భారత దేశంలో దేవుడిని ఎంత భక్తితో కొలుస్తారో అందరికీ తెలిసిందే. అందుకే గల్లి గల్లికి ఒక గుడి ఉంటుంది. ఇక మత విశ్వాసాల గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. దేవుడి కరుణిస్తే అన్నీ సవ్యంగా జరుగుతాయి..ఆయన కోపిస్తే..అంతే సంగతులు అనే వారు ఎంతో మంది ఉన్నారు. ఢిల్లీలో దారుణం జరిగింది. మోక్షం కోసం ఒకే కుటుంబానికి చెందిన 11 మంది ఆత్మహత్య చేసుకున్నట్టు సమాచారం. ఇదే అభిప్రాయాన్ని పోలీసులు కూడా వ్యక్తం చేస్తున్నారు. మృతుల్లో ఇద్దరు మైనర్లు. అంతేనా, ఇటీవల నిశ్చితార్థం జరిగిన ఓ యువతి కూడా ఉంది.
ఈ ఘటనతో దేశ రాజధాని ఢిల్లీ ఒక్కసారి ఉలిక్కిపడింది. రాత్రి దాకా అందరితో నవ్వుతూ మాట్లాడిన వారు తెల్లవారేసరికి అలా నిర్జీవులై కనిపించారు. ఒకే కుటుంబానికి 11 మందిలో 10 మంది ఒకే గదిలో ఉరితాళ్ళకు వేడుతుంటే.. మరో గదిలో గొంతుకోసి చంపేసిన వృద్ధురాలి మృతదేహాన్ని పోలీసులు కనుగొన్నారు. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. రాజస్థాన్లోని చిత్తోడ్గఢ్కు చెందిన నారాయణ్ దేవి (75), ప్రతిభ (60) ఇరవై రెండేళ్ల క్రితం ఉత్తర ఢిల్లీ బురారీ ప్రాంతంలో ఉన్న సంత్నగర్కువచ్చి స్థిరపడ్డారు. అక్కడ వారు ఒక కిరాణా దుకాణాన్ని నడుపుతూ ప్లైవుడ్ వ్యాపారం కూడా చేస్తున్నారు.
నారాయణ్ దేవికి.. పెద్ద కుమారుడు భవనేశ్ భాటియా (46), కోడలు సవిత (42), మనవలు నీతు (24), మీను (22), ధీరు (12), చిన్న కుమారుడు లలిత్ భాటియా (42), చిన్న కోడలు టీనా (38), వారి కుమారుడు శివమ్ (15) ఉన్నారు. ఇక, ప్రతిభా దేవికి ప్రియాంక (33) అనే కుమార్తె ఉన్నది. వీరంతా ఒకే ఇంట్లో ఉంటున్నారు. ఈ కుటుంబాన్ని హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించారా? అన్న కోణంలోనూ దర్యాప్తు కొనసాగుతోందని కుమార్ పేర్కొన్నారు.
రోజూ ఉదయాన్నే షాపును తెరిచే కుటుంబం ఉదయం 7.30 గంటలైనా బయటకు రాకపోవడంతో పొరుగున ఉండే అమ్రిక్ సింగ్ ఇంట్లోకి వెళ్లాడన్నారు. ఘటనాస్థలాన్ని చూసి దిగ్భ్రాంతి చెందిన అతను వెంటనే పోలీసులకు సమాచారం అందించాడన్నారు.
సంత్నగర్లో ఉన్న రెండంతస్తుల సొంతింటిలో బాధిత కుటుంబం గత 20 ఏళ్లుగా నివసిస్తోంది. వీరంతా మోక్షం కోసం ప్రాణాలు తీసుకున్నట్టు తెలుస్తోంది. దీనిపై పూర్థి స్థాయిలో పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు.