కృష్ణా జిల్లా రాజకీయాలు రోజురోజుకూ మారుతున్నాయి. ముఖ్యంగా ఆంధ్రా ఆక్టోపస్, మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ చుట్టూ రాజకీయాలు తిరుగుతున్నాయి. ఆయన టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబుతో భేటీ అయిన ప్రతిసారీ.. రకరకాల ఊహాగానాలు వినిపిస్తూనే ఉన్నాయి. రాజగోపాల్.. టీడీపీలో చేరిపోవడం ఖాయమని చెబుతున్నా ఆ రోజు ఎప్పుడు అని అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే ఇప్పుడు లగడపాటి పొలిటికల్ రీ ఎంట్రీపై ఒక స్పష్టత వచ్చినట్టే కనిపిస్తోంది. ఆయన చేరికకు చంద్రబాబుకు కూడా సుముఖత వ్యక్తంచేసినట్లు సన్నిహితులు చెబుతున్నారు. ఆయన ఇన్నాళ్లూ ఎంపీ సీటు కోసం వేచిచూస్తున్నారనే చర్చ పొలిటికల్ వర్గాల్లో వినిపిస్తోంది. ఇప్పుడు ఆ నిర్ణయాన్ని కొద్దిగా మార్చుకున్నారని చెబుతున్నారు. ఎంపీగా పోటీ తీవ్రంగా ఉండటంతో.. ఇక ఎమ్మెల్యేగానే పోటీచేస్తారని తెలుస్తోంది!
తన సర్వేలతో రాజకీయ పార్టీలను హీటెక్కించడతో పాటు ఎమ్మెల్యేల గుండెల్లో రైళ్లు పరిగెత్తించేస్తుంటారు రాజగోపాల్! ఆయన సర్వే అంటే.. అంత ఇంట్రస్ట్ ఉంటుంది మరి! విభజనతో తీవ్ర మనస్తాపానికి గురైన ఆయన.. రాజకీయ సన్యాసం తీసుకున్నారు. అయితే ఇప్పుడు ఆయన తన ఒట్టు గట్టుమీద పెట్టేశారని తెలుస్తోంది. మళ్లీ రీ ఎంట్రీ ఇచ్చేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. టీడీపీలో చేరేందుకు ఆయన సుముఖంగా ఉన్నారని సన్నిహితులు స్పష్టంచేస్తున్నారు. విజయవాడలో పట్టున్న ఆయన పార్టీలో చేరితే.. మరింత బలమని సీఎం చంద్రబాబు కూడా భావిస్తున్నారు. కానీ రాజగోపాల్.. విజయవాడ ఎంపీ సీటు అడుగుతున్నారని.. అయితే అది ఇచ్చే పరిస్థితిలో చంద్రబాబు లేరనే ప్రచారం జోరుగా జరుగుతోంది.
అందుకే ఆయన చంద్రబాబును పదేపదే కలుస్తున్నారని కూడా చెబుతున్నారు. ఈ మధ్యే తన టీమ్తో ఒక సర్వే చేయించి చంద్రబాబుకు కూడా ఇచ్చారు. చాలా చోట్ల సిట్టింగులకు వ్యతిరేకత ఉందనే విషయం స్పష్టం అయ్యిందని తెలుస్తోంది. లగడపాటి సర్వే తెలుగుదేశం పార్టీలో రచ్చ రేపింది. అయితే పనిలోపనిగా మరోసారి తన చేరికపై చంద్రబాబుతో మాట్లాడారని చెబుతున్నారు. అయితే సిట్టింగును, ఆ సీటును ఆశిస్తున్న ఇతర టీడీపీ నేతలను కాదని లగడపాటికి ఛాన్సు ఇచ్చేదేలేదని చంద్రబాబు ఇక స్పష్టంచేసేశారట. దీంతో ఇప్పుడు ఎమ్మెల్యేగా పోటీకి రెడీ అవుతున్నాడని టాక్. ఏలూరు లేదా నూజివీడు స్థానాన్ని ఇస్తే అక్కడ నుంచి పోటీ చేస్తానని చంద్రబాబు ముందు ప్రతిపాదన పెట్టాడని టాక్. దీనికి చంద్రబాబు కూడా ఓకే అని, త్వరలోనే ఈయన టీడీపీ తీర్థం పుచ్చుకోవడం ఖాయమని సమాచారం.