చంద్రబాబునాయుడుపై బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబుకున్న రోగం రాష్ట్రాభివృద్ధికి పెద్ద శాపంగా మారిందంటూ మండిపడ్డారు. నిన్నటి వరకూ ఏపికి కాంగ్రెస్ పార్టీ అన్యాయం చేసిందని ఆరోపించిన చంద్రబాబు ఒక్కసారిగా కాంగ్రెస్ వల్లే ఏపికి న్యాయం జరిగిందని చెప్పటం విచిత్రంగా ఉందన్నారు. చంద్రబాబు బహుశా మతిభ్రమించి మాట్లాడుతున్నట్లుగా ఉందన్నారు. చంద్రబాబులో అందరూ ఒక అపరిచితుడిని చూస్తున్నట్లు కన్నా ఎద్దేవా చేశారు. సిఎంకున్న మానసిక రోగమే రాష్ట్రానికి శాపంగా మారిపోయిందంటూ మండిపడ్డారు.
ఏడు మండలాలను కలిపింది బిజెపినే
పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి వీలుగా తెలంగాణాలోని ఏడు ముంపు మండలాలను ఏపి కలిపింది బిజెపి అయితే కాంగ్రెస్ కలిపిందంటూ చెప్పటం విచిత్రంగా ఉందన్నారు. ప్రధానమంత్రి నరేంద్రమోడి ఏడు ముంపు మండలాలను ఏపిలో కలపకపోతే పోలవరం నిర్మాణం కలగానే మిగిలిపోయుండేదన్నారు. పోలవరంకు సంబంధించి చంద్రబాబు చేస్తున్న ఆరోపణల్లో అర్ధం లేదన్నారు. కేంద్రం అనుమతి లేకుండానే చంద్రబాబు తనంతట తాను అంచనా వ్యయాన్ని పెంచుకుంటే పోతే బాధ్యత ఎవరదంటూ నిలదీశారు.
పోలవరం బకాయిలే లేవు
పోలవరంకు సంబంధించి ఎటువంటి బిల్లులు బకాయిలు లేవని ఒకవైపు పోలవరం అథారిటి చెబుతుంటే, ఇంకోవైపు కేంద్రం నుండి రూ . 1951 కోట్లు రావాలని చంద్రబాబు అబద్దాలు ప్రచారం చేస్తున్నట్లు ధ్వజమెత్తారు. కడప స్టీల్ ఫ్యాక్టరీ గురించి మాట్లాడిన కన్నా టిడిపిపై మండిపడ్డారు. ఫ్యాక్టరీ రావటం అసలు టిడిపికే ఇష్టం లేదన్నారు. రాష్ట్రాభివృద్ధికి చంద్రబాబు సైందవుడిలా అడ్డుపడుతున్నారట. ఎటు ఉక్కు పరిశ్రమ కడపకు వస్తోందని తెలిసిన తర్వాతే టిడిపి ఎంపి నిరాహార దీక్ష డ్రామాకు దిగినట్లు మండిపడ్డారు.