ఆడు మగాడ్రా బుజ్జీ! అనడం పరిపాటి. ఏదైనా విషయంలో తాను అనుకున్నది ఎంత కష్టమైనా సాధించేవారిని ముద్దుగా ఇలా అనుకోవడం సహజం. ఇప్పుడు ఇదే మాట.. తెలంగాణ సీఎం కేసీఆర్ కు కూడా వర్తిస్తుంది. ఆయన అనుకున్నది సాధించారు. ఎన్ని ఇబ్బందులు, అవాంతరాలు వచ్చినా.. ఆయన తెలంగాణ రాష్ట్రాన్ని సాకారం చేసుకున్నారు. అంతేకాదు, సీఎం పదవిని సొంతం చేసుకుని బంగారు తెలంగాణ రాష్ట్ర సాధన దిశగా దూసుకుపోతున్నారు. మొదట్లో కొన్ని తడబాట్లు కనిపించినా.. ఇప్పుడు మాత్రం ఆయన దూకుడును ప్రదర్శిస్తున్నారు.
రైతులను ఆకట్టుకునేందుకు వివిధ పథకాలను ప్రేవశ పెట్టారు. పెట్టుబడి రుణాన్నిఅందించడం ద్వారా దేశంలోనే తొలిసారిగా అద్భుతమైన అడుగు వేశారు. ఇక, రాజకీయంగా చూసినా.. తన వ్యతిరేకుల ఆటకట్టించేందుకు కేసీఆర్ వ్యూహాత్మకంగా ముందుకు కదులుతున్నారు. ఈ విషయంలో ఆయన ఎవరినీ లెక్కచేయడం లేదు. తనకు వ్యతిరేకంగా ఢిల్లీలో చక్రం తిప్పాడని తెలియగానే సీనియర్ రాజకీయ నేత అయినప్పటికీ.. రాజకీయాల్లో తనకు సమకాలీనుడే అయినప్పటికీ.. ధర్మపురి శ్రీనివాస్ను పక్కకు పెట్టారు. కనీసం అప్పాయింట్మెంట్ కూడా ఇవ్వకుండా ఆయనను తిప్పికొట్టారు.
అదేసమయంలో కాంగ్రెస్కు చెందిన యువ నేతలను కేసీఆర్ పార్టీలోకి ఆహ్వానిస్తున్నారు. దీనిలో భాగంగానే హైదరాబాద్లో మంచి పట్టున్న దానం నాగేందర్ను పార్టీలో చేర్చుకున్నారు. కాంగ్రెస్ను దెబ్బతీసే ప్రతి వ్యూహాన్ని ఆయన అమలు చేస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో మళ్లీ అధికారం కైవసం చేసుకోవడమే ధ్యేయంగా కేసీఆర్ వేస్తున్న అడుగులు.. ఆయనకు తిరిగి అధికారం కట్టబెట్టే దిశగానే సాగుతున్నాయని చెబుతున్నారు విశ్లేషకులు.
తాజాగా ఆయన విజయవాడ వచ్చారు. దుర్గగుడికి వెళ్లి మొక్కు తీర్చుకున్నారు. అయితే, ఈ సందర్భంగానే ఆయన బీషణ ప్రతిజ్ఞ చేశారు. దుర్గమ్మ దర్శనంపై తెలంగాణ కేసీఆర్ ఆనందం వ్యక్తం చేశారు. అంతేకాకుండా ఏపీ ప్రభుత్వాన్ని మెచ్చుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మళ్లీ ముఖ్యమంత్రిగా వచ్చి అమ్మవారికి మొక్కలు తీర్చుకుం టానని కేసీఆర్ ప్రకటించారు. ఈ పరిణామం ఆయనలోని ఆత్మవిశ్వాసాన్ని స్పష్టం చేస్తోందని అంటున్నారు పరిశీలకులు.
నిజానికి తెలంగాణలో రెండు పార్టీలు బలంగా ఉన్నాయి. కాంగ్రెస్, బీజేపీ కూడా అక్కడ బలమైన రోల్ పోషిస్తున్నాయి. అయినప్పటికీ..కేసీఆర్ మాత్రం తనదైన శైలిలో దూసుకుపోతున్నారు. వచ్చే ఎన్నికల్లో పార్టీని విజయ తీరాలకు చేర్చడమే లక్ష్యంగా ఆయన దూసుకుపోతున్నారు. ప్రస్తుత పరిస్థితిలో ఆయనకు అనుకూల పవనాలే వీస్తున్న నేపథ్యంలో ఆయనకు తిరుగులేదని అంటున్నారు పరిశీలకులు. మరి ఏం జరుగుతుందో చూడాలి.