అమెరికాలో భారతీయులపై కొంత కాలంగా వివక్ష కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే పలువురు తెలుగు వారిపై దాడులు, హత్యలు కొనసాగిస్తున్నారు. తాజాగా అమెరికాలో దుండగులు జరిపిన కాల్పుల్లో తెలంగాణకు చెందిన ఓ విద్యార్థి మృతి చెందాడు. కన్సాస్ నగరంలోని ఓ రెస్టారెంట్లో స్థానిక కాలమానం ప్రకారం శుక్రవారం (జులై 6) సాయంత్రం 7 గంటల ప్రాంతంలో ఈ ఘటన జరిగింది.వరంగల్ నగరంలోని కొత్తవాడ వాసవీ కాలనీకి చెందిన శరత్ కొప్పు ఉన్నత విద్యాభ్యాసం కోసం అమెరికా వెళ్లాడు. అక్కడి మిస్సోరి యూనివర్సిటిలో చదువుతున్నాడు. ప్రస్తుతం శరత్ సిటీలో 5303 చార్లొట్టె స్ట్రీట్ అపార్ట్మెంట్లో నివసిస్తున్నాడు.
కాగా, శుక్రవారం సాయంత్రం కన్సాస్లోని స్థానిక రెస్టారెంట్లో శరత్పై దుండగులు కాల్పులు జరిపారు.సమాచారం అందుకున్న కన్సాస్ పోలీసులు ఘటనాస్థలికి చేరుకొని రక్తపు మడుగులో పడి ఉన్న శరత్ను హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. అయితే.. అతడు అప్పటికే మృతి చెందాడని వైద్యులు ధ్రువీకరించారు. కేసు నమోదు చేసుకొని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అయితే శరత్ పై కాల్పలు జరిపిన విషయం అతడి స్నేహితులు తల్లిదండ్రులకు తెలియజేశారు.
కుమారుడి సమాచారంపై వారు డీజీపీ మహేందర్ రెడ్డిని కలిశారు. ఐటీ శాఖ మంత్రి కేటీ రామారావును కలిసి విషయాన్ని కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి సుష్మా స్వరాజ్ దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. శరత్ తండ్రి హైదరాబాద్లో బీఎస్ఎన్ఎల్ సంస్థలో ఉద్యోగం చేస్తున్నారు. తమ కుమారుడికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియకపోవడంతో ఆ తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు