అవును మీరు చదివింది నిజమే. జాతీయ స్ధాయిలో వైసిపి గొంతు వినపడాలంటే ఇపుడున్నది కేవలం విజయసాయిరెడ్డి మాత్రమే. ఎందుకంటే, ఈనెలలో పార్లమెంటు సమావేశాలు మొదలవబోతోంది. సాధారణ ఎన్నికలు దగ్గరకు వస్తున్నాయి. అదే సమయంలో చంద్రబాబునాయుడు పాలనంతా అస్తవ్యస్ధంగా తయారైంది. వైసిపి అధ్యక్షుడు జగన్ తన పాదయాత్రలో చంద్రబాబుపై ఆరోపణలు, విమర్శలు చేసినా అవేవీ జాతీయ స్ధాయికి చేరవు. అదే సమయంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎన్ని ఆందోళనలు చేసినా పెద్దగా ఉపయోగం లేదు.
లోక్ సభలో వినపడని గొంతు
మొన్నటి వరకూ అటు లోక్ సభలో ఐదుగురు ఎంపిలు, ఇటు రాజ్యసభలో విజయసాయిరెడ్డి బాగానే పోరాడేవారు. రాష్ట్రానికి సంబంధించి, చంద్రబాబు వైఫల్యాల గురించి అవకాశమున్నంతలో ఉభయ సభల్లోనూ ఎంపిలు తమ గొంతును బాగా వినిపించారు. కానీ ఇపుడు లోక్ సభలో అవకాశం లేదు. ప్రత్యేకహోదా డిమాండ్ తో ఐదుగురు లోక్ సభ సభ్యులు చేసిన రాజీనామాలను స్పీకర్ సుమిత్రా మహాజన్ ఆమోదించటంతో వారు మాజీలైపోయారు. దాంతో లోక్ సభలో వైసిపి గొంతు వినపడే అవకాశం లేదు.
భారం మొత్తం మీదే విజయసాయి పైనే
ఈ నేపధ్యంలో అవకాశం ఉన్నది ఒక్క రాజ్యసభ మాత్రమే. అందులోనూ కేవలం విజయసాయిరెడ్డికి మాత్రమే అన్న విషయం అందరికీ తెలిసిందే. ఉండటానికి రాజ్యసభలో ఇద్దరు సభ్యులున్నా రెండో సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ప్రత్యక్ష రాజకీయాలకు పూర్తిగా కొత్త. ఆయన సామర్ద్యం ఏంటో ఎవరికీ తెలీదు. అందుకే మొత్తం భారాన్నంతా విజయసాయిరెడ్డి ఒక్కరే మోయాలి. అందుకే అందరి చూపు ఇపుడు విజయసాయిపై పడింది.
సామర్ధ్యాన్ని నిరూపించుకున్నారు
విజయసాయి కూడా మొదటిసారే రాజ్యసభకు ప్రాతినిధ్యం వహిస్తున్నా ఇప్పటికే తన సామర్ధ్యాన్ని నిరూపించుకున్నారు. ప్రత్యేకహోదా, ప్రత్యేక రైల్వేజోన్ తో పాటు విభజన చట్టంలోని హామీల అమలు తదితరాలపై విజయసాయి అనేక సందర్భాల్లో తన వాగ్దాటితో మెప్పించారు. అదే సమయంలో చంద్రబాబు ప్రభుత్వంలో జరుగుతున్న అవినీతి, అవకతవకలపైన కూడా రాజ్యసభలో నిప్పులు చెరిగారు. దాంతో విజయసాయిపై ఇపుడు అంచనాలు పెరిగిపోతున్నాయి. ఎలాగూ సాధారణ ఎన్నికలకు సమయం ఉన్నది ఏడాదిలోపే. ఇపుడు జరిగే పార్లెంటు సమావేశాలు కూడా ఎక్కువ రోజులు జరగదు. వైసిపి ఎంపిలు రాజీనామాల ఆమోదం తర్వాత జరుగుతున్న మొదటి సమావేశాలు. కాబట్టి ఉన్న కొంత సమయంలోనే విజయసాయి తన గొంతును ఎంత గట్టిగా వినిపిస్తారో చూడాల్సిందే ?