ప్రధాన పార్టీల అధినేతల లెక్కలు మారుతున్నాయా ? క్షేత్రస్ధాయిలో జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే అందరిలోనూ అవే అనుమానాలు మొదలయ్యాయి. ఈమధ్య కాలంలో చంద్రబాబునాయుడు, వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాటలు విన్న వారికందరికీ అవే అనమానాలు వస్తున్నాయి. ఎందుకంటే, జగన్ బిసి బాట పడుతుంటే చంద్రబాబేమో దళిత వేట మొదలుపెట్టారు. మారుతున్న లెక్కలు పార్టీ అధినేతల తల రాతలు మార్చేసే అవకాశాలు ఉండటంతో సర్వత్రా ఇపుడా అంశాలపైనే చర్చ జరుగుతోంది.
మారుతున్న అధినేతల లెక్కలు
ఇంతకీ ఆ అనుమానాలు ఏంటంటే, తెలుగుదేశంపార్టీ పెట్టిన దగ్గర నుండి బిసి సామాజికవర్గానికి విడదీయరాని సంబంధం ఉందన్న విషయం అందరికీ తెలిసిందే. మిగిలిన సామాజికవర్గాలు టిడిపి విషయంలో కాస్త పట్టువిడుపులు చూపిస్తున్నా బిసిలు మాత్రం ఎప్పుడూ టిడిపిని వదలలేదు. అదే సందర్భంలో టిడిపి కూడా బిసి నేతలకు బాగానే ప్రాధాన్యత ఇస్తోంది. ఇదంతా పోయిన ఎన్నికల వరకూ జరిగిన చరిత్ర. వచ్చే ఎన్నికల్లో వివిధ కారణాల వల్ల బిసి సామిజికవర్గం టిడిపికి దూరంగా జరగబోతోందా ? అన్న అనుమానాలు మొదలయ్యాయి.
బిసిలు దూరమైతే చంద్రబాబు స్వయంకృతమే
జరుగుతున్న ప్రచారం ప్రకారం బిసిలు గనుక టిడిపికి నిజంగానే దూరంగా జరిగితే అది చంద్రబాబు స్వయంకృతమనే చెప్పాలి. అందుకు నాంది పోయిన ఎన్నికల్లో కాపులకు చంద్రబాబిచ్చిన హామీనే. సిఎం అవ్వాలన్న ఏకైక లక్ష్యంతో కాపులను బిసి రిజర్వేషన్లలోకి చేరుస్తానంటూ ఇచ్చిన హామీతో బిసిలు చంద్రబాబంటే మండిపోతున్నారు. చంద్రబాబు హామీని వ్యతిరేకిస్తూ బిసి సామాజికవర్గం రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు చేసిన సంగతి అందరూ చూసిందే. హామీ ఇచ్చినట్లు కాపులను బిసిల్లోకి చేర్చగలిగారా అంటే అదీ లేదు.
హామీతో చంద్రబాబుపై మండుతున్న బిసిలు
అంటే కాపులు, బిసిల విషయంలో చంద్రబాబుది ' వ్రతమూ చెడింది...ఫలితమూ చెడింది' అన్నట్లైంది. ఆ విషయాన్ని చంద్రబాబు కూడా గ్రహించినట్లున్నారు. అందుకనే ఈ మధ్య కాలంలో చంద్రబాబు ఎస్సీలపై ఎక్కువ ప్రేమ కురిపిస్తున్నట్లు అనిపిస్తోంది. ఎస్సీలను ఆకట్టుకునేందుకు దళితతేజం అని, ఎస్సీలకు ప్రత్యేకంగా రుణాల మంజూరని అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. మరి, ఎస్సీలు చంద్రబాబును ఆధరిస్తారా లేదా అన్నది సస్పెన్సే.
ఎస్సీల లైన్ మారుతుందా ?
ఇక, అదే సమయంలో జగన్ బిసిలను ఆకట్టుకునేందుకు అనేక వరాలిస్తున్నారు. బిసిలను ఆకట్టుకునేందుకు వారికి జగన్ తెగ హామీలిచ్చేస్తున్నారు. టిడిపికి వెన్నుదన్నుగా నిలుస్తున్న బిసిలను ఆ పార్టీకి దూరం చేయటమే జగన్ ఏకైక లక్ష్యంగా కనిపిస్తోంది. మరి, బిసిలను దగ్గరకు తీసుకుంటే కాపులు ఏం చేస్తారో తెలీదు. అలాగే దశాబ్దాల పాటు కాంగ్రెస్ కు మద్దతుగా నిలుస్తున్న ఎస్సీలు రాష్ట్ర విభజన నేపధ్యంలో కాంగ్రెస్ నుండి వైసిపికి మారారు. ఎస్సీలు, ముస్లింలు పోయిన ఎన్నికల్లో వైసిపికి బాగా మద్దతు ఇవ్వబట్టే అన్ని సీట్లొచ్చాయి. మరిపుడు చంద్రబాబు చేస్తున్న కార్యక్రమాలు, ఇస్తున్న హామీలతో ఎస్సీలు వైసిపిని కాదని వచ్చే ఎన్నికల్లో చంద్రబాబుకు మద్దతుగా నిలుస్తారా లేదా అన్నది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారిపోయింది.