తెలంగాణలో రాజకీయ వాతావరణం వేడెక్కుతోంది. ఎవరి సర్వల్లో వారు మునిగిపోయారు. ఎవరి లెక్కలు వారేసుకుంటున్నారు. తమకు వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్కు వందకు పైగా సీట్లు వస్తాయని ఆ పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పగా.. కాంగ్రెస్ పార్టీకి 70 సీట్లు, టీఆర్ఎస్కు 40, ఎంఐఎంకు ఏడు, బీజేపీకి రెండు స్థానాలు వస్తాయని తాము నిర్వహించిన సర్వేలో తేలినట్లు కాంగ్రెస్ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అయితే సీఎం కేసీఆర్ ముందస్తు ఎన్నికలు వస్తాయని చెప్పిన నేపథ్యంలో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి.
గద్వాలలో తాజాగా గట్టు ఎత్తిపోతల పథకానికి శంకుస్థాపన చేసిన తర్వాత నిర్వహించిన బహిరంగ సభ నుంచే సీఎం కేసీఆర్ ఎన్నికల శంఖారావం పూరిస్తున్నారని ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. మరోవైపు రేపు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి కుంతియ, ముగ్గురు ఏఐసీసీ కార్యదర్శులు హైదరాబాద్కు వస్తున్నారు. నీతి ఆయోగ్ సమావేశానికి ఒకరోజు ముందు ఢిల్లీలో ప్రధాని మోడీతో సీఎం కేసీఆర్ సమావేశం కావడం.. ఆ తర్వాత హైదరాబాద్కు వచ్చిన ముందస్తు ఎన్నికలకు వెళ్దామా..? అంటూ సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు ఒక్కసారిగా తెలంగాణలో రాజకీయాలను వేడెక్కించాయి.
అయితే.. అదేస్థాయిలో కాంగ్రెస్ నేతలు కూడా కేసీఆర్కు సమాధానం చెప్పాయి. ముందస్తు ఎన్నికలకు తాము సిద్ధమేననీ, కేసీఆర్కు దమ్ముంటే ప్రభుత్వాన్ని బర్తరఫ్ చేసి, ఎన్నిలకు రావాలని సవాల్ విసిరారు. ఇదే విషయంపై కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, కేంద్రమాజీ మంత్రి జైపాల్రెడ్డి, సీఎల్పీ నేత జానారెడ్డి, టీసీసీసీ చీఫ్ ఉత్తమ్కుమార్రెడ్డి కూడా కేసీఆర్కు గట్టి కౌంటర్ ఇచ్చారు. మరోవైపు, జనచైతన్యయాత్ర పేరుతో బీజేపీ నేతలు తెలంగాణలో పర్యటిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో తాము సత్తాచాటుతామని చెబుతున్నారు.
అయితే, వచ్చే ఎన్నికల్లో గెలిచే స్థానాలపై మాత్రం కాంగ్రెస్, టీఆర్ఎస్ పార్టీల లెక్కలు పూర్తి విరుద్ధంగా ఉన్నాయి. 119 అసంబ్లీ స్థానాలు ఉన్న తెలంగాణలో వందకు పైగా సీట్లు గెలుస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. అంతేగాకుండా.. ఒక్కొక్క అభ్యర్థి 60, 70వేల మెజారిటీతో గెలుస్తారని కూడా ఆయన చెప్పడం గమనార్హం. ఇక కాంగ్రెస్ నేతలు మాత్ర సంఖ్యలో కొంత తక్కువగా వేసుకుంటున్నారు. 70 స్థానాల్లో విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేస్తున్నారు.
ఇదిలా ఉండగా.. ముందస్తు ఎన్నికలంటూ సందడి చేసిన గులాబీ నేతలు మళ్లీ సైలెంట్ అయిపోవడం గమనార్హం. ముందస్తు ఎన్నికలపై ఎవరూ మాట్లాడకపోవడం గమనార్హం. అయితే.. ఏ పార్టీ లెక్కలు కరెక్టు అవుతాయో.. ఎవరి లెక్కలు తప్పుతాయో తెలియాలంటే ఎన్నికల వరకు వెయిట్ చేయాల్సిందే.