చంద్రబాబునాయుడు, జనసేనాని పవన్ కల్యాణ్ మధ్య భారీ డీల్ కుదిరిందా ? విశ్వసనీయవర్గాల సమాచారం ప్రకారం అవుననే సమాధానం వినిపిస్తోంది. అందులో భాగంగానే మొన్న వాళ్ళిద్దరి మధ్య భేటీ అయ్యిందట. ముందుగా డీల్ కుదిరిన తర్వాతే ఇద్దరూ ఒక దేవాలయానికి సంబంధించిన కార్యక్రమంలో కలిసారన్నది సమాచారం. ఎటుతిరిగి ఇద్దరికీ కావాల్సిన ఆప్తులు ఉండనే ఉన్నారు. పైగా ఇద్దరిలో ఎవరి అవసరాలు వాళ్ళకున్నాయి. చంద్రబాబు, పవన్ కలిసుండటమే ఆప్తులకు కూడా అవసరమట. అందుకనే ఇద్దరూ కలవటానికి వీలుగా ఓ వేదికను ఏర్పాటు చేశారనే ప్రచారం అంతర్గతంగా జరుగుతోంది.
దూసుకుపోతున్న జగన్
2019 ఎన్నికలు తరుముకొచ్చేస్తున్నాయి. పోయిన ఎన్నికల్లో ఇచ్చిన 600 హామీల్లో ఏ ఒక్కటి కూడా చంద్రబాబు సంపూర్ణంగా అమలు చేయలేదు. దానికితోడు పాలనా వైఫల్యాలు, పెరిగిపోయిన అవినీతి లాంటి అనేక అంశాలు చంద్రబాబు పాలనపై జనాల్లో వ్యతిరేకత పెంచేస్తోంది. అదే సమయంలో చంద్రబాబు వైఫల్యాలను ఎండగడుతూ వైసిపి అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర పేరుతో జనాల్లో దూసుకుపోతున్నారు. జనాలు కూడా జగన్ కు బ్రహ్మరధం పడుతుండటంతో టిడిపిలో ఆందోళన పెరిగిపోతోంది.
అధికారం నిలబెట్టుకోవటం చాలా అవసరం
అధికారం నిలుపుకోవటమన్నది చంద్రబాబుకు చాలా అవసరం. పోయిన ఎన్నికల్లో మద్దతుగా నిలిచిన ఏ అంశమూ ఇపుడు చంద్రబాబు పక్కన లేదు. అందులోనూ పోయిన ఎన్నికల్లో చంద్రబాబు పల్లకీని మోసిన బిజెపి, జనసేనలు ఇపుడు పక్కలో బల్లెంలా తయారయ్యాయి. ఒకవైపు శతృవులూ చుట్టిముట్టి, ఇంకోవైపు సమస్యలూ కమ్ముకుంటున్న సమయంలో అధికారం నిలబెట్టుకోవటం కష్టమని చంద్రబాబు గ్రహించారు. ముందుగా శతృవులను తగ్గించుకునే విషయంలో దృష్టి పెట్టారు. బిజెపిని మంచి చేసుకోవటం ఎటూ సాధ్యం కాదన్న విషయం చంద్రబాబుకు బాగా తెలుసు.
జగన్- పవన్ కలుస్తారనే ప్రచారం
అదే సమయంలో వచ్చే ఎన్నికల్లో జగన్-పవన్ కలిసి పోటీ చేస్తారనే ప్రచారం జరుగుతున్న విషయం అందరికీ తెలిసిందే. ఒకపుడు తన జేబులో మనిషిగా మసలుకుని తాజాగా ప్రతిపక్షంగా మారిన జనసేనపై దృష్టి పెట్టారు. చంద్రబాబు, పవన్ ఇద్దరికీ కావాల్సిన ఆప్తులు చాలామందే ఉన్నారు. వాళ్ళద్వారా పావులు కదిలాయని సమాచారం. దాని తర్వాతే దశావతార విగ్రహ ప్రతిష్ట కార్యక్రమంలో వాళిద్దరూ కలవటానికి ముహూర్తం నిర్ణయమైందట. అంటే, ముందే కుదిరిన డీల్ కు వాళ్ళిద్దరి భేటీ లాంచనమే అని ప్రచారం జరుగుతోంది.
వైసిపి గెలుపు నియోజకవర్గాల్లో జనసేన పోటీ ?
వచ్చే ఎన్నికల్లో అన్నీ స్దానాల్లోను జనసేన పోటీ చేస్తుందని పవన్ చెబుతున్న మాటలను ఎవరూ నమ్మటం లేదు. ఎందుకంటే, రాష్ట్రమంతా తిరిగి అభ్యర్ధుల కోసం ప్రచారం చేసేంత ఓపికి పవన్ లో లేదు. ఆ విషయం మొన్న శ్రీకాకుళం జిల్లాలో మొదలైన ప్రజా పోరాట యాత్రతోనే తేలిపోయింది. కాబట్టి వచ్చే ఎన్నికల్లో కేవలం ఎంపిక చేసిన నియోజకవర్గాల్లో మాత్రమే జనసేన పోటీ చేస్తుందట. అవికూడా వైసిపి కచ్చితంగా గెలిచే నియోజకవర్గాలే అయ్యుంటాయనే ప్రచారం మొదలైంది. అంటే సుమారు 60 నియోజకవర్గాల్లో జనసేన పోటీ చేసే అవకాశాలున్నాయట. ఇదంతా వర్కవుటవ్వాలంటే మరికొంత కాలం పట్టవచ్చు. అధికారం నిలబెట్టుకునేందుకు ఎవరి ప్రయత్నాలు వారు చేసుకోవటంలో తప్పేమీ లేదు. కాకపోతే ఎవరి ప్రయత్నాలు ఫలిస్తాయో తెలియాలంటే మాత్రం కొంత కాలం ఆగకతప్పదు.