డిల్లీ కేంద్ర పాలిత ప్రాంతం కంటే ఎక్కువ - రాష్ట్ర ప్రభుత్వాని కంటే తక్కువ. ఏ కేంద్ర పాలిత ప్రాంతానికి లేని ప్రత్యేకత డిల్లీకి ఉంది. ఆ అవకాశం 239ఏఏ ఆర్టికిల్ ద్వారా సంక్రమించింది. చూడటానికి ఇది డిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ కు ఏ ఇతర కేంద్ర పాలిత ప్రాంత లెఫ్టినెంట్ గవర్నర్ కు లేని ప్రత్యేకతలు ఇచ్చి చట్టప్రకారం ప్రభుత్వం కంటే ఆధిపత్యం లభింపజేసింది.
డిల్లీ రాష్ట్రప్రభుత్వం సలహా మేరకు లెఫ్టినెంట్ గవర్నర్ పనిచేయాలని సుప్రీంకోర్టు విస్తృత ధర్మాసనం సూచించింది. ఢిల్లీ పరిపాలన అధికారాలపై ఆప్ ప్రభుత్వం పలు పిటిషన్లను కోర్టులో దాఖలు చేసింది. దీనిపై బుధవారం నాడు విస్తృత ధర్మాసనం తీర్పును వెలువరించింది. ప్రధాన న్యాయమూర్తి దీపక్ మిశ్రా నేతృత్వంలోని ఐదుగురు న్యాయమూర్తుల ధర్మా సనం ఈ మేరకు తీర్పును వెలువరించింది.
ఢిల్లీకి పూర్తి రాష్ట్రస్థాయిహోదా ఇవ్వడం కుదరదని సుప్రీం తేల్చి చెప్పేసింది. లెఫ్టినెంట్ గవర్నర్ స్వతంత్రనిర్ణయాలు తీసుకోకూడదని స్పష్టంచేసింది. రాజ్యాంగాన్ని పరిరక్షించేందుకు సీఎం, లెఫ్టినెంట్ గవర్నర్ లు సంయుక్తంగా పని చేయాల్సి ఉందన్నారు.
ఢిల్లీ ప్రభుత్వం నిర్ణయాలు లెఫ్టినెంట్ గవర్నర్ ఆమోదం పొందాల్సిన అవసరం లేదని విస్తృత ధర్మాసనం అభిప్రాయ పడింది. లెఫ్టినెంట్ గవర్నర్ కు ఈ విధానాలపై ఢిల్లీ ప్రభుత్వం సమాచారం ఇస్తే సరిపోతోందని సుప్రీంకోర్టు అభిప్రాయ పడింది.
ఏ కేంద్ర పాలిత ప్రాంతానికి లేని ప్రత్యేకత డిల్లీకి ఇవ్వటం వలన ఇది కేంద్రపాలిత ప్రాంతం కంటే ఎక్కువ - రాష్ట్ర ప్రభుత్వానికి తక్కువ అయింది. దీని ద్వారా డిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వ్యవస్థ నాడు కాంగ్రెస్ పాలనలోను నేడు బిజెపి పాలనలోను ఆధిపత్యం చెలాయించేది.
అయితే కాంగ్రెస్ పాలనాకాలంలో కేంద్రంలోను, డిల్లీ కేంద్రపాలిత ప్రాంతంలోను కాంగ్రెసే అధికారంలో ఉండటం - డిల్లీకి షీలాదీక్షిత్ లాంటి అత్యంత సీనియర్ కాంగ్రెస్ నాయకురాలు ముఖ్యమంత్రిగా ఉండటంతో మద్యేమార్గంగా పాలన నడిచింది. కాంగ్రేస్ కాలంలో డిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్లు కూడా కాంగ్రెస్ పక్షపాతులు కావటంతో అంతా సజావుగా జరిగింది. ఎవరూ స్మూత్ ఫంక్షనింగ్ కు దూరంలో ఉండలేకపోయారు.
అంతేకాదు షీలా కాంగ్రెస్ అధినేత్రికి ప్రాణసఖి. ఏ లెఫ్టినెంట్ గవర్నర్ కూడా ఆమె అధికారాన్ని- తమకు చట్టం ద్వారా అధికారం సంక్రమించినా ఆమెను ధిక్కరించే సాహసం చేసేవారు కాదు. అందుకే అప్పుడు సమస్యలు ఉత్పన్నం కాలేదు.
ఇప్పుడు తీరు మారింది. ఆం ఆద్మీ పార్టీ - డిల్లీలో అధికారం లోకి రాగా, దాని అధినేత అరవింద్ కేజ్రీవాల్ లాంటి కొరకరాని కొయ్య, బిజెపి వ్యతిరేఖి ముఖ్యమంత్రి కావటం, అలాగే కేంద్రంలో అరవింద్ అంటే చచ్చినాపడని నరెంద్రమోడీ ప్రధాని కావటంతో హోరాహోరీ పోరు జరుగుతూ వస్తుంది.
2016లో ఇచ్చిన సుప్రీం తీర్పు ప్రకారం లెఫ్టినెంట్ గవర్నర్ అధికారాలు వెలగబెట్టారు. మంత్రులు జీ-హుజూర్ అంటూ పాలనాధికారులైన ఐయేఎస్ బాబుల ముందు వంగివంగి సలాం చేస్తూ బ్రతకవలసి వచ్చింది.
అందుకే లెఫ్టినెంట్ గవర్నర్ అధికారాలను పునఃనిర్వచించి — ఏదేమైనా ప్రజలెన్నుకున్న ప్రభుత్వానికే ప్రజాస్వామ్యంలో అధికారమని సుప్రీం స్పష్టం చేయటంతో ఇప్పటివరకు అధికారం చలాయించిన లెఫ్టినెంట్ గవర్నర్ ఇప్పుడు ప్రభుత్వం ఆఙ్జానువర్తులై ప్రవర్తించాల్సిందే. అలాగే అటు రాష్ట్రపతి ఆదేశాలను సైతం మన్నిస్తూ సమన్వయం చేసుకొని పాలన సాగించాల్సిందే.
అయితే దీనిని మరల కేంద్రంగాని, లెఫ్టినెంట్ గవర్నర్ గాని సుప్రీం ధర్మాసనం తీర్పుపై మరల తీర్పులోని అభిప్రాయ పడటం అనేదానిపై ప్రశ్నిస్తూ 239 AA ని పునఃనిర్వచినమని కోరవచ్చు. ఎంతైనా ఇది న్యాయ వ్యవస్థకు పెద్ద పితలాటకమే అవుతుంది. ఐతే విస్తృత ధర్మాసనం అభిప్రాయపడటమే గాని, చట్టం చెప్పిందే ఎప్పటికీ కరక్ట్. అందుకే ఇది ఎప్పుడూ రావణాసుర కాష్టమే, డిల్లీని రాష్ట్రం చేస్తూ చట్టం వచ్చెంతవరకు.