సుప్రీంకోర్టుకు కేంద్రం సమర్పించిన అఫిడవిట్ పై ఏపీ సర్కార్ ఫుల్ ఫైర్ లో ఉంది. విభజన హామీలన్నీ అమలు చేశామంటూ సుప్రీంకోర్టుకు నేరుగా విన్నవించడంపై తీవ్ర ఆగ్రహంతో ఉంది. సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధంగా, రాష్ట్ర హక్కులు కాలరాసేలా కేంద్రం వ్యవహరిస్తోందని మండిపడుతోంది. ఇక కేంద్రంతో తాడోపేడో తేల్చుకోవాలనుకుంటోంది.
కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య వివాదం తారస్థాయికి చేరింది. ఇప్పటికే విభజన హామీలు, ప్రత్యేక హాదా, రైల్వే జోన్ విషయంలో కేంద్రం తీరుపై రాష్ట్ర ప్రభుత్వం మండిపడుతోంది. తాజాగా కేంద్ర ప్రభుత్వం... సుప్రీంకోర్టుకు సమర్పించిన అఫిడవిట్ పై సీఎం చంద్రబాబు సీరియస్ గా ఉన్నారు. విభజన హామీల విషయంలో తెలంగాణ కాంగ్రెస్ నేత పొంగులేటి సుధాకర్ రెడ్డి సుప్రీంకోర్టులో పిటీషన్ వేశారు. దీనికి ప్రతిగా కేంద్ర ఆర్ధికశాఖ కార్యదర్శి దీపేంద్ర కుమార్ గత నెల 29న సుప్రీంకోర్టులో కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేశారు. ఈ అఫిడవిట్ లో పేర్కొన్న అంశాలు ఇప్పుడు తాజాగా వివాదానికి దారి తీసాయి. ఏపీకి ప్రత్యేక హాదా ఇచ్చే అవకాశమే లేదని అఫిడవిట్ లో కేంద్రం పేర్కొంది.
కేంద్రం అఫిడవిట్ పై సీరియస్ గా రియాక్ట్ అవ్వాలనుకుంటోంది ఏపీ ప్రభుత్వం. దీనిపై ఇప్పటికే పలువురు మంత్రులతో చంద్రబాబు చర్చలు జరిపారుయ న్యాయనిపుణులతో కూడా చర్చిస్తున్నట్టు సమాచారం. ముఖ్యంగా రాష్ట్రానికి రెవెన్యూ లోటు కేవలం 4వేల కోట్లు మాత్రమే అని ఇప్పటి వరకూ 3వేల 900 కోట్ల రూపాయలు ఇచ్చేశామని చెప్పడం దారుణమని చంద్రబాబు పేర్కొంటున్నారు. కేంద్రం దాఖలు చేసిన అఫిడవిట్ అత్యంత ప్రమాదకరంగా ఉందని మంత్రి కాల్వ శ్రీనివాసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
వెనుకబడిన జిల్లాల అభివృద్దికి మరో 15 వందల కోట్లు మాత్రమే ఇస్తామని కేంద్రం అనడంపై ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. రాష్ట్ర ప్రజలను కేంద్రం అవమానిస్తోందని మంత్రి పితాని అన్నారు. వైసీపీ, రాష్ట్ర బీజేపీ నాయకులు కూడా అఫిడవిట్ పై స్పందించాల్సిన అవసరం ఉందన్నారు. రాజధాని అమరావతి నిర్మాణానికి ఇప్పటివరకూ రెండున్నర వేల కోట్లు ఇచ్చామని.. ఇంకా వెయ్యి కోట్లు ఇస్తామని అఫిడవిట్ లో పేర్కొంది కేంద్రం. అయితే ఇప్పటివరకూ కేవలం 1500 కోట్లు మాత్రమే ఇచ్చిందని... డీపీఆర్ ప్రకారం పరిపాలన నగరానికి 11 వేల కోట్లు అవసరమన్నారు మంత్రి నారాయణ. ఒక విగ్రహానికి ఇచ్చిన నిధులతో రాజధాని నిర్మాణం ఎలా సాధ్యం అని నారాయణ ప్రశ్నించారు.
కేంద్రం ఇచ్చిన అఫిడవిట్ పై శుక్రవారం జరిగే కేబినెట్ లో చర్చించాక భవిష్యత్ కార్యాచరణ రూపొందించాలని సీఎం నిర్ణయించారు. కేబినెట్ సమావేశం తర్వాత కేంద్రంపై పోరు కొత్త రూపు దాల్చే అవకాశం కనిపిస్తోంది. అది రూపంలో ఉంటుందనేదే ఇప్పుడు ఆసక్తి కలిగిస్తున్న అంశం.