్రెడ్డి.. పోలంరెడ్డికి దగ్గర బంధువు కావడంతో ఆయన ద్వారా పోలంరెడ్డి.. వైసీపీలో చేరేందుకు ప్రయత్నాలు చేస్తున్నాట్లు సమాచారం. త్వరలోనే జగన్ కలిసే అవకాశం ఉందని కూడా ప్రచారం జరుగుతోంది. ఇదే నిజమైతే.. ఇక్కడ వైసీపీ టికెట్ పోలంరెడ్డికేనని తెలుస్తోంది. అయితే, ఇప్పటికే వైసీపీలో ఉన్న నాయకులు ఈ టికెట్ను ఆశిస్తున్న వారు ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.