తెలుగుదేశంపార్టీ ఎంఎల్ఏలపై చంద్రబాబునాయుడు మండిపోతున్నారు. ఎంఎల్ఏల పనితీరుపై రాయలసీమ ఎంఎల్ఏలతో చంద్రబాబు సమీక్ష జరుపుతున్నారు. ఇప్పటి వరకూ అయిన సమీక్షల్లో ఎక్కువ మంది మంత్రులు, ఎంఎల్ఏలు సంపాదనపైనే దృష్టి పెట్టిన విషయం బయటపడింది. సంపాదనే ధ్యేయంగా పలువురు మంత్రులు, ఎంఎల్ఏలు పార్టీలోని నేతలు, క్యాడర్ ను కూడా గాలికి వదిలిపెట్టారు. అదే సమయంలో కొందరు మంత్రులు ఎంఎల్ఏల నియోజకవర్గాల్లోనూ, ఎంఎల్ఏలు మంత్రుల నియోజకవర్గాల్లోనూ వేలు పెడుతున్నట్లు కూడా ఒకరిపై మరొకరు చంద్రబాబు వద్ద ఆరోపణలు చేస్తున్నారు.
చాలా మందిపై అవినీతి ఆరోపణలు
మంత్రులు, ఎంఎల్ఏలు ఒకరిపై మరొకరు చేసుకుంటున్న ఆరోపణలు చూస్తుంటే ఎక్కువ మంది తమ నియోజకవర్గాల్లో సమస్యల పరిష్కారం కన్నా సంపాదనపైనే పూర్తి సమయం కేటాయిస్తున్నారన్న విషయం చంద్రబాబుకు అర్దమైపోయింది. దాంతో అందరినీ క్లాసులు పీకుతున్నారు. వచ్చే ఎన్నికల్లో పోటీ చేయటం కోసమే సంపాదనపై పలువురు ప్రజా ప్రతినిధులు దృష్టి పెడుతున్న విషయం అర్ధమైపోతోంది. సంపాదనే ధ్యేయంగా పలువురు ఎంఎల్ఏలు పనిచేస్తుండటంతో వారిపై వినిపిస్తున్న ఆరోపణలపై వివిధ మార్గాల్లో చంద్రబాబు నివేదికలు తెప్పించుకుంటున్నారు. తమ అవినీతిపై చంద్రబాబు వద్ద నివేదికలు ఉన్నాయన్న విషయం సమావేశానికి ముందే సదరు ఎంఎల్ఏలకు తెలియటమే విచిత్రం.
ఆరోపణలపై తలపట్టుకున్న చంద్రబాబు
ఇప్పటి వరకూ జరిగిన సమీక్షల్లో అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న మంత్రులు, ఎంఎల్ఏల్లో ఎక్కువ మంది కర్నూలు, అనంతపురం, ప్రకాశం జిల్లాలకు చెందిన వారే ఎక్కువున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. కర్నూలు జిల్లాకు సంబంధించి మంత్రి అఖిలప్రియపై బనగానపల్లి ఎంఎల్ఏ బిసి జనార్ధన్ రెడ్డి భారీ ఆరోపణలే చేశారు. నీరు-చెట్టు పథకం అమలుకు సంబంధించి తమ జిల్లాలో ఎక్కవుగా వైసిపి నేతలకే మంత్రి కాంట్రాక్టులు కట్టబెడుతున్నట్లు ఎంఎల్ఏ ఇప్పటికే ఆరోపణలు చేసారు. ఆ విషయమై చంద్రబాబు కూడా మంత్రికి క్లాస్ పీకినట్లు సమాచారం. అనంతపురం జిల్లాలో కూడా పలువురు ఎంఎల్ఏల వరస ఇదే విధంగా ఉండటంపై చంద్రబాబు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.
సంపాదనే ధ్యేయమా ?
2019 ఎన్నికలు దగ్గరపడేకొద్దీ మంత్రులు, ఎంఎల్ఏల అవినీతి పెరిగిపోతోంది. ఎందుకంటే, వచ్చే ఎన్నికల్లో టిక్కెట్లు వస్తాయన్న నమ్మకం ఉన్నావారేమో మళ్ళీ ఖర్చులు పెట్టుకోవాలి కాబట్టి సంపాదిస్తున్నారు. టిక్కెట్లు రావు అన్న అనుమానం ఉన్న వారేమో ఇవే చివరి ఎన్నికలు కాబట్టి వాళ్ళూ సంపాదించేస్తున్నారు. దాంతో మంత్రులు, ఎంఎల్ఏలు ఆకాశమే హద్దుగా సంపాదన మీద పడటంతో జనాలు గగ్గోలు పట్టేస్తున్నారు.