అవును. ఏపీలో ఒక పరిణామం.. ఢిల్లీని చేరలేదు. కానీ, తెలంగాణలో మరో పరిణామం.. ఢిల్లీ చెవులు చాటలు చేసుకుని మరీ ఆలకించింది. మేమున్నామంటూ భరోసాను నింపింది. ఈ పరిణామం రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ తీవ్ర సంచలనం సృష్టించింది. ఏపీ, తెలంగాణల విషయంలో కేంద్రం అనుసరిస్తున్న వైఖరిని ప్రమాణంగా నిలిచింది. కడప జిల్లాలో ఉక్కు ఫ్యాక్టరీ కోసం రాజ్యసభసభ్యుడు సీఎం రమేష్, ఎమ్మెల్సీ బీటెక్ రవిలు ఆమరణ దీక్ష ప్రారంభించి వారం గడిచింది. ఈ క్రమంలో ఆయన ఆరోగ్యం సైతం తీవ్రస్థాయిలో దెబ్బతిందని భావించిన ప్రభుత్వం ఆస్పత్రికి కూడా తరలించింది., సీఎం రమేష్ పరిస్థితి బాగోలేకపోయినా.. ఆయన దీక్షను కొనసాగిస్తున్నారు. మరిఇంతగా ఏపీలో అదికార పక్షం ఆందోళన, ధర్నాలు చేస్తున్నా.. కేంద్రం మాత్రం ఏమాత్రమూ పట్టించుకోలేదు. కనీసం పీఎంవో నుంచి ఒక్క మాటైనా ఆరా తీయలేదు.
ఇక్కడ సీన్ కట్ చేసి.. తెలంగాణలోకి వెళ్తే.,. అక్కడ కూడా ప్రభుత్వం ఉక్కు ఫ్యాక్టరీ కోసం ఉద్యమరీతిలో పోరు సాగిస్తోం ది. అయితే, ఎవరూ ఆమరణాలు, నిరసనలు చేపట్టలేదు. కానీ, ఉక్కు సంకల్పం మాత్రం ఢిల్లీని చేరిపోయింది. ఏకంగా ప్రధాని మోడీ స్పందించే రేంజ్లో ఈ ఉక్కు పోరు సాగింది. బయ్యారంలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటుకు కేసీఆర్ ప్రభుత్వం యోచిస్తోంది. అయితే, చంద్రబాబు మాదిరిగా ఎవరూ అక్కడ కేంద్రంపై విరుచుకుపడలేదు. కేంద్రంపై దుమ్మెత్తి పోయలేదు. ఎంపీలు రోడ్డున పడలేదు. కానీ, పనిమాత్రం కానిచ్చేసుకున్నారు. బయ్యారంలో ఉక్కు కర్మాగారం ఏర్పాటు చేయాలని.. దానికి అవసరమైన అన్ని రకాల రాయితీలూ ఇస్తామని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీని మంత్రి కేటీఆర్ కోరిన తక్షణమే ఆయన పచ్చ జెండా ఊపడం అందరినీ విస్మయానికి గురి చేసింది.
బయ్యారంలో లభించే ఇనుప ఖనిజం నాణ్యత తక్కువగా ఉంటే.. ఛత్తీస్గఢ్లోని బైలదిల్లా గనుల నుంచి ఖనిజాన్ని తరలించి ఉక్కు ఉత్పత్తి చేయవచ్చని ప్రధానికి కేటీఆర్ వివరించారు. ప్రస్తుతం బైలదిల్లా నుంచి 600 కిలోమీటర్ల దూరంలోని విశాఖపట్నం స్టీల్ ప్లాంటుకు ఖనిజాన్ని తరలిస్తున్నారని.. అలాంటిది కేవలం 180 కిలోమీటర్ల దూరం లోని బయ్యారానికి సులువుగా తరలించవచ్చని చెప్పారు. బైలదిల్లా నుంచి లింకేజీ ద్వారా బయ్యారంలో స్టీలు ప్లాంట్ ఏర్పాటు చేసేందుకు అన్ని అవకాశాలు ఉన్నాయని నివేదించారు.
ఇక్కడ ప్లాంటు ఏర్పాటు వల్ల ఖమ్మం జిల్లా పరిధిలోని గిరిజనులకు 15 వేల ఉద్యోగాల కల్పన జరుగుతుందని.. అందువల్ల ప్లాంటు ఏర్పాటుకు అవసరమైన అన్ని వసతులను కల్పించడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని ప్రధానికి కేటీఆర్ వివరించారు. ఈ పరిణామం.. ఏపీ నేతలకు శరాఘాతంగా మారిపోయింది. ఇప్పటి వరకు తాము ఇన్ని ఉద్యమాలు చేస్తున్నా.. ఫలించని పరిస్థితిని తెలంగాణ ప్రభుత్వం సాధించడంతో టీడీపీ శ్రేణుల్లో ఆందోళన పెరిగిపోతోంది. మరి బాబు ఎలా ముందుకు వెళ్తారో చూడాలి.