జనసేనకు ఐదేళ్లు పాలించే అవకాశం ఇవ్వండని, ఎప్పటికీ తమనే కోరుకునేలా పరిపాలన అందిస్తామని జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ కోరారు. తాము సరికొత్త మార్పును తీసుకొస్తామని, యువతకు ఉద్యోగాలు, ఉపాధి కల్పించాల్సి ఉందని, ప్రాంతీయ అసమానతలను తొలగించాల్సి ఉందని అన్నారు. విజయనగరం జిల్లా ఎస్.కోటలో జరిగిన ప్రజాపోరాట యాత్రలో పాల్గొన్న ఆయన.. స్థానిక సమస్యలపై పోరాడతామని ప్రజలకు హామీ ఇచ్చారు. ప్రజలకు అండగా ఉంటామన్నారు.
అన్యాయం జరుగుతున్నప్పుడు ప్రశ్నించకుండా ఉండలేనని.. ప్రజల అండదండలతోనే ఏదైనా సాధ్యమవుతుందన్నారు. ఆంధ్రప్రదేశ్లో అంగన్వాడీ టీచర్ ఉద్యోగం కావాలన్నా, కాంట్రాక్ట్ పద్ధతిపై ఉద్యోగం ఇప్పించాలన్నా... రూ.5 లక్షలపైనే తెలుగు దేశం నాయకులు, ప్రజా ప్రతినిధుల అనుచరులు లంచాలు గుంజుతుంటే దీన్ని పాలన అంటామా?' అని జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ప్రశ్నించారు. ఈ రోజు విజయనగరం జిల్లా శృంగవరపుకోట నియోజకవర్గ కేంద్రంలో జనసేన పోరాట యాత్రను సాగించారు.
భారీ సంఖ్యలో జన సైనికులు హాజరయ్యారు. "పాలక వర్గాలు చేసే తప్పుల మూలంగా సామాన్యులు అవమానాలు, అన్యాయాన్ని, అసమానతల్ని ఎదుర్కోవాల్సి వస్తోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉత్తరాంధ్రపై నిర్లక్ష్య వైఖరి కనపరుస్తున్నారు. తనకు ఒక్కసారి ఐదేళ్లు పాలించే అవకాశం ఇవ్వండని ప్రజలను కోరారు. ఇంకెప్పుడు జనసేనే ఉండాలనేలా పాలన ఉంటుందని.. చిరస్థాయిగా ఉండిపోతుందన్నారు. ఎందుకంటే.. తాను దోపిడీలు చేయనని.. తనకు లంచాలు అవసరం లేదని తెలిపారు. తాను డబ్బులు ఇచ్చేవాన్నే తప్ప.. లాక్కునే వాణ్ని అస్సలు కాదని అన్నారు.