ఈ మధ్య కాలంలో చంద్రబాబునాయుడును సోషల్ మీడియా చెండాడేస్తోంది. సోషల్ మీడియా అన్నది రెండు వైపులా పదునున్న కత్తి లాంటిదన్న సంగతి అందరికీ తెలిసిందే. ఎక్కడ బహిరంగసభలో మాట తూలినా, సమీక్ష సమావేశాల్లో తప్పు మాట్లాడినా వెంటనే సోషల్ మీడియా చంద్రబాబు దుమ్ము రేగ్గొడుతోంది. ఎన్నికలు దగ్గరపడే కొద్దీ చంద్రబాబు, లోకేష్ , టిడిపిలకు వ్యతిరేకంగా సోషల్ మీడియా బాగా యాక్టివ్ అయిపోతోంది. ప్రత్యేకించి వైఎస్సార్సిపి తరపున సోషల్ మీడియా ప్రధానంగా ఫేస్ బుక్, వాట్సప్ యమా యాక్టివ్ గా ఉంది. దాన్ని తట్టుకోలేకే చంద్రబాబు, లోకేష్ తల్ల క్రిందులవుతున్న విషయం అందరూ చూస్తున్నదే.
జగన్ ను దెబ్బతీసిన టిడిపి
2014లో ఇదే సోషల్ మీడియాను ఉపయోగించుకుని చంద్రబాబు, వైసిపి అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డిని ఎంతగా డీ ఫేమ్ చేశారో అందరూ చూసిందే. అపుడు జగన్ ఎంతగా ఫిర్యాదు చేసినా ఎవరూ పట్టించుకోలేదు. ఇపుడదే ఆయుధాన్ని చంద్రబాబు, టిడిపి పై వైసిపి ప్రయోగిస్తోంది. కాకపోతే లోకేష్ బోనస్ గా దొరికారు. మీడియాలో చంద్రబాబు, లోకేష్ ఒక కోణంలోనే కనబడుతున్నారు. ఆ కనబడని రెండో కోణాన్ని సోషల్ మీడియా బయటపెట్టేస్తోంది. దాంతో తండ్రి, కొడుకులు బాగా ఇబ్బంది పడుతున్నారు.
కురుక్షేత్ర యుద్దంలో కౌరవులు గెలిచారట
ఈ మధ్యనే చంద్రబాబు ఏదో బహిరంగసభలో మాట్లాడుతూ, ' పాండవులకు, కౌరవులకు మధ్య జరిగిన మహాభారత యుద్ధంలో కౌరవులు గెలిచినట్లే ' అని చెప్పగానే సభలో ఒకటే చప్పట్లు. ఈ మధ్యనే సిఎం రమేష్ నిరాహార దీక్ష విరమణ సందర్భంగా వేదిక పై నుండి మాట్లాడుతూ, పొట్టి శ్రీరాములు నిరాహార దీక్ష విరమణ తర్వాతనే ఆంధ్రప్రదేశ్ వచ్చిందంటూ చెప్పటంలో అందరూ ఆశ్చర్యపోయారు. పొట్టి శ్రీరాములు ఆమరణ నిరాహార దీక్షలో మరణించిన తర్వాతనే ఆంధ్రప్రదేశ్ ఏర్పడిందన్న సంగతి అందరికీ తెలిసిందే. అసెంబ్లీలో ఆన్ రికార్డుగాను బయట కూడా చంద్రబాబు మాట్లాడుతూ, అవినీతిలో ఏపిని దేశంలోనే నెంబర్ 1 స్ధానంలో నిలబెడతానంటూ ఎన్నోసార్లు ప్రకటించిన విషయం అందరికీ గుర్తుండే ఉంటుంది.
అత్యంత అవినీతి పార్టీ టిడిపినే-లోకేష్
ఇక, లోకేష్ విషయం తీసుకుంటే, ఏం మాట్లాడుతారో కూడా తెలీని స్ధితిలో మాట్లాడేస్తున్నారు. ' దేశం మొత్తం మీద అవినీతి, కుల గజ్జి ఉన్న ఏకైక పార్టీ తెలుగుదేశం మాత్రమే అంటూ లోకేష్ చేసిన బహిరంగ ప్రకటన గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. అదే విధంగా తెలుగు వాడైవుండి కూడా తెలుగు నేర్చుకునేందుకు ఏకంగా రూ. 10 లక్షల ప్రజాధానాన్ని వృధా చేస్తున్న ఏకైక మంత్రి లోకేష్ మాత్రమే. ఏపి విభజన చేసినపుడు రాష్ట్రానికి ఇచ్చిన హామీల గురించి ప్రధానమంత్రి నరేంద్రమోడికి అప్పుడు తెలీదా ? అంటూ సైకిల్ తొక్కుతూ లోకేష్ అడిగిన ప్రశ్నతో టిడిపి నేతలే తలలు పట్టుకున్నారు. రాష్ట్ర విభజన సమయంలో ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ అన్న విషయం కూడా లోకేష్ కు గుర్తులేదేమో ?
వైసిపి మద్దతుదారుల అరెస్టులు
చంద్రబాబు, లోకేష్ పై సోషల్ మీడియాలో కుప్పలు కుప్పలుగా సెటైర్లే సెటైర్లు పడుతున్నాయి. దాన్ని జీర్ణించుకోలేకే కొందరిని అరెస్టులు కూడా చేయించారు. అయినా పోస్టులు ఆగకపోగా మరింత పెరిగాయి. అదే సమయంలో జగన్, వైసిపిలపై కూడా టిడిపి వైపు నుండి సోషల్ మీడియాలో పోస్టులు వస్తున్నాయి. అయితే, వైసిపి పోస్టుల ముందు టిడిపి పోస్టులు తేలిపోతున్నాయి. పార్టీ తరపునే కాకుండా చంద్రబాబు, లోకేష్ లు పేషీల్లో కూడా కొందరిని ప్రత్యేకంగా పెట్టుకున్నారని ప్రచారం జరుగుతోంది. అయితే, అవేవీ కూడా వైపిపి పోస్టులను అడ్డుకోలేకపోతున్నాయి. అందుకు కారణమేంటంటే, చంద్రబాబు, లోకేష్ కు మద్దతుగా వస్తున్న సోషల్ మీడియా పోస్టులన్నీ జీతాలు తీసుకుని సిబ్బంది పెడుతున్నవి. అదే చంద్రబాబు, లోకేష్ కు వ్యతిరేకంగా వస్తున్న సోషల్ మీడియా పోస్టుల్లో అత్యధిక గ్రూపులు జగన్ కు మద్దతుగా స్వచ్చంధంగా పనిచేస్తున్నవి. అందుకనే వైసిపి గ్రూపుల ముందు టిడిపి తేలిపోతోంది.