రాష్ట్ర విభజన హామీల అమలులో కేంద్రప్రభుత్వం ఏపికి కొత్తగా చేసిన ద్రోహమేదీ లేదు. నాలుగేళ్ళుగా చేస్తున్న ద్రద్రోహాన్నే తాజాగా కోర్టుకు అఫిడవిట్ రూపంలో స్పష్టం చేసిందంతే. కేంద్రానికి విశాఖపట్నం ప్రత్యేక రైల్వేజోన్ ఇచ్చే ఉద్దేశ్యం లేదని చిన్న పిల్లాడిని అడిగినా చెప్పేస్తాడు. అదే విధంగా రెవిన్యూలోటు, రాజధాని నిర్మాణం, కడ స్టీల్ ఫ్యాక్టరీ ఏర్పాటు లాంటివి ఏవి కూడా ఇచ్చే ఉద్దేశ్యంలో కేంద్రం లేదు. ఇస్తానని ఏనాడూ చెప్పలేదు కూడా. ఇక పోలవరం నిర్మాణ వ్యయం విషయంలో 2014కు ముందు ప్రాజెక్టుపై పెట్టిన ఖర్చు ఇచ్చేది లేదని కేంద్రమంత్రి అరుణ్్ జైట్లీ ఏనాడో స్పష్టంగా ప్రకటించిన సంగతి అందరికీ గుర్తుండే ఉంటుంది.
చంద్రబాబు డ్రామాలే కొత్త
మరి పై విషయాలపై కేంద్రం అఫిడవిట్ దాఖలు చేసిన తర్వాతే చంద్రబాబునాయుడు ఎందుకంతలా గొంతు చించుకుంటున్నారు ? అంటే ఇదే కొత్తగా ఉంది. పై అంశాలన్నీ నాలుగేళ్ళుగా రాష్ట్రంలోని ప్రతీ ఒక్కరికీ తెలిసనవే. కాకపోతే చంద్రబాబే కొత్త డ్రామాలు మొదలుపెట్టారు. కేంద్రం వైఖరేంటో కోర్టులో అఫిడవిట్ దాఖలు చేసిన తర్వాత స్పష్టమైనట్లు చంద్రబాబు ఆరోపణలు చేయటం విచిత్రంగా ఉంది. ఈ విషయాలు ఎన్డీఏలో నుండి బయటకు వచ్చేసిన తర్వాతే తనకు తెలిసినట్లు చంద్రబాబు మాట్లాడుతున్నారు.
నాలుగేళ్ళు చంద్రబాబేం చేశారు ?
కేంద్రం ఇపుడు అఫిడవిట్ రూపంలో చెప్పిన విషయాల్లో ఏ ఒక్కదానిపైన కూడా చంద్రబాబు నాలుగేళ్ళల్లో ఏనాడు కేంద్రాన్ని నిలదీసింది లేదు. మరి ఇపుడే ఎందుకంత గొంతుచించుకుంటున్నారంటే రానున్న ఎన్నికలను దృష్టిలో పెట్టుకునే అన్నది స్పష్టం. నాలుగేళ్ళపాటు బిజెపితో అంతకాగిన చంద్రబాబుపై జనాల్లో వ్యతిరేకత వచ్చేసింది. ఆ విషయం చంద్రబాబుకు కూడా అర్ధమైంది. ఇంకా బిజెపితో కలుసుంటే వచ్చే ఎన్నికల్లో టిడిపికి జనాలు నామాలు పెట్టటం ఖాయమని తెలుసుకున్న తర్వాతే చంద్రబాబు ఎన్డీఏలో నుండి హటాత్తుగా బయటకు వచ్చేశారన్నది వాస్తవం.
చంద్రబాబు చేతగాని తనమే
ఎప్పుడైతే ఎన్డీఏలో నుండి బయటకు వచ్చేశారో అప్పటి నుండే జనాలకు బిజెపిని బూచిగా చూపటం మొదలుపెట్టారు. రాష్ట్రాభివృద్ధికి తాను కష్టపడుతుంటే కేంద్రం అడ్డుకుంటోందంటూ బిల్డపులు ఇస్తున్నారు. పనిలో పనిగా బిజెపితో పాటు వైసిపిని కూడా జనాల దృష్టిలొ దోషిగా నిలబెట్టేందుకు డ్రామాలు మొదలుపెట్టారు. నాలుగేళ్ళ తన చేతకానితనాన్ని బిజెపి, వైసిపిలపైకి నెడుతున్నది స్పష్టంగా తెలిసిపోతోంది. జనాలేమీ అమాయకులు కారు. ఏపి ప్రయోజనాల విషయంలో బిజెపి కూడా ద్రోహం చేసిందన్నది వాస్తవం. వచ్చే ఎన్నికల్లో జనాల తీర్పు ఏ విధంగా ఉండబోతోందన్నదే సస్పెన్స్.