టీడీపీకి కంచుకోటగా పేర్కొనే అనంతపురం జిల్లాలో నేతల మధ్య సఖ్యత కొరవడింది. దీంతో ఇక్కడి రాజకీయాలు రోజుకో వివాదంతో సాగుతున్నాయి. నేతల మధ్య నువ్వా-నేనా అనే రేంజ్లో వివాదాలు నెలకొన్నాయి. ఈ పరిణామం.. పార్టీకి చేటు చేస్తోందని తెలిసినా.. నేతల్లో మాత్రం మార్పు రావడం లేదు. విసయంలోకి వెళ్తే.. అనంతపురం జిల్లాలో మొత్తం 14 నియోజకవర్గాలు ఉన్నాయి. రెండు ఎంపీ స్థానాలు ఉన్నాయి. వీటిలో గత 2014 ఎన్నికల్లో 12 స్థానాల్లో టీడీపీ జయకేతనం ఎగురవేసింది.
మిగిలిన రెండు చోట్లా కదిరి, ఉరవకొండలో వైసీపీ విజయం సాధించింది. అయితే, చంద్రబాబు ఆకర్ష్ మంత్రంతో ఇక్కడి కదిరి ఎమ్మెల్యే చాంద్బాషా టీడీపీ తీర్థం పుచ్చుకుని సైకిల్ ఎక్కేశాడు. కేవలం ఉరవ కొండ ఎమ్మేల్యే విశ్వేశ్వర్రెడ్డి మాత్రమే వైసీపీకి నిలిచాడు. అంటే మొత్తంగా ఇక్కడి 13 నియోజకవర్గాల్లోనూ సైకిల్ రన్ కొనసాగుతోంది. ఇక, ఎంపీనియోజకవర్గాల విషయానికి వచ్చేసరికి అనంతపురం, హిందూపురం ఎంపీలుగా టీడీపీ నేతలే గెలుపొందారు.
జిల్లా పరిషత్ చైర్మన్, రెండు ఎమ్మెల్సీలు కూడా ఇక్కడ పార్టీకి ఉన్నారు. ఇలా ఈ జిల్లా మొత్తం టీడీపీ జాబితాలో ఉంది.
ఇంత బలం ఉన్న ఈ జిల్లాలో పార్టీ ఎలా ముందుకు సాగాలి? పార్టీ ఎలా దూసుకుపోవాలి? విపక్షానికి అవకాశం ఇవ్వొచ్చా? ఎందుకు ఈ పార్టీలో ఉన్నాం.. అని కార్యకర్తలు భావించవచ్చా? అంటే విజ్ఞులు ఎవరూ కూడా కాదనే అంటారు. కానీ,ఇక్కడ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న టీడీపీ నాయకులు మాత్రం పార్టీ ఎలా పోయిన ఫర్వాలేదు.. మాకు మేమే రాజులం.. మాకే మేమే అధినేతలం అనే రేంజ్లో కొట్టుకుంటున్నారు. ఒకరంటే ఒకరికి పడదు. వారివారి నియోజకవర్గాలను వదిలేసి మరీ పక్కవారి నియోజకవర్గాల్లో వేలు పెడుతున్నారు.
అనంతపురం జిల్లాలో తెలుగుదేశంపార్టీ నేతలు వర్గ విభేదాలతో పార్టీకి నష్టం తెస్తున్నారు. ఆ ఎఫెక్ట్ క్యాడర్పై పడుతోంది ఎంపీలంటే ఎమ్మెల్యేలకు సరిపడటం లేదు.. ఎమ్మెల్యేలంటే ఎంపీలకు పడటం లేదు.. ప్రతి చోటా ఈ తంతే నడుస్తోంది.. కొందరేమో నేరుగా ఘర్షణకే దిగుతున్నారు.. మరికొందరేమో ప్రచ్ఛన్న యుద్ధం సాగిస్తున్నారు. అనంతపురంలో ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి.. ఎంపీ దివాకర్రెడ్డి వర్గాల మధ్య చాలా గ్యాప్ ఉంది.. జేసీ దివాకర్రెడ్డి తనయుడు పవన్రెడ్డి అనంతపురం అసెంబ్లీ నియోజకవర్గంపై కన్నేశారన్నది ప్రభాకర్ చౌదరి అనుచరుల కంప్లయింట్!
ఎస్ఆర్ నిర్మాణ్ సంస్థ అధినేత సురేంద్రబాబును అనంతపురం అసెంబ్లీ స్థానం నుంచి నిలుచోబెట్టాలన్నది పవన్ ఆలోచన! ఇందుకోసం ప్రయత్నాలు కూడా మొదలెట్టారు. మిగిలిన చోట్ల కూడా జేసీ వర్గం వేలు పెడుతోందనే వ్యాఖ్యలు వస్తున్నాయి. దీంతో కేడర్లో తీవ్ర అసంతృప్తి నెలకొంది. దీనిని సరిచేయాల్సిన అవసరం ఎంతైనా ఉందనేది వారి మాట. మరి చంద్రబాబు దృష్టి పెడతారో లేదో చూడాలి.