నెల్లూరు జిల్లా రాజకీయాలపై టీడీపీ అధినేత చంద్రబాబు దృష్టిసారించారు. ఎన్నికల సమయం దగ్గర పడుతున్న నేపథ్యంలో.. సీట్ల సర్దుబాటు లెక్కలను ఒక కొలిక్కి తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు. మార్పులు చేర్పులపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. కొందరు నేతలపై వ్యతిరేకత ఉండటంతో అభ్యర్థులను మార్చాలని భావిస్తున్నారు. మరికొందరు ఎంపీగా బరిలోకి దిగలేమని స్పష్టంచేయడంతో వారికి ఎమ్మెల్యే స్థానాలను అప్పగించే చర్యలు చేపట్టారు. ఈ మార్పులు చేర్పులు.. కొంతమంది సీనియర్లకు మింగుడు పడటం లేదనే చర్చ మొదలైంది. ముఖ్యంగా చంద్రబాబు చర్యలతో మంత్రి సోమిరెడ్డి ఇబ్బందులకు గురవుతున్నారని పార్టీ నేతలు చెబుతున్నారు. ఒక సమస్యకు పరిష్కారం వెతుకుంటే మరో కొత్త సమస్య పుట్టుకొస్తుండంతో అంతా అయోమయానికి గురవుతున్నారట.
నెల్లూరు ఎంపీగా ఈ సారి తాను పోటీచేసే ప్రసక్తే లేదని ఆదాల ప్రభాకరరెడ్డి.. పార్టీ అధినేత చంద్రబాబుకు తేల్చి చెప్పేశారు. నెల్లూరు ఎంపీగా గెలిచిన మేకపాటి.. హోదా ఉద్యమంలో భాగంగా వైసీపీ అధినేత జగన్ పిలుపుమేరకు పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే! దీంతో ప్రజల్లో కొంత పాజిటివ్ ప్రభావం ఆయనపై పడుతోంది. ఈ నేపథ్యంలో మరోసారి చేతులు కాల్చుకునేందుకు ఆదాల సిద్ధంగా లేరని పార్టీ నాయకులు, ఆయన సన్నిహితులు స్పష్టం చేస్తున్నారు. ఇదే విషయాన్ని ఆయన చంద్రబాబుకు చెప్పారట. ఈ విషయంలో తనను బలవంత పెట్టవద్దని, ఇప్పటికే ఆర్థికంగా దెబ్బతిన్నానని కుండ బద్దలు కొట్టేశారట. ఎమ్మెల్యేగా ఏ నియోజకవర్గం నుంచైనా పోటీ చేసేందు కు సిద్ధంగా ఉన్నానని చెప్పడంతో ఆయనను కొవ్వూరు అభ్యర్థిగా బరిలోకి దింపే ప్రయత్నాల్లో ఉన్నారట.
ప్రస్తుత ఎమ్మెల్యే పోలంరెడ్డి శ్రీనివాసరెడ్డిపై నియోజకవర్గంలో వ్యతిరేకత వ్యక్తం కావడంతో ఆయనను తప్పించి ఆదాలతో పోటీచేయించాలని నేతలు కూడా స్పష్టంచేశారట. `అభ్యర్థి ఎవరైనా గెలుపు ముఖ్యం వారు తనకు సన్నిహితులైనా, బంధువులైనా ఓడిపోయే వారికి ఎవరికీ పోటీ చేసే అవకాశం ఇవ్వను. ఆదాల కొవ్వూరులో గెలుస్తారనే నమ్మకం ఉంది. కానీ ఆయన మాత్రమే నెల్లూరు ఎంపీ అభ్యర్థి అయితే ధీటైన పోటీ ఇవ్వగలర`నే ఆలోచన బాబు జిల్లా పార్టీ నాయకుల వద్ద వ్యక్తం చేసినట్టు సమాచారం. ఇంతకు ముందు నల్లపురెడ్డి శ్రీనివాసరెడ్డి టీడీపీలోకి వచ్చేందుకు ప్రయత్నించినప్పుడు మంత్రులు సోమిరెడ్డి, నారాయణ ఆ విషయాన్నిచంద్రబాబు దృష్టికి తీసుకెళ్లలేదు. నియోజకవర్గం నుంచి ప్రసన్నకుమార్రెడ్డి కానీ.. ఆదాల కానీ విజయం సాధిస్తే.. తన మంత్రి పదవికి ఎసరు వస్తుందని సోమిరెడ్డికి తెలుసు. అందుకే ప్రసన్న టీడీపీ వైపు రాకుండా జాగ్రత్తలు తీసుకున్నారు.
తాజాగా ఇక్కడి నుంచి ఆదాల అసెంబ్లీకి పోటీ చేస్తానని చెబుతుండడంతో మంత్రి సోమిరెడ్డికి ఏం చేయాలో పాలుపోవడం లేదట. 2004లో ఆదాల సర్వేపల్లి నుంచి పోటీ చేసి గెలుపొందారు. అప్పుడు ఆదాలతో సన్నిహితంగా ఉన్న ప్రసన్న కేవలం 200 ఓట్ల తేడాతో ఓడిపోయారు. ఆ ఎన్నికల్లో ఎంపీ అభ్యర్థికి 25 వేల మెజార్టీ వచ్చిందని, తాను ఓడిపోవడానికి ఆదాలే కారణమని, ఆదాల టీడీపీలో ఉంటే తనతో పాటు మంత్రి సోమిరెడ్డి గెలిచేవారని అప్పట్లో ప్రసన్న బహిరంగంగానే వ్యాఖ్యానించారు.