ఆంధ్రప్రదేశ్ ఎన్నికల రాజకీయ దృశ్యం ఇప్పుడిప్పుడే స్పష్టమవుతోంది. ఎన్నికలనాటికి ఇదే దృశ్యం కనబడుతుందా? మరోలా ఉంటుందా? అంటే… ఇప్పటికిప్పుడు సమాధానం చెప్పలేం. ఎందుకంటే రాజకీయాల్లో ఏ క్షణం ఏమైనా జరగవచ్చు. ఎన్నికల ప్రచారంలో తీవ్ర విమర్శలు చేసుకున్న కాంగ్రెస్-జేడీఎస్ లు ఇప్పుడు కలసి ప్రభుత్వం ఏర్పాటు చేశాయి. అలా ఏపీలో కూడా భవిష్యత్ లో ఏమైనా జరగవచ్చు. వచ్చేఏడాది సమయంలో జరిగే రాజకీయ పరిణామాల మీద, పార్టీల వ్యూహాల మీద అది ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు ఏపీని చూస్తే అన్ని పార్టీలూ ఒంటరి పోరుకు సిద్ధమవుతున్న తీరు కనబడుతోంది.
ఏపీ చరిత్రలో అనూహ్యమైన సంఘటన చోటు చేసుకోనుంది. ఇప్పటివరకు తెలుగు నేలపై కనీవినీ ఎరుగని రాజకీయానికి తెరలేవనుంది. ఏ ఎన్నికలు జరిగినా.. ఏదో ఒక పార్టీకి ప్రజలు పట్టం గడుతున్నారు. తమకు నచ్చిన నేతను, తమకు సేవ చేస్తుందని భావించిన పార్టీకి ఓటేస్తున్నారు. అయితే 2019 ఎన్నికలు మాత్రం ఏపీ సంప్రదాయాన్ని తిరిగి రాయనున్నాయా? అంటే ఔననే అంటున్నారు విశ్లేషకులు. ఇక్కడ ఏ పార్టీకీ పూర్తి స్థాయి మెజారిటీ వచ్చే అవకాశం కనిపించడం లేదని అంటున్నారు. రాష్ట్రంలో 2014 ఎన్నికల సమయంలో ఉన్న రాజకీయ వాతావరణం ఇప్పుడు కనిపించక పోవడం, లెక్కకు మిక్కిలి పార్టీలు ఎన్నికల్లో ఒంటరి పోరుకు సిద్ధపడడం వంటి కారణాలు ఏపీ ఎన్నికలను ప్రభావితం చేయనున్నాయి. 2014 ఎన్నికల సమయంలో ప్రధానంగా రెండు పార్టీల మధ్య ఎన్నికల పోరు సాగింది. ఈ క్రమంలోనే టీడీపీ అధినేత చంద్రబాబు తనకు మద్దతుగా అప్పటికే పార్టీని స్థాపించిన జనసేనాని పవన్ కళ్యాణ్ను తెచ్చుకున్నారు. జాతీయ పార్టీ బీజేపీతోనూ జట్టు కట్టారు. మరోపక్క, ఒంటరిగానే బరిలోకి దిగిన జగన్.. బాబుతో తలపడ్డారు. దీంతో అప్పటి ఎన్నికలు.. అయితే టీడీపీ.. లేకుంటే వైసీపీ.. అన్న విధంగానే సాగాయి. అయితే... రాష్ట్రంలో సరిగ్గా రెండు నెలల కిందట వరకూ ఉన్న పరిస్థితులు వేరు. ఇప్పటి లెక్కలు వేరు. ఎన్ని విభేదాలు, కష్టాలు ఉన్నా.. టీడీపీ, బీజేపీ, జనసేనలు కలసి వెళ్తాయని.. వారిని ఒంటి చేత్తో జగన్ ఎదుర్కోవాలని అందరూ భావించారు. కానీ వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. టీడీపీ, బీజేపీల పొత్తు పెటాకులయ్యింది. గతంలో టీడీపీకి బేషరుతుగా మద్దతిచ్చిన పవన్.. ఇప్పుడు పసుపు నేతలపై దుమ్మెత్తి పోస్తున్నారు.
టీడీపీకి జన సేనాధిపతి టాటా చెప్పిన వేళ… జనసేన-కమ్యూనిస్టు పార్టీలు పొత్తు పెట్టుకొని లేదా ఎన్నికల అవగాహన కుదర్చుకొని ఉమ్మడిగా పోటీ చేస్తాయని విశ్లేషకులు, రాజకీయ నేతలు భావించారు. ఎందుకంటే.. ప్రత్యేక హోదా కోసం జనసేన కమ్యూనిస్టు పార్టీలతో కలిసి కొన్ని ఆందోళన కార్యక్రమాలు చేసింది. పవన్ ఉభయ కమ్యూనిస్టు పార్టీల రాష్ట్ర కార్యదర్శులతో కలిసి ప్రెస్మీట్లు పెట్టారు. జనసేనతో పొత్తు పెట్టుకొని కొన్ని సీట్లు సాధించాలని కమ్యూనిస్టు పార్టీలు అనుకున్నాయి. పవన్ చాలాసార్లు కమ్యూనిస్టులపై తన అభిమానం చాటుకున్నారు. అయితే వారి పవన్ కళ్యాణ్ తన పార్టీ రాష్ట్రంలోని 175 అసెంబ్లీ సీట్లలో పోటీ చేస్తుందని ప్రకటించారు. మరి కమ్యూనిస్టుల సంగతి ఏమిటో అర్ధం కావడం లేదు. కమ్యూనిస్టులు చివరకు తనతో కలిసి రారని నమ్ముతున్నారా? లేక తమ పార్టీ ఒంటరిగా పోటీ చేయాలని భావిస్తున్నారా అన్నది వెల్లడి కావాల్సి ఉంది. జన నేన అధినేత మనసులో ఏముందో ఇప్పుడే చెప్పడం కష్టం.
గతసారి ద్విముఖ పోరులో అనుభవం పేరుతో చంద్రబాబుకు ఓటర్లు పట్టం కట్టారు. ఈ నేపథ్యంలోనే అతిపెద్ద పార్టీగా టీడీపీ అవతరించి ఏపీలో అధికారంలోకి వచ్చింది. అయితే, ఇప్పుడు పరిస్థితి మారింది. ఏపీలో రాజకీయ వ్యూహాలు మారిపోయాయి. పార్టీల ఎత్తులు... గమ్మత్తుగా సాగుతున్నాయి. ఈ నేపథ్యంలో 2019 ఎన్నికల్లో ఏపార్టీ అయినా సొంతగా మెజారిటీ రాబడుతుందనేది కల్లో మాటేనని మేధావులు అంటున్నారు. నిన్నటి వరకు తమకు ఎడ్జ్ ఉందని భావించిన టీడీపీ వాళ్లు కూడా తాజా పరిణామాలతో కాస్త టెన్షన్ గానే కనిపిస్తున్నారు. ఇప్పటికిప్పుడున్న రాజకీయ లెక్కలను పరిగణనలోకి తీసుకుంటే... మొత్తంగా 5 ప్రధాన పార్టీలు ఎన్నికల బరిలో నిలవనున్నాయి. ఏ పార్టీ పక్కన ఉంటారో తెలియని కమ్యూనిస్టులను పక్కన పెడితే... టీడీపీ, వైసీపీ, జనసేన, కాంగ్రెస్, బీజేపీ ఒంటరిగానే సత్తా చాటాలని భావిస్తున్నట్టు స్పష్టంగా కనిపిస్తోంది.