ఉమ్మడి వరంగల్ జిల్లా డోర్నకల్ టీఆర్ఎస్ ఎమ్మెల్యే డీఎస్ రెడ్యానాయక్కు గడ్డుకాలం ఎదురుకానుందా..? అంటే ఔననే అంటున్నాయి తాజా పరిణామాలు. వచ్చే ఎన్నికల్లో ఆయన ఎక్కడి నుంచి పోటీ చేస్తారు..? అసెంబ్లీకా..? పార్లమెంటుకా..? అన్న ప్రశ్నలతో పాటు చివరకు ఆయనకు ఏ టిక్కెట్ దక్కదా ? అన్న డౌట్ కూడా రైజ్ అవుతోంది. సీఎం కేసీఆర్ మోడీని కలిసి వచ్చాక ముందస్తు ఎన్నికలపై ప్రకటన చేయడంతో తెలంగాణలో ముందస్తు ఎన్నికల హీట్ స్టార్ట్ అయ్యింది. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఆయన పరిస్థితి గందరగోళంగా తయారైందనే టాక్ నియోజకవర్గంలో వినిపిస్తోంది. ఇప్పటికే అటు క్యాడర్లో, ఇటు ప్రజల్లో వ్యతిరేకత వ్యక్తమవుతున్నట్లు గులాబీ బాస్ సర్వేలో తేలినట్లు ప్రచారం జరుగుతోంది.
ఈ నేపథ్యంలో ఆయనకు వచ్చే ఎన్నికల్లో అసలు టికెట్ వస్తుందో.. రాదో తెలియని పరిస్థితి నెలకొందని పార్టీ వర్గాలు గుసగుసలాడుకుంటున్నాయి. మరోవైపు వచ్చే ఎన్నికల్లో ఆయన మహబూబాబాద్ పార్లమెంటు స్థానం నుంచి కూడా పోటీ చేసే అవకాశాలు కూడా ఉన్నాయనే టాక్ వినిపిస్తోంది. 2014 ఎన్నికల్లో డోర్నకల్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా బరిలోకి దిగి రెడ్యానాయక్ విజయం సాధించారు. టీఆర్ఎస్ నుంచి బరిలోకి దిగిన సత్యవతి రాథోడ్ ఓటమి పాలయ్యారు. ఆ తర్వాత రెడ్యా అధికార టీఆర్ఎస్ పార్టీలో చేరారు. నిజానికి కాంగ్రెస్ పార్టీలో ఆయన ఓ వెలుగువెలిగారు. వైఎస్సార్ హయాంలో మంత్రిగా కూడా ఆయన పనిచేశారు. అయితే, ఇప్పుడు ఆయన రాజకీయ భవిష్యత్ ప్రశ్నార్థకంగా మారుతుందనే టాక్ వినిపిస్తోంది.
నియోజకవర్గంలో దశాబ్దాలుగా పాతుకుపోయిన రెడ్యా పనితీరుపై ప్రజల్లో వ్యతిరేకత నెలకొన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇదిలా ఉండగా.. నియోజకవర్గంలో సత్యవతి రాథోడ్, రెడ్యా వర్గాలుగా పార్టీ చీలిపోయింది. పార్టీలో ఆధిపత్య పోరు ఎక్కువయ్యింది. ఇప్పుడు వచ్చే ఎన్నిక్లలో వీరిలో ఎవరికి టికెట్ వస్తుందో తెలియని పరిస్థితి నెలకొంది. రెడ్యా తనకు డోర్నకల్, తన కుమార్తె కవితకు మహబూబాబాద్ అసెంబ్లీ సీట్లు ఇవ్వాలని పట్టుబడుతున్నారు. అయితే అక్కడ టీఆర్ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యే శంకర్ నాయక్ తన సీటును పదిలం చేసుకునే క్రమంలో తనకంటూ స్ట్రాంగ్ వర్గాన్ని ఏర్పరుచుకున్నారు.
మరోవైపు.. వచ్చే లోక్సభ ఎన్నికల్లో రెడ్యానాయక్ను మహబూబాబాద్ పార్లమెంటు స్థానం నుంచి బరిలోకి దించాలనే ఆలోచనలో గులాబీ బాస్ ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. అయితే, ఇందుకు రెడ్యా సుముఖంగా లేనట్లు తెలుస్తోంది. అయితే సిట్టింగ్ టీఆర్ఎస్ ఎంపీ సీతారాంనాయక్కు టికెట్ ఇవ్వరనే టాక్ వినిపిస్తోంది. అయితే, వచ్చే ఎన్నికల్లో డోర్నకల్ టికెట్ను సత్యవతి రాథోడ్కు ఇచ్చేందుకే పార్టీ అధిష్టానం ఇలా ఎంపీ టికెట్ పేరుతో రెడ్యాకు ఎసరు పెడుతుందనే వాదన కూడా ఉంది. ఇదిలా ఉండగా.. రెడ్యా తనయుడు కూడా వచ్చే ఎన్నికల్లో డోర్నకల్ టికెట్ ఆశిస్తున్నట్లు తెలుస్తోంది.
ఓవరాల్గా చూస్తే ఇటు రెడ్యాపై వ్యతిరేకతతో ఆయనకు డోర్నకల్ సీటు ఇవ్వరన్నది ఓ టాక్గా ఉంటే, ఆయన మాత్రం తనతో పాటు తన కుమార్తె సీటు కోసం పట్టుబడుతున్నారే తప్పా తన వారసుడిని పట్టించుకోవడం లేదన్న టాక్ జిల్లాలో బలంగా వినిపిస్తోంది. దీంతో రెడ్యా వారసుడు కూడా ఈ సారి అవసరమైతే సీటు కోసం తండ్రితోనే తాడోపేడో తేల్చుకునేలా ఉన్నాడని సమాచారం. ఇటు డోర్నకల్ సీటు కోసం సత్యవతి రాథోడ్ కూడా పోటీపడుతున్నారు. అటు మహబూబాబాద్లో శంకర్నాయక్ తన సీటు కాపాడుకునేందుకు రకరకాల స్కెచ్లు వేస్తున్నారు. అటు ఇంటి నుంచి, ఇటు బయటి నుంచి టికెట్ పోటీని రెడ్యానాయక్ ఎదుర్కొంటున్నారు. ఈ విషయంలో గులాబీ బాస్ సీఎం కేసీఆర్ చివరకు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి మరి.