జిల్లాలో ఏదో విధంగా ఉనికిని చాటుదామనుకుంటున్న బీజేపీకి ఆదిలోనే ఆటంకాలు ఎదురవుతున్నాయి. విశాఖకు చెందిన బలమైన నాయకుడు చొక్కాకుల వెంకటరావు బీజేపీని వీడి వైసీపీలో చేరిపోయారు. నగరంలో పెద్ద సామాజిక వర్గాలలో ఒకటైన వెలమ కులానికి చెందిన వెంకట రావు బీజేపీని వీడిపోవడం ఆ పార్టీకి షాక్ ఇచ్చే పరిణామమే. సరిగా కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ విశాఖ వస్తున్న వేళ ఇలా ఫిరాయించడంతో కమలం పార్టీ కలవరపడుతోంది.
పట్టు తగ్గిన్నట్లే :
విశాఖ ఉత్తర నియోజకవర్గంలో గట్టి నాయకుడిగా ఉన్న చొక్కాకుల ఆర్ధికంగానూ బీజేపీకి అండదండగా వుండేవారు. వచ్చే ఎన్నికలలో అన్ని సీట్లకూ పోటీ చేయాలని బీజేపీ అనుకుంటోంది. ఆ సమయంలో చొక్కాకుల వంటి నేతల అవసరం చాలానే ఉంది మరి. టీడీపీతో కటీఫ్ తరువాత బీజేపీపై వచ్చిన వ్యతిరేకత చూసే ఆయన ఈ డెసిషన్ తీసుకున్నారని భావిస్తున్నారు.
ఉత్తరం కోసమేనా :
వైసీపీ నుంచి ఉత్తరం అసెంబ్లీ సీటుకు చొక్కాకుల ట్రై చేస్తున్నట్లు టాక్. పార్టీ అధినాయకత్వం కనుక సరే అంటే ఆయనే ఎమ్మెల్యే క్యాండిడేట్. అంటే వైసీపీ నుంచి బరిలోకి దిగి అక్కడ సిట్టింగ్ బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజుకే సవాల్ చేస్తారన్న మాట. అక్కడ కుల బలంతో పాటు, వైసీపీ కూడా స్టాంగ్ గా ఉండడంతో చొక్కాకుల సరైన నిర్ణయమే తీసుకున్నారని అంటున్నారు. ఆయన జంపింగ్ తో బీజేపీకి విశాఖలో ఉన్న ఏకైక సీటు కూడా ఈ దఫా డౌటేనంటున్నారు.