ముందస్తు ఎన్నికలు మాటెత్తుకున్న గులాబీ బాస్ కేసీఆర్ వ్యూహాత్మకంగా ముందుకు వస్తున్నారు. రోజురోజుకూ పుంజుకుంటున్న కాంగ్రెస్ పార్టీని కకావికలం చేసేందుకు పావులు కదుపుతున్నారు. ఇప్పటికే గ్రేటర్ హైదరాబాద్ నుంచి బిగ్ వికెట్లను టీఆర్ఎస్లోకి జంప్ చేయిస్తున్నారు. ఈ క్రమంలోనే కాంగ్రెస్ బలంగా ఉన్న జిల్లాలపై కూడా ఇప్పుడు గులాబీ బాస్ ప్రధానంగా దృష్టి సారిస్తున్నారు. పార్టీలోకి వచ్చేవాళ్లకు రెడ్ కార్పెట్ వేస్తూనే కాంగ్రెస్ బలంగా ఉన్న వాళ్లు తమ పార్టీలోకి రానిపక్షంలో వాళ్లను ఎలా టార్గెట్ చేయాలా ? అనే అంశంమీద కూడా పెద్ద స్కెచ్లే వేస్తున్నట్టు తెలుస్తోంది.
కాంగ్రెస్ పార్టీలో లుకలుకలు ఉన్న ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో వచ్చే ఎన్నికల్లో క్లీన్స్వీప్ చేసేందుకు ట్రబుల్ షూటర్ హరీశ్రావును రంగంలోకి దించారు. ప్రధానంగా మాజీ మంత్రి, గద్వాల కాంగ్రెస్ ఎమ్మెల్యే, టీపీసీసీ ఉపాధ్యక్షురాలు డీకే అరుణను టార్గెట్ చేశారు. వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా జేజమ్మను ఓడించాలని ఇప్పటి నుంచే ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ఇందులో భాగంగానే గద్వాలలో సీఎం కేసీఆర్ పర్యటన ప్లాన్ చేశారు. గద్వాలలో గట్టు ఎత్తిపోతల పథకానికి శంకుస్థాపన, నియోజకవర్గంలో పార్టీ బలోపేతం చేయడం లాంటి ప్లాన్లు అన్ని మంత్రి హరీశ్రావు ఆధ్వర్యంలోనే జరుగుతున్నాయి.
గత ఎన్నికల్లో తెలంగాణ ఉద్యమ గాలిని తట్టుకుని ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ తట్టుకుని నిలబడింది. ఇక్కడి నుంచే కీలక నేతలు ఉన్నారు. అయితే టీడీపీ నుంచి కోడంగల్ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆ తర్వాత బీజేపీ నేత నాగం జనార్దన్రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారంటూ మొదలైన వివాదం రోజురోజుకూ మరింత పెరిగింది. కాంగ్రెస్ పార్టీలోకి నాగం ను చేర్చుకోవడాన్ని ఎమ్మెల్యే డీకే అరుణ, ఎమ్మెల్సీ దామోదర్రెడ్డి తీవ్రంగా వ్యతిరేకించారు. ఈ క్రమంలో పార్టీలో రెండుమూడు వర్గాలు ఏర్పడ్డాయి. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి జైపాల్రెడ్డి, డీకే అరుణ వర్గాలుగా పార్టీ చీలిపోయింది. ఇదే సమయంలో నాగం రాకను తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఎమ్మెల్సీ దామోదర్రెడ్డితోపాటు మాజీ ఎమ్మెల్యే అబ్రహం తదితరులు టీఆర్ఎస్ పార్టీలో చేరిన విషయం తెలిసిందే.
అయితే, ఇదే అదనుగా భావించిన గులాబీ బాస్ కేసీఆర్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీని కోలుకోలేని దెబ్బకొట్టాలనీ, వచ్చే ఎన్నికల్లో అన్నిస్థానాలను కైవసం చేసుకోవాలని వ్యూహం రచిస్తున్నారు. ఇందులో భాగంగానే ట్రబుల్ షూటర్ హరీశ్రావును రంగంలోకి దింపారు. ఈ మేరకు గద్వాలలో ఈరోజు భారీ బహిరంగ నిర్వహిస్తున్నారు. అయితే, సిట్టింగ్ ఎమ్మెల్యే డీకే అరుణను ఢీకొట్టడం అంత సులువుకాదని పలువురు నాయకులు అంటున్నారు. ఇదిలా ఉండగా.. హరీశ్రావును రంగంలోకి దిగారంటే.. ఎంతటి వారైనా మట్టికరవాల్సిందేననే టాక్ ఆ పార్టీ వర్గాల్లో వినిపిస్తోంది. గులాబీ బాస్ వ్యూహం ఎంతవరకు ఫలిస్తుందో చూడాలి మరి. సీఎం కేసీఆర్ ఎత్తుగడను జేజమ్మ ఎలా ఎదుర్కొంటారన్నది ఇప్పుడు జిల్లాలో హాట్ టాపిగ్ మారింది.