భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణపై చెప్పులతో దాడి జరిగింది. ఈ రోజు సాయంత్రం నెల్లూరు జిల్లాలోని కావలి నియోజకవర్గంలో పర్యటించేందుకు కన్నా అక్కడి వెళ్ళారు. కన్నాతో పాటు పలువురు నేతలు, కార్యకర్తలు వాహనంపై ప్రదర్శన వెళుతున్నపుడు హటాత్తుగా దాడి జరిగింది. కొంతమంది వ్యక్తులు కన్నా లక్ష్యంగా చెప్పులతో దాడి చేశారు. హటాత్తుగా జరిగిన దాడితో ముందు బిజెపి శ్రేణులు బిత్తరపోయారు. అయితే, వెంటనే తేరుకుని దాడిని బిజెపి నేతలు ప్రతిఘటించారు. దాడి చేయటానికి వచ్చిన వారిపై ఎదురుదాడి చేశారు. అందులో ఒకరిద్దరిని పట్టుకుని చావబాదారు.
వ్యక్తిని చితక్కొట్టిన బిజెపి శ్రేణులు
ఎప్పుడైతే దాడి చేసిన వారిలో ఒకరిద్దరిని బిజెపి నేతలు పట్టుకుని చితక్కొట్టారో అక్కడి నుండి సీన్ మొత్తం మారిపోయింది. టిడిపి కార్యకర్తలే తమ అధ్యక్షునిపై చెప్పులతో దాడి చేశారంటూ బిజెపి నేతలు ఆరోపణలు చేయటం మొదలుపెట్టారు. ఎప్పుడైతే కన్నాపై చెప్పులతో కావలిలో దాడి జరిగిందని తెలిసిందో విషయం రాష్ట్రమంతా వైరల్ గా మారిపోయింది. బిజెపి శ్రేణులు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఆందోళనకు దిగాయి.
కన్నాపై దాడికి టిడిపికి సంబంధం లేదు
జరిగిన ఘటనతో టిడిపికి బాగానే డ్యామేజ్ అయ్యింది. దాంతో డ్యామేజ్ కంట్రోలు కోసం వెంటనే నెల్లూరు జిల్లా దేశం నేతలు రంగంలోకి దిగారు. కన్నాపై దాడికి తమ పార్టీకి సంబంధం లేదని ఎదురుదాడి మొదలుపెట్టారు. కన్నాపై దాడిలో బిజెపి నేతలకు దొరికిన వ్యక్తికి తమ పార్టీతో సంబంధమే లేదని ఎంఎల్సీ బీద రవిచంద్ర మీడియాతో చెప్పారు. మొత్తానికి ఇరు పార్టీల నేతల మధ్య దాడి వివాదం తారస్దాయికి చేరుకుంటోంది. ఎందుకంటే, ఈ మధ్యనే అనంతపురంలో కూడా కన్నాపై టిడిపి శ్రేణులు దాడి చేసిన సంగతి అందరూ చూసిందే. అంతుకు ముందు తిరుమలలో జాతీయ అధ్యక్షుడు అమిత్ షా కాన్వాయ్ పైన కూడా టిడిపి నేతలు దాడి చేశారు. బిజెపి నేతలపై వరుసగా టిడిపి శ్రేణులు దాడులు చేస్తుండటం గమనార్హం.
మోడిపై కోపంతోనే దాడి
ప్రధానమంత్రి నరేంద్రమోడిపై కోపంతోనే తాను దాడి చేశానంటూ దాడిచేసి బిజెపి నేతలకు దొరికిన వ్యక్తి చెబుతున్నాడు. బిజెపి నేతల చేతిలో దేహశుద్దికి గురైన వ్యక్తిని పోలీసులు అదుపులో తీసుకున్నారు. తర్వాత మీడియాతో మాట్లాడుతూ, తాను ఒక లారీ డ్రైవర్ గా చెప్పుకున్నాడు. మోడిపై కోపంతో కన్నాపై దాడికి దిగటం ఏంటో అర్ధం కావటం లేదు. ఇదే విషయమై బిజెపి ఎంఎల్సీ సోము వీర్రాజు మాట్లాడుతూ, ప్రభుత్వమే దొరికిన లారీ డ్రైవర్ తో ఆ విధంగా చెప్పిస్తోందంటూ మండిపడ్డారు.