ఫిరాయింపుల విషయంలో హై కోర్టు చేసిన వ్యాఖ్యలపై నిజంగా నేతలు సిగ్గు పడాలి. రాజ్యాంగంపై గౌరవం లేని కొందరు చట్టసభలకు ఎన్నికవుతున్నట్లు తీవ్రంగా వ్యాఖ్యానించింది. పార్టీ ఫిరాయించిన ఎంఎల్ఏలపై అనర్హత వేటు వేసే అంశంపై స్పీకర్లు దీర్ఘకాలంగా పెండింగ్ పెట్టడాన్ని కోర్టు తప్పు పట్టింది. ఆ సందర్భంగా న్యాయమూర్తులు మాట్లాడుతూ, పార్టీ ఫిరాయింపులు సహజమైపోయినట్లు వాపోయారు. నేతల మాటలను నమ్మేందుకు లేదన్నారు. ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా ఫిరాయింపులు మామూలైపోయాయన్నారు.
23 మందిని టిడిపిలోకి లాక్కున్నారు
23 మంది వైసిపి ఎంఎల్ఏలు టిడిపిలోకి ఫిరాయించిన సంగతి అందరికీ తెలిసిందే. వైసిపి తరపున గెలిచిన ఎంఎల్ఏలను 40 ఇయర్స్ ఇండస్ట్రీ చంద్రబాబునాయుడు నిశిగ్గుగా ప్రలోభాలకు గురిచేసి టిడిపిలోకి లాక్కున్నారు. తెలంగాణాలో టిడిపి ఎంఎల్ఏలను కెసిఆర్ టిఆర్ఎస్ లోకి లాక్కున్నపుడు అరచి గగ్గోలు పెట్టిన చంద్రబాబు ఏపిలో మళ్ళీ అదే పనిచేయటం గమనార్హం. పైగా ప్రజాస్వామ్యంలోను, రాజకీయాల్లోను విలువలు గురించి లెక్షర్లు దంచని రోజంటూ ఉండదు చంద్రబాబుకు.
అనర్హత వేటుపై స్పందించని కోడెల
పార్టీ ఫిరాయించిన తమ పార్టీ ఎంఎల్ఏలపై వెంటనే అనర్హత వేటు వేయాలంటూ వైసిపి అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎన్నోసార్లు స్పీకర్ కోడెల శివప్రసాద్ రావుకు లేఖలు రాశారు. హై కోర్టులో కేసు కూడా వేశారు. కోర్టు కూడా ఫిరాయింపులపై ఏదో ఒక నిర్ణయం తీసుకోమని చెప్పింది. ఇంత జరిగినా స్పీకర్ నుండి ఎటువంటి స్పందనా లేదు. అనర్హత వేటు డిమాండ్ తో వైసిపి ఇచ్చిన లేఖలు ఎటు పోయాయో కూడా తెలీదు.
అనర్హత వేటుపై తాజాగా విచారణ
దాంతో స్పీకర్ వైఖరిపై విసిగిపోయిన వైసిపి ఎంఎల్ఏ ఆళ్ళ రామకృష్ణారెడ్డి హై కోర్టులో మరో కేసు వేశారు. ఆ కేసే ప్రస్తుతం విచారణకు వచ్చింది. ఆ విచారణ సందర్భంగానే న్యాయమూర్తులు పై వ్యాఖ్యలు చేశారు. ఫిరాయింపుల ఫిర్యాదుపై స్పీకర్లు నిర్ణయం తీసుకోకపోవటం అనే అంశం న్యాయ సమీక్ష పరిధిలోకి వస్తుందా ? రాదా ? అన్న అంశంపై సుప్రింకోర్టు రాజ్యాంగ ధర్మాసనం విచారణ జరుపుతోందని గుర్తు చేసింది. వీటిపై ఇప్పటికే ఉన్న ఉత్తర్వులను లోతుగా అధ్యయనం చేయాలంటూ పిటీషనర్ తరపు లాయర్ ను న్యాయమూర్తులు కోరటం గమనార్హం.