స్త్రీ పురుషులు సుదీర్ఘకాలం సహజీవనం చేయడాన్ని వివాహంగానే భావించవచ్చా? అనేది నిర్ణయిస్తామని సర్వోన్నత న్యాయస్థానం సోమవారం స్పష్టం చేసింది. పెళ్లి చేసుకుంటానని నమ్మించి, చాలాకాలం సహజీవనం సాగించి లైంగిక వాంఛలను తీర్చుకున్న వ్యక్తి అనంతరం సదరు మహిళను విడిచి పెట్టడంతో సమస్యలు తలెత్తుతుండటాన్ని ధర్మాసనం తీవ్రంగా పరిగణించింది.
సుదీర్ఘకాల లైంగిక సంబంధం పెళ్లితో సమానమా? వివాహ బంధంలో ఉన్న హక్కులు, లైంగిక సంబంధం కొనసాగిస్తున్నవారికి కూడా వర్తిస్తాయా? ఈ ప్రశ్నల పై అటార్నీ జనరల్ నుంచి అభిప్రాయాలను కోరింది సుప్రీంకోర్టు. సోమవారం ఒక కేసులో సుప్రీంకోర్టు ఈ ప్రశ్నలు వేసింది. అనేక కేసుల్లో ఈ సమస్యలు వస్తున్నాయ ని సుప్రీం కోర్టు వెల్లడించింది. దీర్ఘకాల సహజీవనాన్ని పెళ్లితో సమానంగా భావించే విషయమై నిర్ణయం తీసుకోవాల్సి ఉందనీ, ఈ తరహా కేసులను క్షుణ్నంగా అధ్యయనం చేస్తామని ధర్మాసనం స్పష్టం చేసింది. ఇందుకు కోర్టు సహాయకుడిగా సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సంఘ్వీని నియమించింది.
కర్ణాటకకు చెందిన ఓ జంట ఆరేళ్లపాటు సహజీవనం చేశారు. వీరికి ఒక పాప కూడా పుట్టింది. తర్వాత అతడు ఆమె నుంచి విడిపోవడంతో బాధితురాలు న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. తనను వివాహం చేసుకుంటానని నమ్మించి మోసం చేయడమే కాదు, తనపై అత్యాచారం కూడా జరిపాడంటూ ఆమె తన పిటిషన్లో పేర్కొంది. అయితే, ఆ వ్యక్తి మాత్రం దీన్ని వ్యతిరేకిస్తూ హైకోర్టును ఆశ్రయించి, పరస్పర అంగీకారంతోనే తాము కలిశామనీ, తనపై అత్యాచార అభియోగాన్ని కొట్టేయాలని అభ్యర్ధించాడు.
అతడి అభ్యర్థనను కర్ణాటక హైకోర్టు తిరస్కరించడంతో దీన్ని సవాలుచేస్తూ సుప్రీం కోర్టును ఆశ్రయించాడు. ఈ కేసుపై జస్టిస్ ఏకే గోయెల్, జస్టిస్ ఎస్ అబ్దుల్ నజీర్ ల ధర్మాసనం సోమవారం విచారణ చేపట్టింది. అసలు దీర్ఘకాల సహజీవనాన్ని పెళ్లి తో సమానంగానే భావించాల్సి ఉంటుందా? అన్న సందేహం విచారణ సందర్భంగా వ్యక్తమైంది. పరస్పర అంగీకారంతో సహ జీవనం సాగించినప్పుడు దాన్ని అత్యాచారంగా పరిగణించలేమని, అయితే దీన్ని పెళ్లితో సమానంగా భావించాలా? లేదా? అనేది నిర్దరించాల్సి ఉంటుందని న్యాయమూర్తులు అభిప్రాయపడ్డారు.
ఒకవేళ ఇలాంటి బంధం పెళ్లితో సమానమైతే, భాగస్వామిపై సదరు వ్యక్తికి భర్తగా కొన్ని బాధ్యత లు ఉంటాయి కదా? అన్న అంశం చర్చకు వచ్చింది. కొన్నేళ్లపాటు సహజీవనం చేసిన తర్వాత పురుషుడు పెళ్లికి నిరాకరిస్తే దీనికి పరిహారం ఏంటి? అనే సందేహం వెల్లబుచ్చింది.
ఒక వ్యక్తితో చాలా కాలం పాటు లైంగిక సంబంధం పెట్టుకోవడం లాంటి కేసులు చాలా వస్తున్నాయని, దాన్ని అత్యాచారంగా (రేప్ కేసు) పరిగణిస్తూ సదరు వ్యక్తిని శిక్షించ లేమని కోర్టు అభిప్రాయపడింది. ఇలాంటి సుదీర్ఘకాల సంబంధాలను, వివాహబంధాలుగా గుర్తించాలా? లేదా? అన్న సందిగ్ధంలో సుప్రీంకోర్టు పడింది. సాధారణంగా అలాంటి సంబంధాలు పెట్టుకున్న వారికి కూడా బాధ్యతలు ఉంటాయని కోర్టు పేర్కొన్నది.
రేప్ కేసుగా నమోదైన ఈ కేసులోని నిందితుడు, తనను అత్యాచారం అభియోగాల నుంచి విముక్తి కల్పించాలంటూ అభ్యరించాడు. ఆ కేసును వాదిస్తున్న సుప్రీంకోర్ట్ ఈ అభిప్రాయాలను వ్యక్తం చేసింది. తనకు ఓ స్త్రీతో చాలా కాలం నుంచి శారీరక సంబంధం ఉందని అతను తన పిటీషన్లో పేర్కొన్నాడు. వాస్తవానికి ఓ మహిళతో అతనికి చాన్నాళ్లుగా లైంగిక బంధం ఉన్నా, అతను మాత్రం ఆమెను పెళ్లాడేందుకు నిరాకరించాడు. దీంతో ఈ కేసుకు ప్రాముఖ్యత వచ్చింది. ఈ కేసులో అనేక అనుమానాలు తలెత్తడంతో, అటార్నీ జనరల్ కె కె వేణుగోపాల్ సలహాలను సుప్రీం కోరింది.
ఈ విషయంలో న్యాయస్థాన సహాయార్థం అదనపు సొలిసిటర్ జనరల్ను నియమించాలని అటార్నీ జనరల్ వేణుగోపాల్ను ఆదేశించింది. తదుపరి విచారణను సెప్టెంబరు 12కు వాయిదా వేసింది.