మరో పది మాసాల్లోనే ఎన్నికలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో రాజకీయాలు కీలక దశకు చేరుకున్నాయి. నేతలు తమ తమ ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు. ఇప్పటికే టికెట్ పై హామీ పొందిన వారు సైతం వచ్చేదాకా కూడా నమ్మకం లేని పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో రాజకీయాలు తాజాగా రసకందాయంలో పడ్డాయి. ఇక, ఇప్పుడు విజయనగరం జిల్లా టీడీపీ జెడ్పీ చైర్పర్సన్ శోభా స్వాతీ రాణి. త్వరలోనే జరగనున్న ఎన్నికల్లో టీడీపీ టికెట్ కోసం విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. వాస్తవానికి గత ఎన్నికల్లోనే ఆమె ఈ ప్రయత్నం చేసినా.. అనూహ్య కారణాల నేపథ్యంలో ఆమె కు టికెట్ లభించలేదు. ఈ క్రమంలోనే ఆమె జెడ్పీ చైర్పర్సన్ అయ్యారు. అయితే, వచ్చే ఎన్నికల్లో మాత్రం ఎట్టి పరిస్థితిలోనూ టికెట్ సంపాయించాలని.. ``అధ్యక్షా!`` అంటూ గళం వినిపించాలని ఆమె పట్టుదలతో ఉన్నారు.
శృంగవరపుకోట గిరిజన నియోజకవర్గంగా(ఎస్టీ) వున్న సమయంలో శాసన సభ్యురాలిగా ప్రాతినిధ్యం వహించిన శోభా హైమావతి రాజకీయ వారసురాలిగా రంగంలోకి దిగిన రాణి.. వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. ఈమెకు ఆమె భర్త గుల్లిపల్లి గణేష్ పూర్తి సహాయ సహకారాలు అందిస్తున్నారు. ఈయనకు స్థానికంగా బంధు గణం ఎక్కువగా ఉండడం, ప్రతి ఒక్కరూ కలిసి వస్తుండడం అనుకూలిస్తున్న అంశాలుగా ఉన్నాయి. అయితే, ఇక్కడ లెక్కకు మిక్కిలిగా టీడీపీ నాయకులు ఉండడంతో రాణి.,. తాజాగా మూడు నియోజకవర్గాలపై కన్నేశారు. ఏదో ఒక చోటైనా తనకు టికెట్ సంపాయించుకునే పరిస్థితిని ఆమె స్వయంగా వెళ్లి తెలుసుకుంటున్నారు. జెడ్పీ చైర్పర్సన్గా ఆమె ప్రజలకు చేరువయ్యారు. వారి సమస్య లు పరిష్కరిస్తున్నారు. ఎవరు ఏ సమయంలో వచ్చినా అందుబాటులోనే ఉంటున్నారు.
దీంతో ఇక్కడ స్వాతి రాణి పేరు బాగానే వినిపిస్తోంది. అయితే, నేతలు ఎక్కువగా ఉండడంతో ఆమె నియోజకవర్గాల విషయంలో చాలా జాగ్రత్త వహిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే చట్టసభల ప్రాతినిధ్యం కోసం విజయనగరం జిల్లాలోని సాలూరు, కురపాం శాసన సభ నియోజకవర్గాలను, విశాఖ జిల్లా అరకు లోక్ సభ స్థానాల్లో ఏదో ఒక నియోజకవర్గం నుంచి టిక్కెట్ పొందాలన్న ప్రయత్నంలో ఉన్నట్లు సమాచారం. ఈ మూడు నియోజకవర్గాలు గిరిజన సామాజిక వర్గానికి చెందినవే. అన్నిచోట్లా వైసీపీ ఎమ్మెల్యేలే గెలుపొందారు.
సాలూరు శాసన నియోజకవర్గంలో ఇప్పటికే బంజ్దేవ్, గుమ్మిడి సంధ్యారాణి మధ్య టిక్కెట్ కోసం పోరు నడుస్తోంది. స్వాతిరాణి ఎస్టీ అయినా ఆమె భర్త గుల్లిపల్లి గణేష్ సామాజిక వర్గం (కొప్పుల వెలమ) నేపథ్యంలో ఆయనకు ఉన్న భందుత్వాలు, పరిచ యాలు అత్యధికంగా ఇక్కడ వుండడంతో ఆమె ఈ నియోజకవర్గంపైనే దృష్టిపెట్టారు. ఒక వేళ చంద్రబాబు ఇక్కడ టికెట్ ఇచ్చేందుకు వెనుకంజ వేస్తే.. కురుపాం నియోజకవర్గం నుంచైనా టిక్కెట్ పొందాలన్న పట్టుదలతో ఉన్నట్లు సమాచారం. జెడ్పీచైర్ర్సన్గా ఆమె తక్కువ వయస్సులోనే విజయనగరం జిల్లా అభివృద్ధిలో తన వినూత్నమైన ఆలోచనలతో సక్సెస్ అవ్వడంతో పాటు జాతీయస్థాయిలో అవార్డులు అందుకుని చంద్రబాబు, లోకేష్తో పాటు రాష్ట్ర వ్యాప్తంగా అశోక్గజపతిరాజు లాంటి సీనియర్లతో కూడా ఆమె ప్రశంసలు అందుకున్నారు.
ఇక ఇదే క్రమంలో అరకు ఎంపీ సీటును ఈ సారి ఎలాగైనా గెలుచుకోవాలని టీడీపీ అధిష్టానం పట్టుదలతో ఉంది. నాలుగు జిల్లాల్లో విస్తరించి ఉన్న ఈ నియోజకవర్గంలో టీడీపీకి బలం ఉన్నా సరైన క్యాండెట్ లేక ఇబ్బందులు పడుతోంది. ఈ క్రమంలోనే ఇక్కడ ఆమె పేరు కూడా తెరమీదకు వస్తోంది. స్వాతిరాణి అయితే తన భగత కులంతో పాటు అటు భర్త గణేష్ బీసీ వర్గానికి చెందిన వ్యక్తి కావడంతో ఇక్కడ సులువుగా గెలుస్తుందన్న అంచనా కూడా ఉంది. పార్టీలో యువ నాయకురాలిగా అతి చిన్న వయస్సులోనే జెడ్పీచైర్పర్సన్గా ఆమె పనితీరు ఎలాంటి కాంట్రవర్సీలు లేకుండా అందరిని ఆకట్టుకుంది. దీంతో ఇప్పుడు అరకు ఎంపీ సీటు విషయంలో ప్రథమంగా ఆమె పార్టీ వర్గాల్లో తెరమీదకు వస్తోంది. అలాగే అటు సాలూరు, కురుపాం స్థానాలపై కూడా ఆమమె జెడ్పీచైర్పర్సన్గా పట్టు సాధించారు. దీంతో ఆమె ఈ మూడుస్తానాల్లో ఎక్కడ టికెట్ ఖరారైనా ఓకే అన్నట్టుగా పావులు కదుపుతున్నారు.