ప్రపంచంలో ఎక్కడ చూసినా ఉగ్రవాదులు రెచ్చిపోతున్నారు. ముఖ్యంగా అఫ్ఘన్ దేశాల్లో ప్రతిరోజు ఎక్కడో అక్కడ బాంబులతో దాడులు చేస్తున్నారు. తాజాగా సిక్కులు, హిందువులే లక్ష్యంగా అఫ్ఘానిస్థాన్లో ఉగ్రవాదులు రెచ్చిపోయారు. నాంగర్హర్లోని జలాలాబాద్ పట్టణంలో ఆదివారం జరిగిన ఆత్మాహుతి దాడిలో 19 మంది దుర్మరణం చెందారు. మృతుల్లో అత్యధికంగా సిక్కులే ఉన్నారని అధికారులు వెల్లడించారు. వీరంతా నంగర్హార్ ప్రావిన్స్ ను సందర్శించనున్న అధ్యక్షుడు అష్రాఫ్ ఘనీని కలిసి తమ బాధలు చెప్పుకునేందుకు ఓ వాహనంలో వెళుతుండగా, ఈ దాడి జరిగింది.
అక్టోబరులో జరిగే పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేయాలని భావిస్తున్న అత్వార్ సింగ్ ఖల్సా అనే వ్యక్తి కూడా మరణించిన వారిలో ఉన్నారు. ఈ దాడికి పాల్పడింది ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులని తెలుస్తోంది. రెండు రోజుల పర్యటనలో భాగంగా అఫ్ఘానిస్థాన్ అధ్యక్షుడు అష్రఫ్ గనీ జలాలాబాద్కు వచ్చిన సమయంలోనే ఈ దాడి జరగడం గమనార్హం.
హాస్పిటల్ ప్రారంభోత్సవానికి ఆదివారం ఉదయం వచ్చిన అష్రఫ్.. అక్కడి ప్రాంతీయ గవర్నర్ కార్యాలయంలో అధికారులతో సమావేశమయ్యారు. అదే సమయంలో అక్కడికి కొద్దిదూరంలోనే ఉన్న మార్కెట్లో దుండగుడు తనను తాను పేల్చుకున్నాడు. ఈ పేలుడుతో పలు దుకాణాలు, వాహనాలూ ధ్వంసమయ్యాయి.
ఆత్మాహుతి దాడి జరిగినప్పటికీ అఫ్ఘాన్ అధ్యక్షుడు అష్రఫ్ గని నాంగర్హర్లోనే ఉన్నారని అధికారులు తెలిపారు. కాకపోతే ఘటనాస్థలికి దూరంగా సురక్షిత ప్రాంతంలో ఉన్నారని పేర్కొన్నారు. ఈ మద్య అఫ్ఘానిస్థాన్లో మైనారిటీలుగా ఉన్న హిందువులు, సిక్కులపై దశాబ్దాలుగా వివక్ష కొనసాగుతోంది. గతంలో వారిపై ఇస్లామిక్ ఉగ్రవాదులు దాడులకు పాల్పడ్డారు. ఈ నేపథ్యంలో సిక్కులు, హిందువులే లక్ష్యంగా ఈ దాడి జరిగి ఉండొచ్చని అనుమానిస్తున్నారు.