నారా లోకేష్ అధికారానికి మొదటిసారి ఎదురుతిరుగుతున్నారు టిడిపిలో. అది కూడా మొన్నటి ఎన్నికల్లో కాంగ్రెస్ నుండి టిడిపిలోకి వచ్చిన నేత, రాజ్యసభ సభ్యుడు టిజి వెంకటేష్. ఇంతకీ విషయం ఏమిటంటే, కర్నూలు అసెంబ్లీ, ఎంపి అభ్యర్ధులుగా ఎస్వీ మోహన్ రెడ్డి, బుట్టా రేణుకను లోకేష్ ప్రకటించటంతోనే గొడవ మొదలైంది. ఎందుకంటే, వచ్చే ఎన్నికల్లో ఎంఎల్ఏగా తన కొడుకు టిజి భరత్ ను పోటీ చేయించాలని వెంకటేష్ గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు. ఇటువంటి సమయంలో హటాత్తుగా లోకేష్ ఫిరాయింపు ఎంఎల్ఏ ఎస్వీ మోహన్ రెడ్డినే అభ్యర్ధిగా ప్రకటించటాన్ని టిజి జీర్ణించుకోలేకపోతున్నారు. అందులో నుండే ఏకంగా అభ్యర్ధులను ప్రకటించటానికి అసలు లోకేష్ ఎవరంటూ మండిపడుతున్నారు.
రెండు చోట్లా పిరాయింపులే దిక్కా ?
ఇంతకీ అటువంటి పరిస్ధితి ఎందుకు వచ్చింది ? అంటే, రెండు రోజుల క్రితం లోకేష్ కర్నూలు జిల్లాలో పర్యటించారు. ఆ సందర్భంగా ఓ సభలో మాట్లాడుతూ, వచ్చే ఎన్నికల్లో ఇద్దరు ఫిరాయింపు నేతలకు టిక్కెట్లు ప్రకటించారు. నిజంగా ఆ ప్రకటన టిడిపి సంప్రదాయానికి విరుద్దంగా జరిగింది. లోకేష్ ప్రకటనతో టిడిపి నేతలంతా నివ్వెరపోయారు. ఎందుకంటే, చంద్రబాబే ఇంత వరకూ ఒక్క టిక్కెట్టు కూడా ప్రకటించలేదు. అటువంటిది లోకేష్ ఏకంగా ఇద్దరు నేతలకు అదికూడా ఫిరాయింపులకు టిక్కెట్లు ప్రకటించటం ఆశ్చర్యంగా ఉంది.
కర్నూలు పార్టీలో చిచ్చుపెట్టిన లోకేష్
కర్నూలు జిల్లా కేంద్రంలో ఎస్వీ మోహన్ రెడ్డి, కర్నూలు ఎంపిగా బుట్టా రేణుకను వచ్చే ఎన్నికల్లో భారీ మెజారిటీతో గెలిపించాలంటూ లోకేష్ ప్రకటించారు. ఇపుడా ప్రకటనే కర్నూలు జిల్లా టిడిపిలో చిచ్చు రేపుతోంది. తాజాగా ఆ ప్రకటనపై టిజి వెంకటేష్ మాట్లాడుతూ, అభ్యర్ధులను ప్రకటించటానికి లోకేష్ ఎవరంటూ నిలదీశారు. అభ్యర్ధులను ప్రకటించే అధికారం ఒక్క చంద్రబాబునాయుడుకు మాత్రమే ఉందని టిజి వాదిస్తున్నారు. లోకేష్ జాతీయ పార్టీకి కేవలం ప్రధాన కార్యదర్శి మాత్రమే అని గుర్తుచేస్తున్నారు.
పంచాయితీకి సిద్ధమవుతున్న టిజి ?
టిజి మాటలు చూస్తుంటే లోకేష్ ప్రకటనను ధిక్కరేచ్చేట్లుగా ఉండటంతో పార్టీ నేతలు ఆశ్చర్యపోతున్నారు. ఇదే అసెంబ్లీ నియోజకవర్గంలో తన కొడుకు టిజి భరత్ ను పోటీ చేయించేందుకు గట్టి ప్రయత్నాలు చేసుకుంటున్న సమయంలోనే లోకేష్ ప్రకటన చేయటంతో వెంకటేష్ మండిపోతున్నారు. ఈ పంచాయితీని చంద్రబాబు ముందే తేల్చుకునే ఉద్దేశ్యంలో టిజి ఉన్నట్లు స్పష్టమవుతోంది.