పోలవరం ప్రాజెక్టును సందర్శించిన కేంద్ర జలవనరుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుపై సీరియస్ అయ్యారు. ఈరోజు ప్రాజెక్టును సందర్శించిన గడ్కరీ ప్రాజెక్టు వ్యయం పెరగటంపై సీరియస్ అయ్యారు. ప్రాజెక్టు వ్యయం ఎందుకు పెరిగిందో చెప్పాలంటూ చంద్రబాబును సూటిగా ప్రశ్నించారు. ఎన్డీఏలో నుండి చంద్రబాబు బయటకు వచ్చేసిన తర్వాత గడ్కరీ ప్రాజెక్టును సందర్శించటం ఇదే తొలిసారి.
పోలవరం వ్యయం ఎందుకు పెరిగింది ?
ప్రాజెక్టు వ్యయాన్ని చంద్రబాబు తన ఇష్టం వచ్చినట్లు పెంచుకుంటూ పోతున్నారు. ప్రాజెక్టు వ్యయం పెంచటంతో పాటు డిటైల్డ్ ప్రాజెక్టు వ్యయాన్ని కూడా పెంచుకుంటూ పోతున్నారు. ప్రాజెక్టు వ్యయం రూ. 3 వేల కోట్ల నుండి రూ. 33 వేల కోట్లకు పెరిగిపోయింది. అంచనాల వ్యయంలో చంద్రబాబు ఎప్పుడూ కేంద్రం అనుమతి తీసుకోలేదన్నది వాస్తవం. ప్రాజెక్టు వ్యయం పెంచాలంటే కేంద్రంలోని జలవనరుల శాఖ, ఆర్ధికశాఖల అనుమతి తప్పదు. కానీ కేంద్రంతో ఎటువంటి సంబంధం లేకుండానే చంద్రబాబు తనిష్టం వచ్చినట్లు అంచనా వ్యయాలను పెంచుకుంటూ పోతున్నారు.
కేంద్రం అనుమతులు తీసుకోవాల్సిందే
ఇక్కడే కేంద్ర-రాష్ట్రాల మధ్య సమస్యలు తలెత్తుతోంది. పెరిగిపోతున్న అంచనాలపై కేంద్రం అనుమానాలు వ్యక్తం చేస్తోంది. ఆ నేపధ్యంలోనే చంద్రబాబు ఎన్డీఏలో నుండి బయటకు వచ్చేయటంతో అంచనా పెంపు ఫైల్ కేంద్రం వద్దే పెండింగ్ లో ఉండిపోయింది. అదే విషయాన్ని చంద్రబాబును కేంద్రమంత్రి అందరి ముందూ నిలదీశారు. డిటైల్డ్ ప్రాజెక్టు రిపోర్టు (డిపిఆర్) పెంపు విషయంలో కూడా చంద్రబాబు కేంద్రం అనుమతి తీసుకోకపోవటాన్ని గడ్కరీ తప్పు పట్టారు. పెంచిన వ్యయానికి సంబంధించి అడ్వాన్స్ ఇవ్వటం తన పరిధిలో ఉందా లేదా అన్నది కూడా తాను పరిశీలించాలని చెప్పటం గమనార్హం. గడ్కరీ ప్రశ్నలకు చంద్రబాబు సరైన సమాధానం చెప్పలేకపోవటం టివిల్లో స్పష్టంగా కనబడింది. చూడబోతే గడ్కరీ తాజా వ్యాఖ్యలతో పోలవరంకు కేంద్రం నిధులు ఇవ్వటం అనుమానంగా మారింది.