నాలుగేళ్ల మోడీ ప్రభుత్వం కారణంగా ఉద్యోగ కల్పనపై యువత తీవ్ర అసంతృప్తితో ఉన్న వేళ, ఆయన మాత్రం అందుకు భిన్నంగా లక్షలాది ఉద్యోగాలు వచ్చాయన్న ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, వాటికి సంబంధించిన వివరాలు లేవని వ్యాఖ్యానించారు.
‘‘దేశంలో ఉద్యోగాల్లేవని అనడం సరికాదు. ఎన్ని ఉద్యోగాలు ఇచ్చామనే వివరాల్లేవంతే! దాంతో, మమ్మల్ని విమర్శించేందుకు ప్రతిపక్షాలకు ‘అవకాశం’ వచ్చింది. నా ప్రభుత్వాన్ని తప్పుబడుతూ ఇష్టం వచ్చినట్లు ఆరోపణలు చేస్తున్నారు’’ అని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మండిపడ్డారు.
పావలా చేస్తే, రూపాయి పావలా ప్రచారం చేసుకునే నరేంద్ర మోడీ లాంటి వారు, ఇన్నేసి లక్షల ఉద్యోగాలు వచ్చేలా పరిస్థితులు ఏర్పాటు చేస్తే, వాటిపై ఎంత భారీగా ప్రచారం చేసుకుంటారో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరమే లేదు.
ఒక ప్రముఖ మీడియా మేగజైన్ ప్రతినిధి తో ఆయన మాట్లాడుతూ, మౌలిక రంగాలైన హైవేలు, రైల్వేలు, ఎయిర్లైన్లు, హౌసింగ్ తదితర రంగాల్లో తమ ప్రభుత్వం ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టిందని, ఉద్యోగావకాశాలు పెరిగాయని చెప్పారు. ఈపీఎఫ్వో గణాంకాల్ని ఆధారంగా చేసిన సర్వేను చేసుకొని చూస్తే, ఒక్క వ్యవస్థీకృత రంగం లోనే 70 లక్షల కు పైగా ఉద్యోగాలు కల్పించినట్లుగా చెప్పటం గమనార్హం. అసంఘటిత రంగంలో సృష్టించిన ఉద్యోగాలకు ఇవి అదనమని, దేశంలోని అన్ని ఉద్యోగాల్లో ఇవే 80 శాతం ఉంటాయని తెలిపారు.
‘‘భారతదేశంలో పేదరికం తగ్గుతోందని అంతర్జాతీయ నివేదిక ఒకటి వెల్లడించింది. ప్రజలకు ఉద్యోగాల్లేకుండా ఇది సాధ్యమవుతుందా? పలు రాష్ట్రాలు తాము కల్పించిన ఉపాధి అవకాశాల గురించి చెప్పుకుంటున్నాయని,
కర్ణాటకలో గత ప్రభుత్వం 53 లక్షల ఉద్యోగాలు ఇచ్చామని ప్రకటించింది.
గత టర్మ్లో తాము 68 లక్షల ఉద్యోగాలు ఇచ్చామని పశ్చిమ బెంగాల్లో సర్కారు వెల్లడించింది.
రాష్ట్రాలు ఉద్యోగాలను సృష్టిస్తుంటే, కేంద్రం నిరుద్యోగితను పెంచి పోషించడం సాధ్యమా?’’ అంటూ తమపై విమర్శలు చేస్తున్న వారిని ప్రధాని తప్పుపట్టటం గమనార్హం. మొత్తానికి తమ హయాంలో భారీ ఎత్తున ఉపాధి అవకాశాల్ని కల్పించినట్లుగా మోడీ మాటలున్నాయని చెప్పాలి. కాకుంటే, తాను చెప్పే మాటలకు ఆధారాలు లేవని చెప్పటమే అసలుసిసలు కొసమెరుపుగా చెప్పక తప్పదు.
భారత ఆర్థిక వ్యవస్థ లోని వివిధ విభాగాల్లో గత యూపీఏ ప్రభుత్వం "ఎన్నో మందుపాతరలు" ఉంచిందని ఆరోపించారు. అయితే, ‘జాతీయ ప్రయోజనాల’ కోణంలో ఆ లోపాలను వెల్లడించకూడదని తమ ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. తాము రాజకీయాల కంటే దేశానికే పెద్ద పీట వేస్తామని పునరుద్ఘాటించారు. అలాగే, వ్యవసాయం లో సంక్షోభాన్ని అధిగమించడానికి నాలుగు దశల ప్రణాళిక ను ఆయన వెల్లడించారు. అవి, ఇన్పుట్ ఖర్చుల తగ్గింపు, వ్యవసాయోత్పత్తుల ధరల పెంపు, పంట నష్టాలను కనిష్ఠ స్థాయికి తీసుకురావడం, రాబడికి మార్గాలను సృష్టించడం అని వివరించారు.