రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలు రానున్నాయనే సంకేతాలు వెల్లడవుతున్నాయి. సెప్టెంబర్ లేదా అక్టోబర్ నెలలో ముందస్తు ఎన్నికలకు వెళ్లాలనే అలోచనలో చేస్తున్న టిఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు పలువురు ప్రముఖుల నుంచి అభిప్రాయ సేకరణ చేస్తున్నారు.
కల్వకుంట్ల చంద్రశేఖర్రావు గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ తో ఆదివారం రాజ్భవన్లో భేటీ అయ్యారు. మధ్యాహ్నం దాదాపు గంటపాటు వీరిద్దరు సమావేశమయ్యారు. మాజీ ప్రధానమంత్రి దేవెగౌడకు వీడ్కోలు పలికిన అనంతరం డైరెక్ట్ గా రాజ్భవన్కు వెళ్లారు. రాష్ట్రంలో అత్యంత వేగంగా పూర్తవుతున్న కాళేశ్వరం, మిషన్భగీరథ ప్రాజెక్టుల పనులతో పాటు, ఇతర కార్యక్రమాలపై చర్చించినట్టు తెలిసింది. ఇప్పటికే మిషన్ భగీరథ పనులు చాలా వరకు పూర్తయ్యాయని, ఆగస్ట్ నాటికి ప్రాజెక్ట్ పూర్తయ్యే లా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్టు సీఎం గవర్నర్కు తెలిపినట్టు సమాచారం.
రైతుబంధు పథకాల అమలు, రైతు బీమా పథకాన్ని ప్రారంభించడానికి తీసుకుంటున్న చర్యలు, ప్రజల నుంచి వస్తున్న స్పందన గురించి ముఖ్యమంత్రి గవర్నర్కు వివరించారు.
అంతకు ముందు ప్రగతిభవన్ లో దేవగౌడతో చర్చించిన అంశాలు కెసిఆర్ గవర్నర్ వద్ద ప్రస్తావనకు తెచ్చినట్లు తెలిసింది. కేంద్రంతో పాటు రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలకు వెళ్లాలనే నిర్ణయం తీసుకుంటే జూలై రెండు లేదా మూడో వారంలో అసెంబ్లీని రద్దు చేయాలనే ఆలోచనపై గవర్నర్తో చర్చించారని అంటున్నారు.
గవర్నర్ ను కలవాటానికి ముందే నిన్న ఆదివారం జాతీయ రాజకీయాలపై టిఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు జనతాదళ్ (సెక్యులర్) జాతీయ అధ్యక్షుడు, మాజీ ప్రధాన మంత్రి దేవెగౌడ తో హైదరాబాద్ లోని ప్రగతి భవన్ సమాలోచనలు జరిపారు. ముందుగానే ఎన్నికలు జరుగుతాయన్న ఊహాగానాల నేపథ్యంలో జాతీయ రాజకీయాలు, సమాఖ్య కూటమి ఏర్పాటుకు సంబంధించిన భవిష్యత్తు కార్యాచరణపై ఇరువురు నేతలు ఈ భేటీలో చర్చించినట్లు సమాచారం.
దేవెగౌడకు మంత్రి కెటిఆర్ ఘనస్వాగతం పలికారు. దేవెగౌడను కెసిఆర్ శాలువతో సత్కరించి, జ్ఞాపికను బహూకరించారు. ఈ సమావేశంలో జాతీయ రాజకీయాలపై ఇరువురు నేతలు చర్చించారు.
వైస్-చైర్మన్ వేముల ప్రశాంత్రెడ్డి, ఎంపీ సంతోష్ కుమార్,హైదరాబాద్ మేయర్ బొంతు రామ్మోహన్, ఎమ్మెల్యే జీవన్రెడ్డి, మైనింగ్ కార్పోరేషన్ చైర్మన్ శేరి సుభాష్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. కాంగ్రెస్ ఎంపీ సుబ్బరామిరెడ్డి మనువడి వివాహానికి హాజరయ్యేందుకు దేవెగౌడ శనివారం రాత్రి ప్రత్యేక విమానంలో హైదరాబాద్ వచ్చారు. కెసిఆర్తో భేటీ తర్వాత దేవెగౌడ నేరుగా బేగం పేట విమానాశ్రయం నుంచి బెంగుళూరు బయలుదేరి వెళ్లారు.
ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటుకు సాధారణ ఎన్నికలు ముగిసే వరకు వేచి ఉండాలని దేవెగౌడ కేసిఆర్ కు సలహా ఇచ్చినట్లు తెలుస్తోంది. తమ తమ రాష్ట్రాల్లో ఉన్న సమస్యలు భిన్నమైనవి అయినందు వల్ల ప్రాంతీయ పార్టీలను ఎన్నికలకు ముందు ఒకతాటికి మీదికి తేవడం సాధ్యం కాదని ఆయన చెప్పినట్లు సమాచారం.
అందువల్ల ఎన్నికలు ముగిసే వరకు వేచి చూడాలని ఆయన చెప్పినట్లు తెలుస్తోంది. దేవెగౌడ సూచనతో కేటీఆర్ ఏకీభవించి నట్లు తెలుస్తోంది.