ఉక్కు ఫ్యాక్టరీ కోసం అఖిలపక్షం ఆధ్వర్యంలో జరుగుతున్న కడప జిల్లా బంద్ సక్సెస్ అయ్యింది. జిల్లాలోని జనాలందరూ స్వచ్చంధంగా పాల్గొనటంతో బంద్ విజయవంతమైంది. బంద్ కు మద్దతుగా వర్తక, వాణిజ్య, వ్యాపార సముదాయాలన్నీ మూత పడ్డాయి. సరే ముందు జాగ్రత్తగా ఆర్టిసి బస్సులను ఎటూ ప్రభుత్వమే నిలిపిస్తుందనుకోండి అది వేరే సంగతి. వైసిపి ఆధ్వర్యంలో వామపక్షాల నేతలు జిల్లా అంతటా బంద్ విజయవంతానికి పర్యవేక్షిస్తున్నారు. బంద్ విజయవంతం చేయటానికి జిల్లాలోని వైసిపి నేతలు, శ్రేణులు మొత్తం రోడ్డెక్కాయి.
ఎక్కడా కనబడని టిడిపి
ఇక్కడ గమనించాల్సిన విచిత్రమేమిటంటే, ఇదే ఉక్కు ఫ్యాక్టరీ కోసం పది రోజులుగా ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న సిఎం రమేష్ మద్దతుదారులు ఎక్కడా బంద్ లో కనబడలేదు. అదే విధంగా ఉక్కు ఫ్యాక్టరీ కోసం ఎంతకైనా తెగిస్తామని ప్రకటనలిస్తున్న టిడిపి నేతలు కూడా ఎక్కడా అడ్రస్ లేరు. అంటే వైసిపి, వామపక్షాల బంద్ లో టిడిపి పాల్గొనలేదన్న విషయం అర్ధమైపోతోంది. ఉక్కు ఫ్యాక్టరీ కోసం రాజ్యసభ సభ్యుడు సిఎం రమేష్ ప్రాణాలను సైతం పణంగా పెట్టి ఆమరణ నిరాహార దీక్ష చేయిస్తున్న చంద్రబాబునాయుడు అదే అంశంపై జిల్లా బంద్ కు మాత్రం ఎందుకు మద్దతు ఇవ్వలేదో చెబితే బాగుంటుంది.
జిల్లా సంపూర్ణ బంద్
బంద్ ను సక్సెస్ చేయించాలన్న పట్టుదలతో వైసిపి, వామపక్షాల నేతలు ఉదయం నుండే రోడ్లపైకి వచ్చేశారు. జిల్లాలోని మైదుకూరు, పులివెందుల, రాజంపేట, జిల్లా కేంద్రమైన కడప, బద్వేలు, రాయచోటి, కమలాపురం, జమ్మలమడుగు, ప్రొద్దటూరు, కోడూరు నియోజకవర్గాల్లో బంద్ద సంపూర్ణమైంది. రాజంపేట, జమ్మలమడుగు, బద్వేలు నియోజకవర్గాలు మినహా మిగిలిన అన్నీ నియోజకవర్గాల్లోనూ వైసిపి ఎంఎల్ఏలే ఉండటం కూడా బంద్ సక్సెస్ కు కలసి వచ్చింది. ఫ్యాక్టరీ ఏర్పాటన్నది జిల్లాలో సెంటిమెంటుగా మారటంతో బంద్ కు టిడిపి సహకరించకపోయినా వ్యతిరేకించే సాహసం మాత్రం చేయలేదు బహిరంగంగా.
స్తంభించిన జనజీవన స్రవంతి
బంద్ విజయవంతంలో కీలక పాత్ర పోషిస్తున్న వైసిపి నేతలు వివిధ నియోజకవర్గాల్లో బైకు ర్యాలీలు, నిరసన కార్యక్రమాలు, రోడ్లపై వాహనాలను అడ్డుగా పెట్టటం లాంటి కార్యక్రమాలతో జన జీవన స్రవంతి దాదాపు నిలిచిపోయింది. బంద్ సందర్భంగా ఆందోళనకారులు తెలుగుదేశంపార్టీ, భారతీయ జనతా పార్టీలకు వ్యతిరేకంగా నినాదాలివ్వటంతో జిల్లాలోని పలు ప్రాంతాలు మారుమోగిపోయాయి.