వచ్చే ఎన్నికల్లో నారా లోకేష్ కుప్పం నియోజకవర్గంలో పోటీ చేస్తారా ? పార్టీ వర్గాల సమాచారం ప్రకారం అవుననే సమాధానం వినిపిస్తోంది. వచ్చేఎన్నికల్లో పోటీ చేసే విషయంలో చంద్రబాబునాయుడు, లోకేష్ మధ్య చర్చ జరిగిందని సమాచారం. ఆ చర్చల్లో కుప్పం నుండి లోకేష్ పోటీకి దిగాలని స్ధూలంగా నిర్ణయమైందట. ఆ తర్వాతే వచ్చే ఎన్నికల్లో తాను పోటీ చేయబోతున్నట్లు లోకేష్ ప్రకటన చేసినట్లు సమాచారం. వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తానని లోకేష్ ఓ మీడియాకిచ్చిన ఇంటర్వ్యూలో చెప్పిన విషయం అందరికీ తెలిసిందే. ఆ మధ్య ఎన్నికల్లో పోటీ చేసే ధైర్యం లేకే దొడ్డిదోవన ఎంఎల్సీ గా ఎన్నికై మంత్రయ్యారు. అదే విషయమై అప్పట్లో లోకేష్ పై ఎన్ని ఆరోపణలు వచ్చాయో లెక్కేలేదు. లోకేష్ కోసం ఎంఎల్ఏ పదివిని త్యాగం చేయటానికి చాలా మంది ఎంఎల్ఏలు ముందుకొచ్చినా లోకేష్ మాత్రం పోటీ చేయటానికి సాహసం చేయలేకపోయారు. అందుకు రెండు కారణాలను చెప్పుకోవచ్చు. మొదటిది ఏ నియోజకవర్గం నుండి పోటీ చేయాలో నిర్ణించుకోలేకపోవటం. ఇక, రెండోది ఎక్కడ పోటీ చేసినా గెలుస్తాననే నమ్మకం లేకపోవటం.
పెద్ద కసరత్తే జరిగిందా ?
తాజాగా వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తానని లోకేష్ చెప్పటమంటే తెర వెనుక ఏదో మంత్రాంగం నడిచే ఉండాలి. లోకేష్ ఎక్కడ పోటీ చేసినా ఓట్లు పడేది మాత్రం చంద్రబాబునాయుడును చూసే అన్న విషయం అందరికీ తెలిసిందే. ఇటువంటి పరిస్దితుల్లో ప్రత్యక్ష ఎన్నికలకు లోకేష్ సిద్దపడ్డారంటే నియోజకవర్గాన్ని కూడా ఎంపిక చేసుకున్నట్లే కనబడుతోంది. ఆ విషయాన్ని పార్టీ వర్గాలు కూడా ధృవీకరిస్తున్నాయి. పార్టీ వర్గాల సమాచారం ప్రకారం నాలుగు నియోజకవర్గాలపై లోకేష్ దృష్టి ఉన్నట్లు తెలుస్తోంది. అనంతపురం జిల్లాలోని హిందుపురం మొదటిది. ఈ నియోజకర్గం టిడిపికి కంచుకోట లాంటిది. పార్టీ పెట్టినప్పటి నుండి ఇప్పటి వరకూ ఈ నియోజకవర్గంలో టిడిపి ఒక్కసారి కూడా ఓడలేదు. ప్రస్తుతం నందమూరి బాలకృష్ణ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. వాళ్ళిద్దరూ ఎటూ మామా అల్లుళ్ళే కాబట్టి లోకేష్ పోటీకి బాలకృష్ణ అభ్యంతరం పెట్టకపోవచ్చు. ఇక, రెండోది కృష్ణా జిల్లాలోని పెనమలూరు నియోజకవర్గం. ప్రస్తుతం ఇక్కడ బోడెప్రసాద్ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. మూడో నియోజకవర్గం కర్నూలు జిల్లాలోని నంద్యాల కాగా నాలుగోది చిత్తూరు జిల్లాలోని కుప్పం నియోజకవర్గం.
అన్నింటికన్నా కుప్పమే సేఫ్
నంద్యాలలో చంద్రబాబు ప్రత్యేక దృష్టి పెట్టి అభివృద్ధి కార్యక్రమాలు చేయిస్తున్నట్లు పార్టీలో ప్రచారం. చంద్రబాబు ప్రత్యేక శ్రద్ధ పెట్టారంటే అది తన కోసమో లేకపోతే లోకేష్ కోసమో అనే చర్చ నేతల మధ్య జరుగుతోంది. చివరిదైన కుప్పం నియోజకవర్గంలో ప్రస్తుతం చంద్రబాబే ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఇక్కడ చంద్రబాబు గెలుపును అడ్డుకునే ప్రత్యర్ది లేరన్నది వాస్తవం. ఇక్కడి నుండి లోకేష్ ను పోటీ చేయించే ఉద్దేశ్యంతోనే చంద్రబాబు ఉన్నట్లు అనుమానిస్తున్నారు పార్టీ నేతలు.
చంద్రబాబు ఎక్కడి నుండి పోటీ ?
ఎందుకంటే, లోకేష్ తరచూ కుప్పంలో పర్యటించటంతో పాటు నేతలు, క్యాడర్ తో సమావేశమవుతున్నారు. నియోజకవర్గంలోని బూత్ లెవల్ కమిటీలతో కూడా లోకేష్ రెగ్యులర్ గా టచ్ లో ఉన్నారు.. అందులోను కుప్పంకన్నా లోకేష్ కు రాష్ట్రం మొత్తం మీద సేఫ్ సీటు మరొకటి దొరకదు. బహుశా వచ్చే ఎన్నికలే చంద్రబాబుకు చివరి ఎన్నికలు కావచ్చు. అందుకనే తన నియోజకవర్గాన్ని లోకేష్ కు అప్పగించి చంద్రబాబు పైన చెప్పిన ఏదో ఒక నియోజవర్గంలో పోటీ చేసే అవకాశముంది.
కర్నూలు, అనంతపురం జిల్లాల్లో పరిస్ధితులు ఏమీ బావోలేదు. ఇక్కడ మెజారిటీ సీట్లు టిడిపి గెలవాలంటే ఏదో ఒక జిల్లా నుండి చంద్రబాబు పోటీ చేయాలన్నది నేతల భావనగా కనిపిస్తోంది.