నిరుద్యోగులతో చంద్రబాబునాయుడు ప్రభుత్వం చెలగాటమాడుతోంది. ఈరోజు ప్రకటించాల్సిన డిఎస్సీ నోటిఫికేషన్ వాయిదా పడింది. ఈ విషయాన్ని విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు చల్లగా ప్రకటించారు. ఆర్ధికశాఖ నుండి కొర్రీలు రావటం వల్లే చివరిక్షణంలో నోటిఫికేషన్ వాయిదా వేసినట్లు గంటా చెప్పటం గమనార్హం. ఈరోజు వాయిదా పడిన నోటిఫికేషన్ ఇప్పటికే రెండుసార్లు వాయిదాపడింది. అంటే ఇపుడు మూడోసారన్నమాట వాయిదా పడటం.
చివరినిముషంలో వాయిదా
10, 351 పోస్టులతో నోటిఫికేషన్ ఇస్తామంటూ ప్రభుత్వం కొద్ది రోజులుగా ప్రకటిస్తోంది. దాంతో నిరుద్యోగుల్లో ఉద్యాగాలపై ఆశలు మొదలయ్యాయి. ఎన్నికల సంవత్సరం కదా వీలైనంత తొందరలో ఉద్యోగాల భర్తీ చేస్తారని అందరూ అనుకున్నారు. తీరా చూస్తే ప్రభుత్వం నిర్లక్ష్యం బయటపడింది. రెండుసార్లు వేసిన కొర్రీలనే ఆర్దికశాఖ తాజాగా వేసినట్లు సమాచారం. అందుకనే నోటిఫికేషన్ వాయిదా వేస్తున్నట్లు గంటా కూడా చెప్పారు. అంటే నోటిఫికేషన్ ప్రకటన ఇవ్వాలనుకున్నపుడు అన్నీ శాఖల నుండి అవసరమైన అనుమతులు తీసుకోవాలన్న కనీస జ్ఞానం కూడా లేకపోయింది.
ఆర్దికశాఖ కొర్రీలట
ఆర్ధికశాఖ వేసిన కొర్రీలతో పాటు మరికొన్ని సాంకేతిక సమస్యలు కూడా ఎదురయ్యాయట. అందుకనే హటాత్తుగా నోటిఫికేషన్ వాయిదా పడింది. మరి కొర్రీలన్నింటినీ క్లియర్ చేసి నోటిఫికేషన్ ఎప్పుడిచ్చేది స్పష్టంగా మంత్రి చెప్పలేదు. టెట్ కమ్ టిఆర్టి అమలు చేసే విషయాన్ని పరిశీలిస్తున్నట్లు మంత్రి చెప్పారు. మొత్తం మీద నోటిఫికేషన్ ప్రకటన వాయిదాలో గంటాతో పాటు ఉన్నతాధికారుల నిర్లక్ష్యం స్పష్టంగా కనబడుతోంది.