తెలుగుదేశంపార్టీ వాదన విచిత్రంగా ఉంటుంది. కిందపడ్డా పై చేయి తనదే అనే అడ్డుగోలు వాదన వినిపించటంలో టిడిపికి మించిన పార్టీ మరోటి లేదనే చెప్పవచ్చు. అదే సమయంలో తమకు నచ్చిన వారిని ఆకాశానికెత్తేయటం, లేకపోతే బురద చల్లటంలో టిడిపిది అందెవేసిన చెయ్యే. కేంద్రప్రభుత్వం విషయంలో ఇపుడు జరుగుతున్నదదే. లోక్ సభ, అసెంబ్లీలకు ఒకేసారి ఎన్నికలనే ప్రచారం జరుగుతున్న విషయం అందిరికీ తెలిసిందే.
జమిలి ఎన్నికలపై వితండ వాదన
జమిలి ఎన్నికలపై ప్రధానమంత్రి నరేంద్రమోడి దృష్టి పెట్టారని ప్రచారం జరుగుతోంది. అదే విషయమై ఆమధ్య చంద్రబాబునాయుడు కూడా పూర్తి మద్దతు తెలిపారు. అనేక వేదికలపై చంద్రబాబు మాట్లాడుతూ, జమిలి ఎన్నికల వల్ల ఖర్చులు, టైం కలిసి వస్తుందని ఒకటే ఊదరగొట్టిన విషయం అందరికీ గుర్తుండే ఉంటుంది. అటువంటిది తాజాగా ఆర్ధికశాఖ మంత్రి యనమల రామకృష్ణుడు మాట్లాడుతూ, ప్రాంతీయ పార్టీలను బలహీనపరిచేందుకే బిజెపి జమిలి ఎన్నికలను తెరపైకి తెస్తోందంటూ ఆరోపిస్తున్నారు. చాలా రాష్ట్రాల్లో బలంగా ఉన్న ప్రాంతీయ పార్టీలను బలహీనపరిచేందుకే బిజెపి ప్లాన్ వేస్తోందట.
జిఎస్టీపై ఎదురుదాడి
సొంత బలంతో కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేసేంత సీన్ ఏ పార్టీకి లేదని కూడా యనమల చెప్పారు. 15వ ఆర్దికసంఘం మార్గదర్శకాలు రాష్ట్రాల ఆర్దిక స్వయంప్రతిపత్తికి ప్రమాదకరంగా మారిందంటూ యనమల మండిపడ్డారు. రాష్ట్రాలను బలహీనపరిచేందుకు జిఎస్టీని వాడుకుంటున్నట్లు కూడా యనమల చెప్పటం విచిత్రంగా ఉంది.
నచ్చకపోతే బురదచల్లేయటమేనా ?
ఎందుకంటే, ఎన్డీఏలో టిడిపి కూడా ఉన్నంత కాలం జమిలి ఎన్నికలే దేశానికి మంచిదని చంద్రబాబు అండ్ కో ఊరూవాడా మైక్ పెట్టి అరిచి చెప్పేవారు. ఇపుడేమో ప్రాంతీయ పార్టీలను బలహీనపరిచేందుకే జమిలి ఎన్నికలంటున్నారు. అలాగే, జిఎస్టీ బిల్లును ఆమోదించటం కోసం అప్పట్లో ప్రత్యేకించి అసెంబ్లీ సమావేశాలు పెట్టి మరీ ఆమోదించుకున్నారు. ఇపుడేమో రాష్ట్రాల ఆర్దిక పరిస్దితిని బలహీనపరిచేందుకే జిఎస్టీని కేంద్రం తెచ్చిందంటున్నారు. యనమల ఇపుడు చెబుతున్నదే నిజమైతే మరి అప్పట్లో ఎందుకు జమిలి ఎన్నికలకు, జిఎస్టీకి మద్దతు పలికినట్లు ?