ఎన్నికల హీట్ పెరుగుతున్న సమయంలో కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం మళ్ళీ యాక్టివ్ అవుతున్నారు. కాపుల మద్దతు కావాలంటే ఓ షరతు విధించారు. కాపు రిజర్వేషన్లకు ఏ పార్టీ అయితే కచ్చితమైన హామీ ఇస్తుందో ఆ పార్టీకే కాపులు మద్దతుఇచ్చే విషయమై ఆలోచిస్తారట. ముద్రగడ విధించిన తాజా షరతుపై కాపు సామాజిక వర్గంలోనే బిన్నమైన వాదనలు వినిపిస్తున్నాయి. పోయిన ఎన్నికల్లో కాపులకు రిజర్వేషన్లంటూ హామీ ఇచ్చిన చంద్రబాబునాయుడు కత ఏమైందో ముద్రగడ మరచిపోయినట్లున్నారు. ఒక కులానికి రిజర్వేషన్ కల్పించాలన్నా, మార్చాలన్నా రాష్ట్రప్రభుత్వ పరిధిలోని లేదన్న విషయం ముద్రగడకు తెలీదా ? రాష్ట్రం చేసిన తీర్మానాన్ని కేంద్రప్రభుత్వం కచ్చితంగా ఆమోదించాల్సిందేనంటూ న్యాయనిపుణులు చెబుతున్నారు.
మళ్ళీ కులరాజకీయాలు
పోయిన ఎన్నికల్లో చంద్రబాబు హామీ ఇచ్చిన దగ్గర నుండి కాపు రిజర్వేషన్లపై ఇప్పటి వరకూ ఏం జరిగిందో అందరికీ తెలుసు. మళ్ళీ ఎన్నికలు సమీపిస్తున్న నేపధ్యంలో కుల రాజకీయాలు మళ్ళీ తెరమీదకు వస్తున్నాయి. ఇటువంటి సమయంలోనే కాపుల మద్దతు కావాలంటే రిజర్వేషన్లపై హామీ అంటూ ముద్రగడ మళ్ళీ పట్టుబడుతున్నారు. హామీలదేముంది ఎవరైనా ఇచ్చేస్తారు. ఇచ్చిన హామీ అమలులోకి రావాలంటేనే కదా కష్టం.
అన్నీ పార్టీలు హామీ ఇచ్చేస్తే ఏం చేస్తారు ?
కాపు రిజర్వేషన్లపై హామీ ఇచ్చారనే కదా చంద్రబాబునాయుడుకు కాపుల్లో మెజారిటీ పోయిన ఎన్నికల్లో మద్దతిచ్చింది ?
కాపులకు రిజర్వేషన్ కల్పించటమన్నది రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో లేదని తెలిసి మళ్ళీ అదే అంశంపై ముద్రగడ పట్టుబడితే ఉపయోగం ఏముంది ? ముద్రగడ కూడా స్పష్టమైన హామీనే అడుగుతున్నారు. హామీదేముంది ? అవసరం కాబట్టి ఎవరైనా ఇచ్చేస్తారు. ముద్రగడ కోరుకుంటున్న హామీని జగన్, పవన్ కల్యాణ్ తో పాటు మళ్ళీ చంద్రబాబు కూడా ఇస్తే అపుడు ముద్రగడ ఏం చేస్తారు ?
ఇతర అంశాలపై పట్టుబడితే బాగుంటుంది
కాబట్టి కాపు సామాజికవర్గం అభివృద్ధిపై ముద్రగడలో చిత్తశుద్ది ఉంటే రిజర్వేషన్ అంశాన్ని పక్కనపెట్టేసి రాజకీయ, ఆర్ధిక, సామాజిక న్యాయం కోసం పట్టుపట్టాలి. కాపు సామాజికవర్గం కోసం ముద్రగడ అనేక ఉద్యమాలు నిర్వహించారనటంలో సందేహం లేదు. కాకపోతే ఒక్కోసారి వాస్తవాన్ని మరచిపోయి ముద్రగడ మొండిపట్టుదలకు పోతుంటారనే వాదన కూడా కాపుల్లో ఉంది. ఇపుడు కూడా ముద్రగడ తో పాటు కాపు మేధావులు కోరుకుంటున్నట్లు ఏ పార్టీ అయితే పై అంశాల్లో స్పష్టమైన హామీ ఇస్తుందో వారికే మద్దతంటే అర్ధముంటుంది. అలా కాదని మళ్ళీ రిజర్వేషన్ అంశాన్ని మాత్రమే పట్టుకుని వేలాడుతుంటే ఆ అంశం ఎప్పటికీ ' ఆవు పై వ్యాసం' లాగే ఉండిపోతుంది.