కాపులకు డిప్యూటీ సీఎం పదవి ఇస్తామని గత ఏడాది ఎన్నికల ప్రచార సమయంలో తూర్పుగోదావరి జిల్లా పర్యటనలో టీడీపీ అధినేత చంద్రబాబు హామీ ఇచ్చారు. కాపుల ఓట్లను ఆకర్షించేందుకు ఇలా చెప్పినా.. ఈ అస్త్రం అప్పుడు బాగానే పనిచేసింది. అందుకే అధికారంలోకి వచ్చిన వెంటనే తూర్పుగోదావరి జిల్లాకు చెందిన సీనియర్ నాయకుడు చిన రాజప్పకు ఆ పదవి ఇచ్చారు. అంతేగాక అత్యంత కీలకమైన హోం శాఖను కూడా అప్పగించారు. అనతి కాలంలోనే ఆయన డమ్మీ మంత్రి అని తేలిపోయింది. పేరు ఆయనదైనా.. ఆ శాఖ వ్యవహారాలు చూసేది మాత్రం ముఖ్యమంత్రే అనే విషయం బయట పడిపోయింది.
మరి వచ్చే ఎన్నికల్లో ఆయన ఎలాంటి ప్రభావం చూపుతారు? ప్రజలు ఆయన్ను ఆదరిస్తారా? లేదా? అనే సందేహాలు వినిపిస్తున్నాయి. అయితే ఈసారి మాత్రం ఆయన ఇంటికి వెళ్లిపోవడం ఖాయమని ఒక సర్వేలో తేలిందట. గత ఎన్నికల సమయంలో కాపులపై టీడీపీ అధినేత చంద్రబాబు ఎన్నో వరాల జల్లులు కురిపించారు. కాపు కార్పొరేషన్ ఏర్పాటు, ఉపముఖ్యమంత్రి పదవి, రైతు రుణమాఫీతోపాటు జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రభావం చాలానే పడింది. దీంతో కాపులంతా గుంపగుత్తగా ఓట్లు గుద్దేశారు. ఇదే సమయంలో తూర్పుగోదావరి జిల్లా టీడీపీ అధ్యక్షుడిగా రెండు దశాబ్దాలకు పైగా వ్యవహరిస్తున్న చినరాజప్పకు ఇది బాగా ప్లస్ అయింది.
పెద్దాపురం నియోజకవర్గం నుంచి ఆయన బరిలోకి దిగి విజయం సాధిచారు. అనంతరం చంద్రబాబు.. తన కేబినెట్లో కీలకంగా ఉన్న హోం శాఖతో పాటు ఉపముఖ్యమంత్రి పదవిని కట్టబెట్టారు. అయితే ఇవి కేవలం కాపులకు ప్రాధాన్యమిచ్చామని చెప్పడానికేనన్న విషయం తర్వాత బయటపడింది. ఉప ముఖ్యమంత్రి అంటే కేవలం పదవి మాత్రమే. ఇక హోంశాఖలో నిర్ణయాలన్నీ బాబు కనుసన్నల్లోనే జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆయన కేవలం డమ్మీ మంత్రిగానే నిలిచిపోయారు. ప్రస్తుతం తూర్పు గోదావరి జిల్లాలో రాజకీయ సమీకరణాలు శరవేగంగా మారుతున్నాయి.
టీడీపీకి ప్రస్తుతం ఎదురుగాలి వీస్తోంది. గత ఎన్నికల్లో ఈ జిల్లాల్లో మెజారిటీ సీట్లు దక్కించుకున్న అధికార టీడీపీ..ఈ సారి గట్టి దెబ్బ తినబోతోందనే సంకేతాలు కనిపిస్తున్నాయి. రుణ మాఫీ విషయంలో చంద్రబాబు చేసిన మోసంపై రైతులు గుర్రుగా ఉన్నారు. ఇక వచ్చే ఎన్నికల్లో తూర్పు గోదావరి జిల్లాల్లో గ్యారంటీగా ఓడిపోయే జాబితాలో హోం మంత్రి నిమ్మకాయల చినరాజప్ప ఉంటారని ఓ సర్వే నిగ్గు తేల్చింది. ఆయన నియోజకవర్గంలో పరిస్థితి ప్రస్తుతం టీడీపీకి ఏ మాత్రం అనుకూలంగా లేదని ఈ సర్వేలో తేలింది.
చినరాజప్పపై ప్రతికూలత వ్యక్తం కావటానికి ప్రభుత్వంపై వ్యతిరేకతతో పాటు.. పలు రాజకీయ కారణాలు కూడా ఉన్నాయట. టీడీపీ అధికారంలోకి వస్తే కాపులకు రిజర్వేషన్లు కల్పిస్తామని హామీ ఇచ్చింది. ఇది అమలుకు నోచుకునే ఛాన్స్ ఏ మాత్రం లేదు. ఈ నియోజకవర్గంలో కీలక నేతగా ఉన్న బొడ్డు భాస్కరరామారావుకు, చినరాజప్పకు మధ్య విభేదాలు తీవ్రరూపం దాల్చాయి. దీనికి తోడు మంత్రి బంధువర్గంలోని సభ్యులు స్థానికంగా చేసిన పనులు కూడా చినరాజప్పపై వ్యతిరేకత పెరగటానికి ముఖ్య కారణాలని చెబుతున్నారు. తూర్పు గోదావరి జిల్లాలో ఒక్క చినరాజప్పకే కాదు..పలు నియోజకవర్గాల్లో పరిస్థితి దారుణంగా ఉందని సర్వేలో తేలిందట.