రాష్ట్రంలో 9%గా ఉన్న మైనార్టీలను మచ్చిక చేసుకునేందుకు ఏపీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు తనదైన శైలిలో పావులు కదుపుతున్నారు. మరో పదిమాసాల్లోనే అసెంబ్లీ, సార్వత్రిక ఎన్నికలు ఉన్న నేపథ్యంలో చంద్రబాబు వ్యూహాత్మకంగా మైనార్టీలను తనవైపు తిప్పుకొనేందుకు యత్నాలు ప్రారంభించారు. ఎన్నికలు ఒకవేళ ముందస్తుగా వచ్చినా వాటిని సైతం ఎదుర్కొనేలా ఆయన పక్కా వ్యూహంతో ముందుకు సాగు తున్నారు. బీజేపీతో టీడీపీ రెండుసార్లు పొత్తు పెట్టుకుని... రెండు సార్లు బ్రేకప్ చెప్పేసింది. ఇప్పటి వరకు చూస్తే బీజేపీకి బాబు దగ్గరయ్యాక ఎదుర్కొన్న ప్రతి ఎన్నికల్లోనూ... ఇంకా చెప్పాలంటే ఇప్పటి వరకు ముస్లింలు చంద్రబాబును పెద్దగా నమ్మింది లేదు.
అయితే ఇప్పుడు ఏపీకి బీజేపీ ఇచ్చిన హామీలు అమలులో తీవ్ర అన్యాయం జరగడంతో ఎన్డీయే నుంచి టీడీపీ బయటకు వచ్చింది. ఇదెలా ఉన్నా వైసీపీ అధినేత జగన్ బీజేపీ, మోడీకి దగ్గరవుతున్నారన్న వార్తలో లేదా సంకేతాలో జనాల్లోకి ఎంతోకొంత వెళ్లాయి. దీంతో కొందరు మైనార్టీలు మాత్రం ఆలోచనలో పడ్డారు. ఈ క్రమంలోనే మైనార్టీలను వలలో వేసుకునేందుకు చంద్రబాబు తన వంతుగా తీవ్ర ప్రయత్నాలు ప్రారంభించారు. రాష్ట్రంలో ముస్లింలు భారీగా ఉన్న తొలి 20 నియోజకవర్గాల్లో టీడీపీ నాలుగు సీట్లు మాత్రమే గెలిచింది. ఓవరాల్గా ముస్లింలు కనీసం 10 వేల పైన ఉన్న నియోజకవర్గాల్లోనూ వైసీపీయే మెజార్టీ సీట్లు సాధించింది.
రాయలసీమలో మెజార్టీ నియోజకవర్గాల్లో ముస్లింలు ఉన్న నియోజకవర్గాల్లో టీడీపీ గత మూడు ఎన్నికల్లోనూ, కొన్ని చోట్ల వరుసగా నాలుగు ఎన్నికల్లోనూ ఓడిపోతూ వస్తోంది. దీంతో ఇప్పుడు చంద్రబాబు ముస్లింలను ఆకట్టుకునేందుకు ప్రత్యేకంగా పెద్ద ఆపరేషనే స్టార్ట్ చేశారు. ఇప్పటికే మైనార్టీలకు చంద్రన్న తోఫా పేరుతో రంజాన్ పండుగను పురస్కరించుకుని భారీ ఎత్తున నిత్యావసరాలను అందిస్తున్నారు. దుల్హన్ తదితర పథకాలతో ముస్లింల వివాహాలకు నిధులు అందిస్తున్నారు. అదేవిధంగా మక్కా యాత్రకు వెళ్లేవారికి కూడా ప్రభుత్వం సబ్సిడీ నిధులు అందిస్తోంది. ఇలా ముస్లిం వర్గాలను చంద్రబాబు అన్ని విధాలా ఆదుకుంటున్నారు.
అయితే, రాష్ట్ర మంత్రి వర్గంలో మైనార్టీ మంత్రి లేకపోవడం, మైనార్టీ మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయకపోవడం పెద్ద వెలితిగా మారింది. ముఖ్యంగా ముస్లింలకు మేం ఎంతో చేస్తున్నాం... అని చెప్పుకొంటున్న చంద్రబాబుకు ఈ వెలితి పట్టి పీడిస్తోంది. అదేసమయంలో విపక్ష నేత జగన్ .. ఇదే విషయంపై పదే పదే విమర్శించారు కూడా. అయితే, వాస్తవానికి 2014లో జరిగిన ఎన్నికల్లో టీడీపీ తరఫున పోటీ చేసిన ముస్లిం నాయకులు ఎవ్వరూ అసెంబ్లీకి ఎన్నిక కాలేదు. దీంతో టీడీపీలో ముస్లిం వర్గ ఎమ్మెల్యే ఎవరూ లేకుండా పోయారు. ఈ నేపథ్యంలో వైసీపీ తరఫున గెలిచిన విజయవాడపశ్చిమ ఎమ్మెల్యే జలీల్ ఖాన్ ను చంద్రబాబు పార్టీలోకి ఆహ్వానించారు. మంత్రి పదవిపై హామీ ఇవ్వడంతో జలీల్ ఏమీ ఆలోచించుకోకుండానే వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు.
గత ఏడాది ఏప్రిల్లో జరిగిన మంత్రి వర్గ విస్తరణలో ఆయన మైనార్టీ శాఖ మంత్రి పదవి ఖాయమనే ప్రచారం కూడా జరిగింది. అయితే, అనూహ్యంగా ఆయన బీకాంలో ఫిజిక్స్ చదివానంటూ ఓ మీడియా ఛానెల్ రిపోర్టర్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కనడంతో చంద్రబాబు ఆయనను పక్కన పెట్టారు. చాలా కాలం తర్వాత గుట్టు చప్పుడు కాకుండా.. మైనార్టీ కమిషన్ చైర్మన్గా నియమించారు. అయినప్పటికీ.. మైనార్టీ మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయలేదనే విమర్శలు తరచుగా వినిపిస్తున్నాయి. మరోపక్క,జగన్ .. రాష్ట్రంలోని మైనార్టీలందరూ తన వెంటే ఉన్నారని, వైఎస్ హయాంలో వారినిఅనేక విధాల మేళ్లు చేకూర్చారని ఆయన చెప్పుకొస్తున్నారు.
ఈ క్రమంలోనే చంద్రబాబు తాజాగా మైనార్టీ వర్గాలు గుండుగుత్తుగా తన చెంతకు చేరేందుకు ఉన్న ఏకైక మార్గం మైనార్టీ మంత్రిత్వ శాఖనుఏర్పాటు చేయడమేనని నిర్ణయించుకున్నారు. ఈ నేపథ్యంలోనే త్వరలోనే విస్తరించాలని భావిస్తున్న మంత్రి వర్గంలో ప్రత్యేకంగా మైనార్టీ శాఖను ఏర్పాటు చేసిన తన పార్టీకే చెందిన మైనార్టీ ఎమ్మెల్సీని మంత్రిని చేయాలని నిర్ణయించుకున్నట్టు తాజాగా అమరావతి వర్గాలు చెబుతున్నాయి. సో.. చంద్రబాబు మైనార్టీలకు ఇలా గేలం వేస్తున్నారన్న మాట. మరి ఇది ఎంతమేరకు వర్కవుట్ అవుతుందో చూడాలి.