రాజధాని ప్రాంతమైన బెజవాడలో ఎంపీ టికెట్ కోసం అధికార పార్టీలో కీలక నేతలు పోటీ పడుతున్నారు. ఇక్కడి తూర్పు నియోజకవర్గం నుంచి అసెంబ్లీకి ప్రాతినిధ్యం వహిస్తున్న గద్దె రామ్మోహన్రావు తాజాగా ఎంపీ టికెట్ను ఆశిస్తున్నట్టు సమాచారం. పార్టీ పరంగా, ప్రజల పరంగా కూడా మంచి పలుకుబడి, ప్రజాభిమానం భారీ రేంజ్లో ఉన్న గద్దె.. వచ్చే ఎన్నికల్లో విజయవాడ ఎంపీగా వెళ్లాలని భావిస్తున్నట్టు గత కొన్నాళ్లుగా వార్తలు వస్తున్నాయి. ప్రధానంగా ఇక్కడి తూర్పు నియోజకవర్గంలో తనకు పోటీగా విజయవాడ నగరపాలక సంస్థ మేయర్ కోనేరు శ్రీధర్ పావులు కదుపుతుండడం, కొన్ని అభివృద్ధి పనుల్లో తనకు స్వతంత్రత కరువుకావడం వంటి నేపథ్యంలో గద్దె.. ఇకవచ్చే ఎన్నికల్లో తాను ఇక్కడ ఎమ్మెల్యేగా ఉండి లాభం లేదని నిర్ణయించుకున్నారు.
ఈ నేపథ్యంలోనే గద్దె విజయవాడ ఎంపీ టికెట్ను ఆశిస్తున్నారని సమాచారం. ఇదిలావుంటే, ఇక్కడ సిట్టింగ్ ఎంపీ కేశినేని శ్రీనివాస్ ఉరఫ్ నాని కూడా తిరిగి టికెట్ సాధించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని తెలుస్తోంది.ముక్కుసూటి తత్వంతో ఇప్పటికే వ్యాపారపరంగా తీవ్ర కష్టాలు ఎదుర్కొంటున్న ఆయన... వాస్తవానికి వచ్చే ఎన్నికల్లో పోటీ కి దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నాడు. కానీ, అనుచరుల సూచనలతో తన నిర్ణయాన్ని మార్చుకున్నాడు. వచ్చే ఎన్నికల్లో ఇక్కడ నుంచే బరిలోకి దిగాలని నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది.
పార్టీ అధిష్టానం వద్ద కూడానానిపై పెద్దగా వ్యతిరేకత అంటూ ఏమీ లేకపోవడం గమనార్హం. నిజానికి ముక్కు సూటితనం కారణంగా కొన్ని అంశాల్లో వివాదాస్పదమైనా అభివృద్ధి కార్యక్రమాల పరంగా.. ప్రజలకు అందుబాటులో ఉండటంలోనూ నాని ముందంజలో ఉన్నారు. విజయవాడలో కీలకమైన బెంజి సర్కిల్ ఫ్లైవోర్, దుర్గగుడి ఫ్లైవోర్, బెజవాడ రహదారుల విస్తరణ, గ్రీనరీ అభివృద్ధి, విజయవాడ విమానాశయ్రం ఆధునికీకరణ, వీటన్నింటికీ మించి విజయవాడ పార్లమెంటు పరిధిలో టాటా ట్రస్ట్ సేవలను నాని పూర్తిస్థాయిలో వినియో గించుకుంటున్నారు.
తన నియోజకవర్గంలోని ఎమ్మెల్యేలందరితో సఖ్యతగా ఉండటం, పార్టీ నేతలను సమన్వయం చేసుకుని కార్యక్రమాలు నిర్వహించడం ఆయనకు కలిసొచ్చే అంశాలు. అయితే,పార్టీ అధిష్టానం వ్యూహం మరోలా ఉందని సమాచారం. ఇక్కడ నుంచి మంత్రి నారా లోకేష్ సతీమణి, హిందూపురం ఎమ్మెల్యే బాలయ్య కుమార్తె..నారా బ్రాహ్మణిని బరిలోకి దింపాలని చంద్రబాబు భావిస్తున్నట్టు సమాచారం. తద్వారా తన ఫ్యామిలీ నుంచేనేరుగా పార్లమెంటులో ప్రాతినిధ్యం ఉంటుందని,రాష్ట్ర సమస్యలపై చర్చించేందుకు అవకాశం ఉంటుందని బాబు భావిస్తున్నట్టు సమాచారం. దీంతో ఇక్కడ ఎంపీ టికెట్ హాట్ హాట్గా మారిపోయింది.