నలభై ఏళ్ల అనుభవం.. నాలుగేళ్ల కాపురం.. నవ్వుల పాలు.. ఈ మూడు ముక్కలు మన బాబుగారికి చక్కగా సరిపోతాయేమో.. నోరెత్తిత్తే చాలు.. తాను సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న నేతననీ, ప్రధాని మోడీకంటే.. తానే సీనియర్ననీ పదేపదే అదే పనిగా గొప్పలు చెప్పుకునే చంద్రబాబుకు అడుగడుగునా తిప్పలు మాత్రం తప్పడం లేదు.. రోజురోజుకూ సెల్ఫ్ గోల్స్ ఎక్కువ అవుతున్నాయి.. ఒకదాని తర్వాత ఒకటి వరుసబెట్టి పరువుదెబ్బలు తగులుతున్నాయి.. జనానికి ఇచ్చిన హామీలను కనీసం నెరవేర్చలేని స్థితి.. ఎన్నికలు తరుముకొస్తున్న సందర్భం.. అయ్యయ్యో మళ్లీ గెలవలేమోనన్న భయంతో ఏం మాట్లాడుతున్నారో తెలియని అయోమయ స్థితికి చంద్రబాబు చేరిపోయారా..! అనే అనుమానాలు జనంలో కలుగుతున్నాయి.
మహనీయుడి ప్రాణ త్యాగ్యాన్నికూడా టీడీపీ నేత పసలేని దీక్ష ముందు పలుచన చేయడానికి ప్రయత్నించి చంద్రబాబు తన పరువు తానే తీసుకోవడం గమనార్హం. ఏడుకొండల వాడి సాక్షిగా మోడీని నిలదీస్తున్నానని చెప్పిన బాబు.. నీతి ఆయోగ్ సమావేశంలో ఆయనకు వంగివంగి దండాలుపెట్టడం ఆంధ్రులు మరిచిపోయే చిత్రమేనా.. అది.
పనిని పాతరేసి జాతరపోతున్న చంద్రబాబు తీరుతో తెలుగు తమ్ముళ్లకు ఈ మధ్య ఎక్కువగా తుమ్ములు వస్తున్నాయట. ఆయనగారి మాటలు వినలేక.. పోకడ కనలేక.. చివరకు ఏమీ అనలేక.. తమ్ముళ్ల మధ్య గుసగుసలు గసగసాల స్థాయిలో బుసలుకొడుతున్నాయట. ప్రతీ సమావేశం, సభల్లో చంద్రబాబు మాట్లాడుతూ.. ఏమంటారు తమ్ముళ్లూ.. అవునంటారా.. కాదంటారా..? అంటూ అడగడం తరుచూ చూస్తుంటాం.. అయితే ఈమధ్య బాబుగారి తమ్ముళ్లు అవునవునని బయటకి.. కాదుకాదని లోపల అనుకుంటున్నారట.
నిజానికి వారిలా అనుకోవడంలో అర్థముందిలే. ఒకటా రెండా.. ఈ నాలుగేళ్లలో ఎన్నెన్ని యూటర్న్లు.. ఎన్నెన్ని వక్రీకరణలు.. ఏపీకి ప్రత్యేక హోదా వద్దు.. మోడీ ముద్దు.. ప్యాకేజీ చాలు.. లేదులేదు.. హోదా కావాలి.. ప్యాకేజీ వద్దు.. ఇలా ముద్దు ముద్దు.. వద్దు వద్దు మాటలతోనే నాలుగేళ్లు పొద్దెళ్లదీశారు బాబుగారు. ప్రస్తుతం చంద్రబాబు పోకడతో అధికారం రాకడ కష్టమేనని తేలిపోయింది. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వని కేంద్రంపై వైసీపీ అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టేందుకు ప్రయత్నించగా.. రాష్ట్ర ప్రయోజనాల కోసం తానూ మద్దతు ఇస్తానని చెప్పిన చంద్రబాబు ఆ మరుసటి రోజూ యూటర్న్ తీసుకున్నారు. క్రెడిట్ ఎక్కడ వైసీపీకి పోతుందోనన్న భయంతో రాజకీయ ప్రయోజనాలకే జైకొట్టారు బాబుగారు.
వైసీపీ ఎంపీలు రాజీనామాలు చేసినా.. మద్దతు ఇవ్వకుండా.. ఆరోపణలు చేసి అభాసుపాలయ్యారు. తాను చేస్తే సంసారం.. ఎదుటివారు చేస్తే వ్యభిచారం అన్న తీరుగా చంద్రబాబు వ్యవహరించడంపై ఆంధ్రులు అట్టుడుకుతున్నారు. కడపలో ఉక్కు ఫ్యాక్టరీ ఏర్పాటు సాధ్యం కాదని కేంద్రం చెప్పగానే... జిల్లాలో వైసీపీప ఎమ్మెల్యేలు దీక్షలు చేపట్టారు.. పదండి పదండి.. క్రెడిట్ వాళ్లు కొట్టేస్తారంటూ.. సీఎం రమేశ్, బీటెక్ రవిలను ఆమరణ దీక్షకు పురమాయించారు. ఒక లీటర్కు సుమారు రూ.3వేల విలువైన నీళ్లు తాగుతూ.. ఒళ్లు అలిసిపోకుండా.. హాయిగా సీఎం రమేశ్ దీక్ష చేసిన తీరుతో ఆంధ్రలోకమేకాదు.. దేశం మొత్తం అవాక్కయింది.. ఆహా.. ఇలా చేస్తే ఎన్నేళ్లయినా చేయొచ్చంటూ సొంత తమ్ముళ్లేకాదు.. మిగతా వాళ్లూ కితాబిచ్చారు.
ఇక సీఎం రమేశ్తో దీక్ష విరమింపజేసిన సందర్భంగా చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై జనం మండిపడుతున్నారు. మద్రాస్ నుంచి ఆంధ్రరాష్ట్రం ఏర్పాటుకు కేంద్రం హామీ ఇచ్చిన తర్వాత పొట్టి శ్రీరాములు దీక్ష విరమించారంటూ.. చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు దష్ట వక్రీకరణకు పరాకాష్టగా మిగిలాయి. ప్రాణత్యాగం తరువాత జరిగిన ఆందోళనతో కేంద్రం దిగివచ్చింది. ఇంతటి ఘన చరిత్రను కూడా వక్రీకరించడం ఒక్క చంద్రబాబుకే సాధ్యమయిందనే చెప్పొచ్చు. అంతేగాకుండా.. పొట్టి శ్రీరాములుతో సీఎం రమేశ్ను పోల్చడం మరీ విడ్డూరంగా ఉంది.
ఇదేసమయంలో ఢిల్లీలో కేంద్రంపై ఒత్తిడి తెస్తామంటూ.. వెళ్లిన టీడీపీ ఎంపీలు గదిలో సీఎం రమేశ్ ఆమరణ దీక్షపై సెటైర్లు వేసి.. బాబుగారి అంతరంగాన్ని ఆవిష్కరించారు. ఈ సెల్ఫ్గోల్తో ఆయన కోలుకోలేకపోయారు. ఇక జనసేన అధినేత పవన్కల్యాణ్ ఉత్తరాంధ్రలో పర్యటించడంతో బాబుగారు అక్కడికీ వెళ్లారు. శ్రీకాకుళం జిల్లాలో ఏరువాక కార్యక్రమాన్ని తలపెట్టారు. ఆ తర్వాత తూర్పుగోదావరి జిల్లాలో వైసీపీ అధినేత పాదయాత్ర చేస్తుండడంతో బాబుగారు అక్కడికీ పరుగుదీశారు. కాకినాడలో ధర్మపోరాట దీక్ష అంటూ బహిరంగ సభ నిర్వహించారు. తాజాగా.. విశాఖ రైల్వేజోన్ కోసం మరో దీక్ష చేపట్టేందుకు టీడీపీ నేతలు సిద్ధమవుతున్నారు. ఇలా ప్రతిపక్ష నేతలు ఎక్కడికి వెళ్తే.. అక్కడికి బాబుగారు పరుగులు తీస్తున్నారు. పనిని పక్కన పడేసి.. బాబుగారి పరుగులు అధికారం కోసమే తప్ప.. ఆంధ్రుల కోసం కాదనే టాక్ బలంగా వినిపిస్తోంది.