ఒకే రోజు రాష్ట్రంలో లక్షలాది మంది ఇళ్ళల్లో గృహప్రవేశం చేయనున్నారు. పేద ప్రజలకు ప్రభుత్వం నిర్మించిన 3 లక్షల ఇళ్ళల్లో నిరుపేదలు గృహప్రవేశం చేయబోతున్నారు. ఒక విధంగా చెప్పాలంటే రాష్ట్ర చరిత్రలో ఈరోజు చిరస్ధాయిగా నిలిచిపోయే రోజు. ఇన్నేసి లక్షల ఇళ్ళల్లో గతంలో ఎప్పుడూ ఒకేసారి గృహప్రవేశాలు జరగలేదు. త్వరలో ఎన్నికలు జరగబోతున్నాయి కదా ? దాన్ని దృష్టిలో పెట్టుకునే ప్రభుత్వం అట్టహాసంగా కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. పేదలకు ఇళ్ళు నిర్మించటమన్నది ఇదే మొదలు కాదు. దశాబ్దాల తరబడి ఈ సంక్షేమ కార్యక్రమం జరుగుతూనే ఉంది. కానీ ఇక్కడున్నది చంద్రబాబునాయుడు కదా ? అందులోనూ ఎన్నికల సంవత్సరం. అందుకే ఈ కార్యక్రమం ఏదో తానే మొదలుపెట్టినట్టినంత ఆర్భాటంగా చేస్తున్నారు.
ఇవి జిల్లాల లెక్కలు
రాష్ట్రంలోని 174 నియోజకవర్గాల్లోని 664 మండలాల్లో 12,767 పంచాయితీలు, 110 మునిసిపాలిటీల్లోని 2093 వార్డుల్లో 3 లక్షల ఇళ్ళకు గురువారం సామూహిక గృహప్రవేశాలకు అధికారులు అన్నీ ఏర్పాట్లు చేశారు. ఇందులో తూర్పు గోదావరి జిల్లాలో 37, 207 ఇళ్ళు, కర్నూలు జిల్లాలో 30,545, విశాఖపట్నంలో 29, 625, పశ్చిమగోదావరిలో 27, 710, గుంటూరులో 24,767, చిత్తూరులో 20, 888, అనంతపురంలో 24, 422, కృష్ణాలో 20, 109, ప్రకాశంలో 19, 655, నెల్లూరులో 19,047, విజయనగరంలో 16, 645, శ్రీకాకుళంలో 19, 792, కడపలో 15, 891 ఇళ్ళను ప్రభుత్వం నిర్మించింది. గతంలో గాంధి జయంతికి ఒకేసారి లక్ష ఇళ్ళు నిర్మించి లబ్దిదారులకు అందచేశారు. కానీ ఇపుడు 3 లక్షల ఇళ్ళు నిర్మించి గృహప్రవేశానికి సిద్దం చేయటం గొప్ప విషయమనే చెప్పాలి.
ఎన్నికల సంవత్సరం కదా ?
రాజకీయ పార్టీలు ఏమి చేసినా లాభం లేనిదే చేయవన్న విషయం అందరికీ తెలిసిందే. అందులోనూ ఎన్నికలు ముంచుకొస్తున్న నేపధ్యంలో ఒకేసారి లక్షల ఇళ్ళను లబ్దిదారులకు అందచేయటమంటే కచ్చితంగా అంతా ఎన్నికల్లో లబ్దిపొందటానికనటంలో సందేహం లేదు. జరిగే కార్యక్రమం ప్రభుత్వ కార్యక్రమమే అయినా లబ్ది మొత్తం టిడిపి ఖాతాలో పడేందుకు చంద్రబాబునాయుడు అన్నీ జాగ్రత్తలూ తీసుకున్నారు. కాకపోతే లబ్దిదారుల్లో ఎంతమంది వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశానికే ఓట్లేస్తారన్నదే ప్రశ్న ?