ఏపీకి కీలకంగా మారిన విజయవాడలో తెలుగుదేశం పార్టీ నాయకుల మధ్య ఆధిపత్య పోరు పెరుగుతోంది. టికెట్ కోసం కొన్ని నియోజకవర్గాల్లో పార్టీ నాయకుల మధ్య తీవ్ర మనస్పర్థలు రావడం అధినేత, సీఎం చంద్రబాబుకు మింగుడు పడటం లేదు. టికెట్ సాధించేందుకు ఎవరికి వారు తమ ప్రయత్నాలు ముమ్మరం చేస్తూ.. సొంత పార్టీ నేతలకే ఎసరు పెడుతున్నారు. తన తండ్రి నెహ్రూ నియోజకవర్గంతో పాటు పక్కనున్న పెనమలూరు నియోజకవర్గంపై కన్నేసిన టీడీపీ తెలుగు యువత అధ్యక్షుడు దేవినేని అవినాష్ దూకుడు పార్టీ నేతల్లో టెన్షన్ పెరిగేలా చేస్తోంది. తన వర్గం వారితో పాటు ఎమ్మెల్యేల వ్యతిరేక వర్గాలను అక్కున చేర్చుకుంటూ తన బలం పెంచుకునేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. దీంతో ఎమ్మెల్యేలకు కంటి మీద కునుకు లేకుండా పోతోందట. కీలక నేత ఒకరు ఆయనకు అభయం ఇవ్వడంతోనే ఇలా చెలరేగిపోతున్నారనే చర్చ పార్టీలో జరుగుతోంది.
సుదీర్ఘ కాలం కాంగ్రెస్లో ఉన్న దేవినేని నెహ్రూ.. తనయుడు అవినాష్ రాజకీయ భవిష్యత్ కోసం టీడీపీలో చేరారు. తన కుమారుడి భవిష్యత్ను తీర్చిదిద్దే బాధ్యత చంద్రబాబుదేనని అప్పట్లోనే ప్రకటించారు. టీడీపీలో చేరిన కొన్నా ళ్లకే నెహ్రూ మృతి చెందారు. ఆ తర్వాత అవినాష్కు చంద్రబాబు తెలుగు యువత అధ్యక్షుడి బాధ్యతలు అప్పగించారు.ఎన్నికల సమయం దగ్గరపడుతున్న నేపథ్యంలో టికెట్పై ఎన్నో ఆశలు పెట్టుకున్నారట అవినాష్. తండ్రి ప్రాతినిధ్యం వహించిన విజయవాడ తూర్పు నుంచి టికెట్ ఆశిస్తున్నారట. ఒకవేళ అది కుదరని పక్షంలో పెనమలూరు నుంచైనా పోటీచేయాలనే పట్టుదలతో ఉన్నారు. అందుకే ఆయా నియోజకవర్గాలపై పూర్తిగా దృష్టిసారించారట.
తమకు అవినాష్ చెక్ చెప్పేందుకు ప్రయత్నిస్తుండటతో తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్, పెనమలూరు ఎమ్మెల్యే బోడే ప్రసాద్లో టెన్షన్ మొదలైందట
తన తండ్రి దేవినేని నెహ్రూ అండదండలను ఉపయోగించుకొని బెజవాడలో తన బలాన్ని పెంచుకోవాలన్న ఆలోచనలో అవినాష్ ఉన్నారట. దీని కోసం పెనుమలూరు నియోజకవర్గంలో పెద్ద ఎత్తున కార్యక్రమాల్ని నిర్వహిస్తు న్నారు. దీంతో బోడే వ్యతిరేక వర్గానికి అవినాష్ దగ్గరవుతున్నారు. బోడే ప్రసాద్ వైఖరి కూడా దేవినేనికి కలిసి వచ్చేలా మారింది.
దేవినేని నెహ్రూ వర్థంతికి బోడేను ఆహ్వానించినా ఆయన హాజరు కాలేదు. అవినాష్ వెళ్లిపోయిన తర్వాత అలా వచ్చి ఇలా వెళ్లిపోవటం మైనస్గా మారింది. తన తండ్రి వర్థంతి కార్యక్రమాల్ని పురస్కరించుకొని కంకిపాడు.. పెనమలూరు ప్రాంతాల్లో తన బలాన్ని పెంచుకునే దిశగా అవినాష్ ప్రయత్నిస్తున్నారు. తన బలాన్ని పెంచుకొని అవసరమైతే పెనమలూరు నియోజకవర్గం నుంచి పోటీ చేసేందుకు సైతం అవినాష్ రె`ఢీ` అంటున్నారు.
ఇదే సమయంలో విజయవాడ తూర్పు నియోజకవర్గంపైనా అవినాష్ దృష్టి సారించారు. ఒకరికొకరు చెక్ పెట్టేందుకు పోటాపోటీగా ప్రయత్నిస్తున్నారు. గద్దె వెంట ఉన్న వారిపై అవినాష్ ఆకర్షించే ప్రయత్నం చేస్తే.. ఆయన వర్గాన్ని గద్దె పూర్తిగా పక్కన పెడుతున్నారు. గద్దెను వ్యతిరేకించే వర్గంతో అవినాష్ వర్గీయులు సంప్రదింపులు జరుపుతున్నారు. గద్దె నియోజకవర్గానికి సంబంధించిన పలు అంశాలపై ఇప్పుడు చర్చ నిర్వహిస్తున్నారు. దీంతో గద్దె గుర్రుగా ఉన్నారు. ఇలా నేతల మధ్య నడుస్తున్న పోరుపై మంత్రి లోకేశ్ కు ఫిర్యాదు అందింది.