భారత దేశ ప్రతిష్టను అంతర్జాతీయంగా దిగజార్చిన తాజా సర్వే ఇది. ఈ దేశంలో మహిళల భద్రతకు సంబంధించిన అత్యంత దురదృష్టకరమైన సమాచారమిది. కఠినతర చేదు వాస్తవం. భారత్ లో మహిళలకు భద్రత లేదు రక్షణ కరువు అని నిరూపించిన తాజా సర్వే మన పరువు తీసేసింది. మహిళలకు భారత దేశమే అత్యంత ప్రమాదకరమైనదని అదీ అప్ఘానిస్తాన్, సిరియా, సొమాలియా లాంటి దేశాల కంటే కూడా - సనాతన సాంప్రదాయ సాంస్కృతిక సదాచార దేశమని సహస్రాబ్ధాల చరిత్ర కలిగిన భారత్ లో నిజంగా నేడున్న పరిస్థితి ఇది.
"థాంమ్సన్ రాయటర్స్ ఫౌండేషన్" మహిళల రక్షణ పై విశ్వవ్యాప్తంగా నిర్వహించిన సర్వేలో వెల్లడైంది. అత్యాచారాలు, లైంగికహింస, వేధింపులు, మహిళల అక్రమ రవాణా, సెక్స్ బానిసలుగా మహిళలను మార్చడం, బలవంతపు వివాహాలు, బాల్య వివాహాలు, ఇళ్లల్లో వెట్టిచాకిరీ, భ్రూణ హత్యలు, మహిళల పట్ల అనుసరిస్తున్న అమానవీయమైన సంప్రదాయ పద్ధతులు వంటి అంశాల్లో మహిళలకు భారత్ ప్రపంచానికే ప్రమాదకరంగా మారిందని సర్వే తేల్చింది.
నిరంతరం యుద్ధంతో అతలాకుతలమయ్యే అప్ఘానిస్తాన్, సిరియాల్లో కంటే మన దేశంలో మహిళలు దుర్భర పరిస్థితులు ఎదుర్కొంటున్నారని సర్వేలో తేలడం ఎవరికీ మింగుడు పడడం లేదు. ఈ జాబితాలో అప్ఘానిస్తాన్ రెండు, సిరియా మూడో స్థానంలో ఉన్నాయి. ఆ తర్వాత స్థానాల్లో సోమాలియా, సౌదీ అరేబియా దేశాలు ఉంటే అగ్రరాజ్యం అమెరికా పదో స్థానంలో ఉంది. ఇదే సంస్థ 2011 సంవత్సరంలో నిర్వహించిన సర్వేలో భారత్ నాలుగో స్థానంలో ఉంది. ఈ సారి ఏకంగా గణనీయమైన అభివృద్ది సాధించి మొదటి స్థానానికి చేరడంపై ప్రపంచవ్యాప్తంగా దేశలో కూడా సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది.
మహిళలపై సర్వె ద్వారా తెలిసిన వివిధ అంశాల్లో ప్రపంచ వ్యాప్తంగా భారత్ స్థానం
*లైంగిక హింసలో మొదటి స్థానం
*అక్రమ రవాణాలో మొదటి స్థానం
*సంప్రదాయంగా వస్తున్న అనాచారాల్లో మొదటి స్థానం
*లింగవివక్షలో మూడో స్థానం
*గృహ హింస ఇతర శారీరక హింసల్లో మూడో స్థానం
*మహిళల ఆరోగ్య పరిస్థితుల్లో నాలుగో స్థానం
సర్వేలో ప్రామాణిక అంశాలు:
*మహిళలు ఎదుర్కొంటున్న ప్రమాదాలు,
*ఆరోగ్యం,
*ఆర్థిక వనరులు,
*లింగ వివక్ష, లైంగిక హింస–వేధింపులు,
ఇతరత్రా హింసలు:
*బలవంతపు వివాహాలు,
*బాల్య వివాహాలు,
*ఇంటా బయటా వెట్టి చాకిరీ,
*భ్రూణ హత్యలు,
*అక్రమ రవాణా,
*సాంస్కృతికంగా, మతపరంగా వస్తున్న సంప్రదాయ పద్ధతులు
వంటి అంశాలను "థామ్సన్ రాయటర్స్ ఫౌండేషన్ సర్వే" లో ప్రామాణికంగా తీసుకుంది. ఐక్య రాజ్యసమితిలో సభ్యత్వం కలిగిన 193 దేశాల్లోని మహిళా సమస్యల పై అధ్యయనం చేస్తున్న 548 నిపుణుల అభిప్రాయాలను అడిగి తెలుసుకుంది. మార్చి 26–మే4 మధ్య ఆన్లైన్ ద్వారా, ఫోన్ ద్వారా, వ్యక్తిగతంగా కలుసుకొని సర్వే నిర్వహించింది.
వీరంతా మహిళలకు అత్యంత ప్రమాదకరమైన దేశం భారత్ అని నిర్ద్వంధంగా తేల్చి చెప్పారు. కశ్మీర్లోని కఠువాలో ఎనిమిదేళ్ల చిన్నారిపై గ్యాంప్ రేప్, ఉత్తరప్రదేశ్లోని ఉన్నావ్ అత్యాచార ఘటన రేపిన కల్లోలం నేపథ్యంలోనే ఈ సర్వే రావడం ఆందోళన కలిగిస్తోంది.
మహిళలకు అత్యంత ప్రమాదకరమైన 10 దేశాలు
- భారత్ 2. అప్ఘానిస్థాన్ 3. సిరియా 4. సోమాలియా 5. సౌదీ అరేబియా6. పాకిస్తాన్ 7. డెమొక్రాటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో 8. యెమన్ 9. నైజీరియా 10. అమెరికా
భారత్ తిరస్కరణ
సర్వే కి తీసుకున్న శాంపుల్ అతి తక్కువ. సమయం భారత్ కు అననుకూలం. భారత్ తరవాత స్థానాల్లో ఉన్న దేశాల్లో మహిళ లు బయటకు వచ్చే అస్కారమే లేదు. సర్వే శాస్త్రీయంగా జరగలేదని భారతీయ మహిళా కమీషణ్ చైర్పర్సన్ రేఖా శర్మ సర్వే ఆమూలాగ్రం తప్పని తిరస్కరించారు.