అనంతపురం జిల్లాలో ఇప్పటి వరకూ ఓటమన్నదే ఎరుగని జెసి సోదరులకు వచ్చే ఎన్నికల్లో గెలవటం అంత ఈజీ కాదనే అనుమానాలు బలపడుతున్నాయి. క్షేత్రస్ధాయిలో జరుగుతున్న పరిణామాలు కూడా అనుమానాలకు బలం చేకూరుస్తోంది. ఇటు అనంతపురంతో పాటు తాడిపత్రిలో సోదరులపై పార్టీ నేతల్లోనే అసంతృప్తి పెరిగిపోతోంది. ఫలితంగా శతృవులూ పెరిగిపోతున్నారు. అసలే, చంద్రబాబునాయుడు పాలనపై జనాల్లో తీవ్ర వ్యతిరేకత పెరిగిపోతోందనే ప్రాచారం అందరికీ తెలిసిందే. దానికితోడు పాదయాత్రతో వైసిపి అధ్యక్షుడు వైఎస్ జగన్ జనాల్లో దూసుకుపోతున్నారు. ఈ రెండింటికి అదనంగా జెసి బ్రదర్స్ పై పెరుగుతున్న వ్యతిరేకత.
బ్రదర్స్ ప్రకటనను నమొచ్చా ?
కొంతకాలంగా అసలు జెసి బ్రదర్స్ వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తారా అన్న అనుమానాలు జోరుమీదుంది. వచ్చే ఎన్నికల్లో పోటీ చేసేది లేదని బ్రదర్స్ ఇప్పటికే ప్రకటించినా ఆ ప్రకటనను ఎవ్వరూ నమ్మటం లేదు. అదే సమయంలో బ్రదర్స్ తరపున వాళ్ళ కొడుకులు నియోజకవర్గాల్లో యాక్టివ్ గా తిరుగుతున్నారు. బ్రదర్స్ కొడుకులు వచ్చే ఎన్నికల్లో పోటీ చేయాలంటే అందుకు చంద్రబాబు ఆమోదం తప్పనిసరి. అయితే, వచ్చే ఎన్నికలు చంద్రబాబుకు చాలా కీలకం. 2019లో అధికారంలోకి రాకపోతే చంద్రబాబుకే కాదు లోకేష్ తో పాటు చాలా మంది టిడిపి నేతలకు ఇబ్బందులు తప్పవు. జెసిలను కాదని వాళ్ళ కొడుకులకు టిక్కెట్లిచ్చి చంద్రబాబు ప్రయోగం చేస్తారని ఎవరూ అనుకోవటం లేదు.
పెరిగిపోతున్న వ్యతిరేకత
అదే సమయంలో జెసిల వ్యవహారశైలితో అన్నీ వైపులా వ్యతిరేకత పెరిగిపోతోంది. ప్రతిపక్ష వైసిపి ఎలాగూ జెసి బ్రదర్స్ ను దెబ్బకొట్టేందుకే చూస్తుందనటంలో సందేహం లేదు. మరి, అటువంటపుడు సొంత పార్టీ నేతలు ఏం చేస్తారు ? ఇక్కడే సమస్య మొదలైంది. పార్టీలోని ఎంఎల్ఏలందరితోనూ అనంతపురం ఎంపి జెసి దివాకర్ రెడ్డికి గొడవలే. కాబట్టి వారెవరూ జెసికి సహకరిస్తారనే నమ్మకం లేదు. అదే సమయంలో తాడిప్రతి అసెంబ్లీలో కూడా జెసి ప్రభాకర్ రెడ్డి వ్యవహారశైలిపై మండిపోతున్నారు.
టిడిపికి రాజీనామాలు చేస్తున్న నేతలు
ఎంఎల్ఏ దాటిని తట్టుకోలేక చాలామంది టిడిపి నేతలు రాజీనామాలు చేశారు. తాజాగా జగ్గీ బ్రదర్స్ గా ప్రచారంలో ఉన్న జగదీశ్వరరెడ్డి, జయచంద్రారెడ్డి రాజీనామా చేశారు. అంతకుముందు కొందరు కౌన్సిలర్లు, మండల స్ధాయి నేతలు రాజీనామా చేశారు. ఇపుడు కాకపోయినా కొంతకాలానికి వారంతా చివరకూ వైసిపిలోనే చేరుతారనటంలో సందేహం లేదు. అసలే. తాడిపత్రి వైసిపిలో పెద్దారెడ్డి బలమైన ప్రత్యర్ధిగా మారారు. ఇటువంటి సమయంలో బలమైన వైసిపి ప్రత్యర్ధికి టిడిపి నేతలు కూడా తోడైతే వచ్చే ఎన్నికల్లో ఏం జరుగుతుందో చెప్పాల్సిన అవసరం లేదు. అందుకనే జెసి సోదరులకు ఎదురుగాలి వీస్తోందంటూ ప్రచారం బాగా జరుగుతోంది. ఫలితం ఎలాగుంటుందో చూడాల్సిందే.