జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ సంచలన ఆరోపణలు చేశారు. విశాఖపట్నం భూ కుంభకోణంలో తెలుగుదేశంపార్టీ ఎంపిలు, ఎంఎల్ఏల పాత్ర ఉందన్నారు. కుంభకోణంలో ప్రజాప్రతినిధుల పాత్ర ఉంది కాబట్టే దర్యాప్తు నివేదికను చంద్రబాబునాయుడు బయటపెట్టటం లేదంటూ మండిపడ్డారు. మరోసారి తననే ముఖ్యమంత్రిగా ఎన్నుకోవాలని చంద్రబాబు అడుగుతున్న విషయాన్ని ప్రస్తావిస్తూ ఎందుకు ఎన్నుకోవాలంటూ చెప్పాలని నిలదీశారు.
భూ కుంభకోణంలో ఎంపిలు, ఎంఎల్ఏలు
వచ్చే ఎన్నికల్లో చంద్రబాబునాయుడును ముఖ్యమంత్రిగా కానిచ్చేది లేదని స్పష్టంగా చెప్పారు. విశాఖపట్నంలోని అనకాపల్లి, చోడవరం నియోజకవర్గాల పర్యటనలో పవన్ కల్యాణ్ పై వ్యాఖ్యలు చేయటం టిడిపి వర్గాలకు మింగుడుపడటం లేదు. చంద్రబాబు 2019లో మళ్ళీ సిఎం అయితే ఎలాగుంటుందో నాలుగేళ్ళల్లో బయటపడిందన్నారు. అందుకే చంద్రబాబును మళ్ళీ ముఖ్యమంత్రిని కానివ్వకూడదని నిర్ణయించుకున్నట్లు పవన్ చెప్పటం గమనార్హం.
చంద్రబాబు దోచేస్తున్నారు
రాష్ట్రాన్ని అవినీతిపరులు, దోపిడిదారుల చేతుల్లోకి పోకూడదనే అప్పట్లో చంద్రబాబుకు మద్దతిచ్చినట్లు చెప్పారు. అయితే, దోపిడి అంటే ఎలాగుంటుందో 2014లో ముఖ్యమంత్రి అయిన తర్వాత చంద్రబాబు చూపించచారని ఎద్దేవా చేశారు. అంటే చంద్రబాబు అవినీతిపరుడని, దోపిడి చేస్తున్నట్లు తెలుసుకోవటానికి పవన్ కు నాలుగేళ్ళుపట్టింది. రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో జనసేన నాయకులు, కార్యకర్తలపై భౌతికదాడులు చేస్తున్నట్లు పవన్ ధ్వజమెత్తారు.
చంద్రబాబు, జగన్ కు కేసుల భయం
ప్రత్యేకహోదా విషయంలో ప్రధానమంత్రి నరేంద్రమోడిని నిలదీసే ధైర్యం తనకుందని అయితే కేసుల భయంతోనే చంద్రబాబు, జగన్ భయపడుతున్నట్లు మండిపడ్డారు. పెద్ద నోట్ల రద్దు సంగతి చంద్రబాబుకు ముందే తెలుసంటూ పవన్ పెద్ద బాంబు పేల్చారు. అందుకే హెరిటేజ్ కంపెనీలో వాటాలను ముందుగానే అమ్మేశారంటూ ఆరోపించారు. పనిలో పనిగా అనకాపల్లి ఎంపి, ఎంఎల్ఏలపై కూడా మండిపడ్డారు. అనకాపల్లిలో వైసిపి, టిడిపి నేతలు కలిసే లిక్కర్ సిండికేట్ వ్యాపారాలు చేస్తున్నట్లు మండిపడ్డారు. ఇసుక, వనరుల దోపిడిలో టిడిపి ఎంఎల్ఏలు, నేతలు పీకల్లోతు ముణిగిపోయినట్లు ధ్వజమెత్తారు.